Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహేశ్వరం ఎమ్మెల్యే
- నిర్మాణం పూర్తి కాని ట్యాంకులను ప్రారంభించిన ఎమ్మెల్యే
- నాసిరకంగా మిషన్ భగీరథ ట్యాంకుల నిర్మాణం
నవతెలంగాణ - మీర్పేట్
ప్రజలను నీటి సమస్య నుంచి విముక్తి కలిగించేందుకు ప్రతి ఒక్కరం సమిష్టిగా పనిచేసి వేసవి కాలం రాకముందే నీటి ఎద్దడి రాకుండా ప్రతి ఇంటికీ మంచి నిరందించాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మిషన్ భగీరథలో భాగంగా నిర్మించిన జిల్లెల్గూడ మున్సిపాలిటీలో రాఘవేంద్రానగర్లో లక్ష లీటర్లు, మీర్పేట్ మున్సిపాలిటీలో ద్వారకామయినగర్, డీఎల్ఆర్ఎల్ కాలనీలలో 90 వేల లీటర్ల సామర్థ్యం గల మంచినీటి ఓవర్హెడ్ ట్యాంకులను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడికెళ్లినా నీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్పారు. అందుకే ఈ ట్యాంక్లను ప్రారంభించామన్నారు. ప్రతి కాలనీలో, ప్రతి ఇంటికీ రోజు తప్పించి రోజు మంచినీరు అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడ నీటి సమస్య ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పరం సంప్రదించుకుని ప్రజలకు నీటి సమస్య రాకుండా చూడాలన్నారు. నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుని పొదుపుగా వాడాలని సూచించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఓఎన్జీఎం పద్మజ, ప్రాజెక్టు మేనేజర్ రాజేందర్, జిల్లెల్గూడ, మీర్పేట్ కమిషనర్లు వసంత, శ్రీహరి, ఏఈ రామ్మోహన్, ఎంపీపీ విక్రంరెడ్డి, పలువురు ఎంపీటీసీలు, కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, మీర్పేట్ మున్సిపల్ అధ్యక్షులు పల్లె జంగయ్య గౌడ్, పంతంగి మాధవి, వివిధ కాలనీలవాసులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
అసంపూర్తిగా నిర్మాణమైన ట్యాంకును ప్రారంభించిన ఎమ్మెల్యే
ఇంటింటికీ మంచినీరు అందించడమే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం కింద మంచినీటి ఓవర్హెడ్ ట్యాంకులను రూ.కోట్టు వెచ్చించి నిర్మిస్తున్నారు. దానిలో భాగంగానే జిల్లెల్గూడ, మీర్పేట్ మున్సిపాలిటీలలో 6 మంచినీటి ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మిస్తుండగా ఇప్పటి వరకు 5 ట్యాంకులు నిర్మాణంలో ఉండగా ఒకటి ఇంకా పనులు చేపట్టలేదు. అయితే నిర్మాణంలో ఉన్న 5 ట్యాంకులలో 3 ట్యాంకులను (జిల్లెల్గూడ రాఘవేంద్రానగర్, మీర్పేట్ ద్వారకామయినగర్, డీఎల్ఆర్ఎల్ కాలనీలలో) ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిర్మాణం పూర్తి కాకముందే ప్రారంభించారు. ఈ 3 ట్యాంకులు నాణ్యతా ప్రమాణాలు లోపించి ఉన్నాయని, అసంపూర్తిగా ఉండగానే కలర్లు వేసి పూర్తి చేశారని, నీరు కూడా ఇస్తున్నామని చెప్పుకోవడం కోసం అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు ఆదర బాదరగా ప్రారంభిస్తున్నారని కొంత మంది ప్రజలు ఆరోపిస్తున్నారు. అసంపూర్తిగా నిర్మించిన ట్యాంకులను ప్రారంభించడం సబబేనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.