Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రేటర్లో 4 లోక్సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు
- ఏర్పాట్లు చేసిన అధికారులు
- హైదరాబాద్ జిల్లాలో 14 కేంద్రాల్లో కౌంటింగ్
- ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కు 14 టేబుళ్లు
- జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల నేతత్వంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
నవతెలంగాణ - సిటీబ్యూరో
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందికి రెండు విడతల శిక్షణ కార్యక్రమాలతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ తెలిపారు. లెక్కింపు పనులకు అవసరమైన సిబ్బందితో పాటు మరో 20 శాతం మంది రిజర్వులో ఉంచినట్టు దానకిషోర్ ఇప్పటికే ప్రకటించారు. జిల్లా పరిధిలోని రెండు లోక్సభ స్థానాల్లోని14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓట్లను 14 కేంద్రాల్లో లెక్కించనున్నారు. ఒక్కో సెగ్మెంట్ ఓట్లు లెక్కించేందుకు 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేయనున్నారు.
ఓట్ల లెక్కింపులో మొదటగా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నట్టు దానకిశోర్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని పోస్టల్ బ్యాలెట్లను నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులైన హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలకుల సమక్షంలో లెక్కించనున్నారు. హైదరాబాద్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు నిజాం కాలేజీలోనూ, సికింద్రాబాద్ ఓట్ల లెక్కింపు ప్రొఫెసర్ జి.రామిరెడ్డి దూర విద్యాకేంద్రంలో ఉంటుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి గందరగోళానికి తావులేకుండా, పొరపాట్లకు ఆస్కారం లేకుండా లెక్కింపు సిబ్బందికి రెండు విడతలుగా ఇప్పటికే శిక్షణ పూర్తిచేశారు.
మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో..
గ్రేటర్లోని నాలుగు లోక్సభ స్థానాలకుగాను హైదరాబాద్జిల్లాలోని రెండింటికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. మరో రెండింటిలో మేడ్చల్ జిల్లాలో కలెక్టర్ ఎంవీరెడ్డి ఆధ్వర్యంలో, రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ లోకేష్కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత అసలైన ఓట్లను లెక్కించనున్నారు.
సిబ్బందికి శిక్షణ
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. తొలి విడత శిక్షణా కార్యక్రమం సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో జరిగింది. తొలివిడతలో లోక్సభ నియోజకవర్గాల వారీగా రెండింటిలోని రెండు బ్యాచ్లుగా నిర్వహించారు. రెండో విడత శిక్షణలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 14 బ్యాచ్లకు శిక్షణ ఇచ్చారు. అసెంబ్లీ సెగ్మెంట్లకు ఓట్ల లెక్కింపు సిబ్బందిని నేటి ఉదయం 6 గంటలకు ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ర్యాండమైజేషన్ ద్వారా కేటాయిస్తారు. ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అనంతరం 8.30 గంటల నుంచి అసలు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఐదు వీవీప్యాట్లలోని స్లిప్లను లెక్కించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే వీవీప్యాట్ స్లిప్లను ప్రత్యేక చాంబర్లో లెక్కిస్తారని తెలిపారు.