Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్యనారాయణ వర్ధంతి సభలో సీఐటీయూ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి విఠల్
నవతెలంగాణ-ధూల్పేట్
దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులకు భంగం కల్గిస్తున్న పాలకులపై సకల రంగాల కార్మికుల్ని పోరాటాలకు చైతన్య పర్చాలని, పోరాటాలు చేయాలని సీఐటీయూ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి జి.విఠల్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని సీఐటీయూ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ పర్సా సత్యనారాయణ వర్ధంతి జుమ్మేరత్ బజార్ సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమస్యల్లో ఉన్న కార్మికుల వద్దకు సత్యనారాయణ వెళ్లి, కార్మిక సమస్యల పరిష్కార మార్గాలను సూచించేవారన్నారు. కార్మిక రంగంలోని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే వారని గుర్తు చేశారు. సీఐటీయూ గోషామహల్ నాయకులు పి.నాగేశ్వర్ మాట్లాడుతూ..సింగరేణిలో సంఘటిత ఉద్యమానికి నేతృత్వం వహించిన ఆయన రాష్ట్ర వ్యాప్త కార్మిక ఉద్యమానికి నేతృత్వాకి జీవితాంతం కృషి చేశారన్నారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జియాగూడలోని సీఐటీయూ కార్యాలయంలోనూ నాయకులు సత్యనారాయణ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దేవయ్య, కిషన్, శ్రీరాములు, భవన నిర్మాణ కార్మిక సంఘం బేగంబజార్ లేబర్ అడ్డా కమిటీ కన్వీనర్ రామకృష్ణ, దేవినగర్ బస్తీ సంఘం కార్యదర్శి రాజు, ఆటో సంఘం నాయకులు సత్యనారాయణ, కార్యకర్తలు మారుతి, యాదయ్య, నర్సింహా, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.