Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
ఇటీవల నగరంలో మిస్సింగ్ కేసుల విషయంలో పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నా రోజూ ఏదో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. చాలా చోట్ల చిన్న చిన్న మాటలకు తల్లిదండ్రులపై అలిగి వెళ్లిపోవడం, మరి కొన్ని చోట్ల అనాథ ఆశ్రమాల నుంచి తప్పిపోవడం, మతి స్థిమితం లేక సరైన భద్రత లేకపోవడంతో మిస్సింగ్ ఘటనలెన్నో నమోదవుతున్నాయి. మిస్సింగ్ జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభిస్తూ వారిని వెతికి పెట్టే పనిలో పోలీసలు నిమగమైపోతున్నారు. ఇక ఫిర్యాదులో వాస్తవాలు ఉంటే మిస్సైన వారు వెంటనే దొరికే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇక గత కొన్ని నెలలుగా హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పిపోయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. 2018లో తాండూరు సిరిగిరికి చెందిన అన్నారం మల్లేష్(13) మునగనూర్ కాలనీ ఎస్బీహెచ్ కాలనీలో ఉన్న ప్రసన్న ఫౌండేషన్లో ఉండేవాడు. హయత్నగర్లోని డిపో వద్ద శాంతినగర్ కాలనీలో నివాసం ఉండే మధనాచారి(58), ఈ ఏడాది జనవరిలో ఆర్కేనగర్ తట్టి అన్నారంలో నివాసం ఉండే ప్రమీల(45) మతిస్థిమితం లేని మహిళ, హయత్నగర్ సాయినగర్ కాలనీకి చెందిన నల్లగొండ మధుమతి(20), మునగనూర్ ఎస్బీహెచ్ కాలనీకి చెందిన జెట్టి సన్నీ(13), కొహెడ గ్రామానికి చెందిన పట్నంశెట్టి మణికంఠ(26), హయత్నగర్ పద్మావతి కాలనీకి చెందిన ఆవుల వెంకట్ రెడ్డి (53), పెద్దఅంబర్పేటకు చెందిన తుడి నగేష్(22), పెద్దసాయి కాలనీకి చెందిన అంబటి బాలాజీప్రసాద్(50), మునగనూర్లో ఉండే కర్టసీ ఫౌండేషన్ నుంచి గత ఏడాదిలో సేర్వేశ్(16) విద్యార్థి తప్పిపోయారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలలో పోలీసులు వారి ఫోటోలు ఆయా పబ్లిక్ ప్రాంతాల్లో అంటించడం, వారి ఆచూకి కోసం వాళ్ల కాల్డేటాలు ఆరాతీయడం, లుక్ అవుట్ నోటీసులు అంటించడం లాంటివి చేసి నూతన టెక్నాలజిని ఉపయోగించి త్వరితగతిన కేసులను చేధిస్తున్నారని పోలీసులు తెలిపారు.
మిస్సింగ్ కేసులను ఎఫ్ఆర్ఎస్ యాఫ్లో పూర్తి వివరాలు పొందుపరుస్తాం
మిస్సింగ్ కేసుల వివరాలను ఎఫ్ఆర్ఎస్, సీఐఎస్లో పూర్తి వివరాలను పొందుపరుస్తాం. మిస్సింగ్ కేసులు పలు రకాలుగా ఉంటాయి. మైనర్లు తప్పిపోయినట్టుయితే వారు దొరికిన వెంటనే తీసుకువెళ్లిన వారిపై పోక్సో, రేప్, కిడ్నాప్ కేసులు నమోదు చేస్తాం. వృద్దులు, మతి స్థిమితం లేని వాళ్లు తప్పిపోతే వెంటనే లుక్ ఔట్ నోటీసులు పెడతాం. పేపర్లలో ప్రకటనలు ఇస్తాం. పాంప్లేట్స్ రద్దీ ప్రదేశాల్లో అంటిస్తాం. ఇండ్లలో ఎవరైన అలిగి వెళ్లి పోతే వారి కాల్ డేటా ఆధారంగా వారి సమాచారం అందుకుంటాం.
- ఇన్స్పెక్టర్ సతీష్