Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కంటోన్మెంట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ ప్రాజెక్టు కింద చాలా చెరువులు కొంత మేర అభివృద్ధి చెందాయి. కానీ రామన్నకుంట కుంట చెరువు మాత్రం అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉందని చెప్పుకోవచ్చు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బోయినపల్లిలో ఉన్న ఈ చెరువు సుందరీకరణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెరువుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందుకు నిధులు కూడా కేటాయించింది. కానీ ఎన్ని పథకాలు నిధులు కేటాయించినా రామన్న చెరువు పరిస్థితి మాత్రం అద్వానంగా మారింది. ఒకప్పుడు ఈ చెరువులోని నీటిని తాగేందుకు వినియోగించేవారు. ఇప్పుడు ఆ చెరువులోకి మురుగు నీరు చేరడంతో కాలుష్యంగా మారి దుర్గందం వెదజల్లుతోంది. 1994 అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూ బదలాయింపు కింద ఈ చెరువు కింద ఉన్న స్థలాన్ని డిఫెన్సీ వారికి కట్టబెట్టింది. ఒకప్పుడు 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు కబ్జాదారుల కొరల్లో చిక్కుకుని ప్రస్తుతం 5 ఎకరాలకు పరిమితమైంది. అప్పటి ఎంపీ మల్లారెడ్డి చెరువు సుందరీకరణ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు సుముఖత వ్యక్తంచేశారు. కానీ అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా చెరువు అభివృద్ధికి మిలటరీ వారు అడ్డుతగలడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కొందరు వ్యక్తులు చెరువు చుట్టూ పక్కల స్థలాన్ని కబ్జా చేసి అందులో నిర్మాణాలు చేపట్టారు. రానురాను చెరువు స్థలం కనుమరుగవడాన్ని గమనించిన మిలిటరీ అధికారులు చెరువులో ఎలాంటి అభివృద్ధి పనులను అనుమతించడం లేదు. దీనికి తోడు చుట్టూ పక్కల కాలనీల నుంచి విడుదలయ్యే మురుగు నీరంతా చెరువులోకి మళ్లించడంతో అందులోని నీరంతా కలుషితమై అందులో నుంచి వచ్చే దర్వాసన వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీటి కారణంగా దోమలు కూడా వేగంగా వ్యాప్తి చెంది రాత్రుళ్లు తమను నిద్రపోనివ్వడం లేదంటూ చుట్టూ పక్కల స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలాఉంటే 2014లో మల్లారెడ్డి ఎంపీగా ఎన్నికైన మొదట్లోనే చెరువు సుందరీకరణ చేపట్టి, దసరాకు బతుకమ్మలు వేసేందుకు వీలుగా బతుకమ్మ ఘాట్ నిర్మాణం చేస్తామని, వాకర్ల కోసం ప్రత్యేకంగా వాకర్ ర్యాంప్ నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. కాలం వేగంగా ముందుకు సాగిపోయి అప్పుడు ఎంపీగా ఉన్న మల్లారెడ్డి ప్రస్తుతం మంత్రి అయ్యారు, కానీ చెరువు మాత్రం అభివృద్ధి ఇంకా దూరంగానే ఉంది. చెరువు అభివృద్ధి కోసం బోర్డు అధికారులు, పాలకమండలి సభ్యులు అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి చెరువులో మురుగు నీరు చేరకుండా ఉండేందుకు గానూ అవుట్లెట్ ఏర్పాటుకు గ్రీన్ సిగల్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పనులు మాత్రం ముందుకు సాగకపోవడంతో చెరువులో యథావిధిగా గుర్రపు డెక్క పెరగి, దోమలు విజృంభించడంతో వాటి ద్వారా చుట్టూ పక్కల ప్రజలు విష జ్వరాలకు గురవుతున్నారు. చెరువు అభివృద్ధి కోసం రక్షణ శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా వారు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. చెరువు అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రభుత్వం 1994లో బేగంపేటలో పీజీ కాలేజీ కోసం తీసుకున్న స్థలాన్ని డిఫెన్సీ వారికి బదలాయింపు చేస్తే చెరువు అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా బోర్డు అధికారులు దీనిపై స్పందించి చెరువు మొత్తాన్ని శుభ్రం చేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.