Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వర్
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
చాదర్ఘాట్ ఆది హిందూ విద్యా సంస్థను సజీవంగా నిలిపి పాఠ్య గ్రంథాలలో భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రను బోధించి, ఆయన స్మృతులను సజీవంగా నిలుపు కుందామని తెలంగాణ వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మాదారి భాగ్యరెడ్డి వర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ 131 వ జయంతి బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని మాట్లాడుతూ.. వందేండ్లకు పూర్వమే కుల వివక్షకు వ్యతిరేకంగా, నిమ్న జాతుల ఉద్దరణకు ఉద్యమించిన పోరాట యోధుడు భాగ్యరెడ్డి వర్మ అని అన్నారు. ప్రశ్నించే శక్తిని పెంచుకునేందుకు విద్య సాధనమని నమ్మి బడుగు, బలహీన వర్గాలకు విద్యా సంస్థను స్థాపించిన సంఘ సంస్కర్త వర్మ అని చెప్పారు. జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ.. వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయని, తరువాతి కాలంలో స్వార్థ శక్తులు వ్యక్తుల మధ్య అంతరాలను సృష్టించారని చెప్పారు. భాగ్యరెడ్డి వర్మ గొప్ప సంఘ సంస్కర్త అని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ ఎస్టీ కమిషన్ పూర్వ అధ్యక్షులు డాక్టర్ ఎస్.చెల్లప్ప మాట్లాడుతూ..2016 సంవత్సరపు నివేదిక ప్రకారం దళితులపై 5041 అట్రాసిటీ కేసులు నమోదైనా యన్నారు. వీటిని ఆపే ప్రయత్నం దళిత చైతన్యం ఉన్న ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భాగ్యరెడ్డి వర్మ తెలంగాణ అంబేద్కర్ అని, నిమ్న జాతుల ఐక్యం కోసం ఆది హిందూ పేరును వాడుకలోకి తెచ్చారన్నారు. ఆది హిందూ పాఠశాలలో ఉపాధ్యాయులను భర్తీ చేయాలని, అంబేద్కర్ గురించి పరిశోధనలు చేసి నట్టుగానే విశ్వ విద్యాలయాలలో పరిశోధనలు జరగాలని చెప్పారు. రచయిత ఎస్ శ్రీనివాస్, ప్రొఫెసర్ సుధారాణి పాల్గొన్న సభకు కార్యదర్శి అజరు గౌతమ్ నివేదిక సమర్పించారు.