Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి కోటం రాజు
నవతెలంగాణ-దుండిగల్
కేంద్ర ప్రభుత్వంలో అసంఘటిత కార్మికుల ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులు దుర్వినియోగం చేయొద్దని తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి కోటం రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ దుండిగల్ మండలం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లిలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై సీఐటీయూ ఆధ్యర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిలుగా రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి కోటం రాజు, మేడ్చల్ జిల్లా సీఐటీయూ అధ్యక్షులు ఏ.అశోక్, భవన నిర్మాణ కార్మిక సంఘ గౌరవాధ్యక్షులు బాబూరావు, సీఐటీయూ జిల్లా నాయకులు శ్రీనివాస్, బి. లింగస్వామిలు హాజరై మాట్లాడారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘంలో వేలకోట్ల రూపాయలు ఉన్నాయని వాటిని కార్మికుల సంక్షేమానికి ఉపయోగించకుండా నీరుగారుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ప్రధాన రోడ్లపై కూలీలుగానే ఉంటున్నారని వారికి కనీస షెడ్డు నిర్మాణాలూ ఏర్పాటు చేయడంలేదన్నారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి కనబర్చడంలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల కోట్ల రూపాయల నిధులున్నాయని తెలిపారు. అలాగే 60ఏండ్ల వయసున్న వృద్ధులకు రూ.6వేలు పింఛన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా కార్మికులను సంఘటితం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కొంపల్లి సీఐటీయూ నాయకులు ఆర్.సత్యం మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులు ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ఇప్పటికైనా అడ్డాలు, పర్మినెంట్ షెడ్లు నిర్మాణాలతో పనిముట్లతో సహా వారికి ఏర్పాటుచేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో గండిమైసమ్మ, దుండిగల్ మండల సీఐటీయూ కన్వీనర్ ఎమ్. మల్లేష్, భవన నిర్మాణ కార్మికుల జిల్లా నాయకులు లక్ష్మయ్య, అడ్డాల కార్మికులు యాదగిరి, కూర్మయ్య, భవంత్రెడ్డి, రాజు, సన్ని, శ్రీహరి, చంద్రయ్య, దుర్గమ్మ, సంఘమణి, బాలమణి, దుర్గేష్, శ్రీనివాస్, రాజు, మల్లేష్ నాగరాజులు పాల్గొన్నారు.