Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికలకు సిద్ధం
గ్రేటర్లోని నాలుగు పార్లమెంట్ స్థానాలు మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో రెండు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఎక్కడికక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఎన్నికల్లో ప్రధానంగా ఓటరు జాబితా, ఉద్యోగులు, సిబ్బంది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఈ మూడు రెడీగా ఉంటే సగం ఎన్నికలు పూర్తయినట్టే. ఇక మిగిలిన ప్రక్రియంతా సాఫీగా జరిగిపోతుందని అధికారులు చెబుతున్నారు. నవతెలంగాణ-సిటీబ్యూరో
- నాలుగు స్థానాల్లో త్రిముఖ పోటీ అ సర్వం సిద్ధం చేసిన ఎన్నికల సంఘం
గ్రేటర్లో సార్వత్రిక ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో తమదే విజయమంటూ ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్లోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంట్ స్థానాల్లో హేమాహేమీలు బరిలో ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ త్రిముఖ పోటీ నెలకొందనే చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తిచేశారు.
హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మైనార్టీ ఓటర్లకు పెట్టింది పేరు. ఈ స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో అత్యధికంగా ముస్లిం మైనార్టీ ఓటర్లే ఉన్నారు. ఇక్కడి నుంచి మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, టీఆర్ఎస్ నుంచి పుస్తే శ్రీకాంత్, కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ఖాన్, బీజేపీ నుంచి భగవంత్రావు పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మజ్లీస్, టీఆర్ఎస్ల మధ్య స్నేహ పూర్వక పోటీ నెలకొంది. ఇతర నియోజక వర్గాల్లో ముస్లిముల ఓట్లన్నీ టీఆర్ఎస్ అభ్యర్థులకు వేయను న్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ఖాన్ అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే మైనార్టీ వర్గాల్లో ఫిరోజ్ఖాన్కు మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ జరిగే పోటీ అసదుద్దీన్, ఫిరోజ్ఖాన్ మధ్యే ఉంటుందని, పోటీ నువ్వా...నేనా అనే రీతిలో సాగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
లష్కర్ అంటే బోనాలకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ మినీ భారతంలా విభిన్న జాతులు, మతాలు, కులాల ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి 2004, 2009లో రెండు సార్లు అంజన్కుమార్యాదవ్ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి బండారు దత్తాత్రేయ విజయం సాధించారు. ఆ వెంటనే ఆయనకు కేంద్రమంత్రి పదవి దక్కింది. ఈ సారి బీజేపీ నుంచి కిషన్రెడ్డి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కుమారుడు సాయికిరణ్యాదవ్ను రంగంలోకి దింపారు. ఈ పార్లమెంట్ స్థానంలో నాంపల్లి తప్ప మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లే విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా టీఆర్ఎస్కు ఓట్లు పడితే సాయికిరణ్ గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం. కానీ బీజేపీ సిట్టింగ్ స్థానంతో పాటు ఇక్కడ కిషన్రెడ్డికి సైతం మంచి అదరణ ఉందని, పోటీ ఉత్కంఠగా సాగే అవకాశం ఉందని చెబుతున్నారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్దది. 2014లో ఇక్కడి నుంచి మల్లారెడ్డి టీడీపీ తరుపున విజయం సాధించి టీఆర్ఎస్లో చేరారు. ఈయన మేడ్చల్ నుంచి గెలిచి మంత్రిపదవి దక్కించుకున్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి మల్లారెడ్డికి స్వయాన అల్లుడైన మర్రి రాజశేఖర్రెడ్డి పోటీ చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డికి విద్యావేత్తగా మంచి పేరుంది. ఇక కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కూడా కింది స్థాయిలో బలంగా ఉంది. దీంతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రేవంత్రెడ్డికి ఈ సారి సానుభూతితో ప్రజలు ఓట్లు వేస్తారనే చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆ ప్రాంతంలో ప్రచారం ప్రారంభించారు. సభలు, సమావేశాల్లో తన పదునైన మాటలతో ప్రజలను ఆకర్శిస్తున్నారు. బీజేపీ నుంచి రాంచందర్రావు పోటీ చేస్తున్నారు. ముగ్గురూ రాజకీయంగా బలమైన వారు కావడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా సాగనుంది.
చేవెళ్ల స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. 2014లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన విభేదాల కారణంగా అధికార పార్టీని వీడి ప్రతిపక్షపార్టీలో చేరారు. విశ్వేశ్వర్రెడ్డికి స్థానికంగా బాగా పట్టుంది. ఇక టీఆర్ఎస్ నుంచి గడ్డం రంజిత్రెడ్డి పోటీ చేస్తున్నారు. ఉద్యమ సమయంలో పార్టీలో చురుగ్గా పని చేశారని ఆ పార్టీనేతలు చెబుతున్నారు. బీజేపీ నుంచి బి.జనార్ధర్రెడ్డి పోటీ చేస్తున్నారు.