Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
ప్రేమ విఫలమైనప్పుడు యువతీ, యువకులు భావోద్వేగాలకు లోనుకావద్దని హైకోర్టు న్యాయవాది పింగళి లక్ష్మీ తెలపారు. నేడు యువతీ యువకుల మధ్య ఆకర్షణను ప్రేమగా భావించి. అమ్మాయి తమ ప్రేమను తిరస్కరించినపుడు అబ్బాయిలు వారిపై దాడులు, వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ అనురాగ్ విద్యా సంస్థల్లో గురువారం సుకల్ప స్కిల్స్ సెంటర్ నిర్వహకులు మహిపతి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో 'ప్రేమ తిరస్కరణ ఆ తరువాత' అనే అంశంపై చర్చావేదికను జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పింగళి లక్ష్మీ మాట్లాడుతూ.. ప్రజలు స్వేఛ్చగా జీవించడానికి రాజ్యంగం కల్పించిన హక్కును అందరూ సద్వినియోగంచేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్న వారిని కఠినంగా శిక్షించడానికి, రాజ్యంగంలో అనేక చట్టాలు ఉన్నాయని ఆమె తెలిపారు. అంతకు ముందు కళాశాల కార్యదర్శి పల్ల నీలిమా రెడ్డి మాట్లాడుతూ. మానసిక పరిపక్వతకు సైకో మెట్రిక్ పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలని ఆమె సూచించారు. సినిమాలు, సామాజిక వేదికలు, అంతర్జాలం ద్వారా యువత తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె అన్నారు. ప్రేమలో విఫలమైనపుడు యువత భావోద్వేగాలకు గురై దాడులకు యత్నించరాదని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్టు విరెేందర్, డైరెక్టర్ కే.ఎస్.రావు, సుకల్ప స్కిల్ సెంటర్ కో ఆర్డినేటర్లు కృష్ణ ప్రసాద్, నాగశ్వేత, రవికాంత్, స్వప్న, జ్యోతి, నాగేశ్వర్రావు, ఆనంద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.