Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బేగంపేట
తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్ద రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేకు ఎంతో కీలకమైనది. ప్రతి రోజూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లతో పాటు, లోకల్ రైళ్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. రైల్వే స్టేషన్కు, రైల్వే స్టేషన్ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులతో స్టేషన్ ముందు బస్టాప్లు నిత్యం కిక్కిరిసి ఉంటాయి. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఇలాంటి ప్రాంతంలో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మిస్తున్న ఏసీ బస్టాప్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 12 నెలల నుంచి ఉన్న బస్ షెల్టరు పోయి కొత్త బస్ షెల్టర్ నిర్మాణం కాక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కానీ బస్టాప్లు నిర్మిస్తున్న జీహెచ్ఎంసీ యంత్రాంగం మాత్రం దీని గురించి పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తుండటం గమనార్హం.
12 నెలల నుంచి కొనసాగుతున్న పనులు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఏసీ బస్టాప్లను నిర్మించాలని జీహెచ్ఎంసీ యంత్రాంగం నిర్ణయించి 12 నెలల క్రితం ప్రారంభించింది. పదో నెంబరు బస్సులు ఆగే బస్టాప్లో మొత్తం 5 ఏసీ షెల్టర్లను నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. ఇలా 12 నెలల క్రితం ప్రారంభించిన ఈ బస్సు షెల్టర్ నిర్మాణ పనులు ఇంత వరకూ ఒక కొలిక్కి రాలేదు. ఇక్కడ బస్సు షెల్టర్ లోపల మొత్తం ఏసీ ఏర్పాటు చేసి ప్రయాణికులు సేదతీరేందుకు, బస్సుల కోసం వేచి చూసేందుకు ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. అలాగే ఇక్కడే కాఫీ షాప్, ఏటీఎం లాంటివి ఏర్పాటు చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని భావించారు. కొంత మేరకు కేవలం బస్సు షెల్టరు ఏర్పాటు చేశారు కానీ విద్యుత్, ఏసీ, కాఫీ షాప్ లాంటివి ఏర్పాటు చేయలేదు. ఈ పనులు ఇంకెప్పుడు పూర్తవుతాయోనని ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. కొద్ది నెలల నుంచి మొత్తం పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కానీ అధికార యంత్రాంగం వీటి గురించి పట్టించుకోకపోవడం గమనార్హం.
ప్రయాణికుల ఇబ్బందులు వర్ణనాతీతం..
ఏసీ బస్టాప్ నిర్మాణం కోసం గతంలో ఉన్న పాత బస్టాప్ను తొలగించారు. దీంతో ఇక్కడికి వచ్చే ప్రయాణికులు రోడ్డు మీదే చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అసలే వేసవి కాలం కావటంతో ఎండకు ఉండలేక చెట్ల నీడకు, షాపుల ముందు బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఏసీ షెల్టరు సంగతి అటుంచితే ఉన్న షెల్టరు తీసివేత తమను రోడ్డుపై పడేశారంటూ ప్రయాణికులు వాపోతున్నారు. దీనికి తోడు ఇరుకైన రోడ్డు ఉండటంతో, ఏ మాత్రం ప్రయాణికులు అప్రమత్తంగా లేకపోయినా ప్రమాదాల భారిన పడాల్సిన పరిస్థితులున్నాయి. ఇక్కడ ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలుసుకునేందుకు కనీస సూచికలు కూడా లేవు. గతంలో బస్టాప్లకు ఉన్న సూచికలు తొలగించిన అధికారులు తాత్కాలికంగానైనా సూచికలు ఏర్పాటు చేయకపోవటంతో ప్రయాణికులు బస్సుల వివరాల కోసం ఫుట్ఫాత్ వ్యాపారులను, ఇతర బస్సుల సిబ్బందిని వాకబు చేస్తుంటారు. కొత్తవారు మరింత గందరగోళానికి గురి కావాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు వేగవంతం చేసి త్వరలో ప్రయాణికులకు బస్సు షెల్టర్ అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.