Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు లేదా మూడ్రోజులకోసారి సరఫరా
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- నీటి లభ్యత తగ్గిపోయిందంటున్న అధికారులు
- వాటర్ట్యాంకర్లకు ఎక్కడివని ప్రశ్నిస్తున్న నగరవాసులు
నవతెలంగాణ-ముషీరాబాద్
ప్రకృతి నుంచి ఉచితంగా లభించే నీటిని డబ్బులిచ్చి కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడిందని నగరవాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలనెలా వేలకు వేలు బిల్లులు ముక్కుపిండి వసూలు చేసే అధికారులు నీటి సరఫరాలో మాత్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. రాష్ట్రంలో నీటి సమస్యే లేకుండా చేసేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి అనేక కార్యక్రమాల చేపట్టి రూ.వేలాది కోట్ల ప్రజలు సొమ్మును ఖర్చు చేస్తోంది. కానీ నగరవాసులకు నీటి కష్టాలు తీరడం లేదు. ప్రభుత్వం వాటర్ ఏటీఎంలు, పవర్బోర్లు వంటివి ఎన్ని ఏర్పాటు చేసినా అవన్ని కేవలం ప్రచారాలకే తప్ప ప్రజలకు ఎంత మాత్రం ఉపయోగపడటం లేదన్నది వాస్తవం. ముషీరాబాద్లోని అనేక ప్రాంతాలలో బోరు పడే అవకాశం లేక కేవలం రోజు విడిచి రోజు వచ్చే మున్సిపల్ నీటి మీదనే అనేక కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. మొన్నటి దాకా వేసవి పేరుతో నీరు సరిగా రాలేదు. ఇప్పుడెమో వర్షాలు రావడంలేదనే కారణంతో పైనుంచి నీటి సరఫరా సరిగా లేదని ఇంతకు వచ్చే సమయాన్ని కూడా తగ్గించారు. ఆ వచ్చే నీరు అయినా సరిగా వస్తుందా అంటే ప్రెజర్ తక్కువ చేసి వదులుతుండటంతో నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ప్రతి నెలా బిల్లులు కడుతూ ఆ నీరు సరిపోగా మళ్లీ డబ్బులు పెట్టి వాటర్ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కోవాలంటే పేద మధ్య తరగతి ప్రజల మీద భారం పడుతోందని వాపోతున్నారు. దినం విడిచి దినం వదలాల్సిన నల్లా వదలకుండా నీళ్లు లేవని చెప్పే అధికారులు డబ్బులు మాత్రం సగం తీసు కోకుండా ఫుల్గా ఎందుకు తీసుకుంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాగే నల్లా ద్వారా ఇవ్వడానికి నీరుండదు కానీ ట్యాంకర్ల ద్వారా అమ్ముకోవడానికి నీరు ఎలా వస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
నీటి సరఫరా పెంచాలి
నీరు తక్కువగా ఇవ్వడం వలన ఇంట్లో అవసరాలు తీర్చుకోలేక పోతున్నాం. ఇన్ని రోజులుగా సరఫరా చేస్తున్న నీటిని తగ్గించడంతో పాటు బోర్లూ ఎండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వాటర్ వర్క్స్ అధికారులు నీటి సరఫరా సమయం పెంచాలి. తక్కువ సమయం నీటిని వదిలితే అది సరిపోక మళ్లీ ట్యాంకర్లపైన ఆధారపడాల్సి వస్తోంది. ట్యాంకర్లు కూడా కొన్నిసార్లు అందుబాటులో లేకపోవడంతో ఎక్కువ ఖరీదు పెట్టి క్యాన్ల ద్వారా కొనాల్సి వస్తుంది.
- మూర్తి, గాంధీనగర్
ఉచితంగా ట్యాంకర్లు పంపాలి
ప్రతినెలా నల్లా బిల్లు కట్టించుకునే ప్రభుత్వం పైప్లైన్ ద్వారా నీటిని తక్కువగా సరఫరా చేస్తే, అందుకు ప్రతిఫలంగా ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటి నందించాలి. బిల్లు కట్టకపోతే నల్లా కనెక్షన్ కట్ చేస్తామనే వారు నీరు సరఫరా చేయనపుడు ఉచితంగా సరఫరా చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. పైపులు రిపేరని చెప్పి నీటిని నిలిపివేస్తే ఆరోజు ఆయా కాలనీలకు వాటర్ట్యాంకర్లను పంపించాలి.
- లక్ష్మి, గృహిణి
బోరు నీళ్ల మీదే ఆధార పడుతున్నాం
వేలకు వేలు తాగునీటి బిల్లులు కట్టుకుంటూ కూడా బోరు నీళ్ల మీదే ఆధార పడుతున్నాం . తాగేందుకు సరిపడా నీరు నల్లాద్వారా రావడంలేదు. ఎండా కాలం పోయినా, వానలు పెద్దగా పడకపోవటంతో బోర్లుకూడా సరిగా పనిచేయటం లేదు. కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో కూడా మేము ఉన్నాం.
- భీమయ్య, వాచ్మెన్
ట్యాంకర్లకు ఎక్కడ నుంచి వస్తున్నాయి
రోజు విడిచి రోజు నీళ్లు సరఫరా చేయటం లేదు. అదేమంటే పైనుండే సరఫరా లేదని అధికారులు చెబుతు న్నారు. బిల్లులు నెలనెలా కట్టించుకుని ఇండ్లళ్లకు సరఫరా చేసేందుకు నీరు లేకపోతే డబ్బులు తీసుకుని ట్యాంకర్ల ద్వారా ఎలా సరఫరా చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కమర్షియల్ షాపులకు ట్యాంకర్ల ద్వారా ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్న అధికారులు మాకు ఎందుకు చేయడం లేదు.
- మంగమ్మ, గృహిణి
వాటర్ బిల్లులు తగ్గించాలి
ప్రతినెలా నల్లా ద్వారా వసూలు చేసే రూ.రెండు వేలను తగ్గించాలి. నెల మొత్తం సరిగా నీరు సరఫరా చేయనపుడు ఎందుకు రెండువేల బిల్లులు చెల్లించాలి. డబ్బులు ఎమైనా చెట్లకు కాస్తున్నాయా? ఇక్కడ నష్టపోయేది మేము ప్రభుత్వం కాదు. నీటి సరఫరా ఆపేయటం వలన మేము వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటాం. అంటే నెలానెలా ప్రభుత్వానికి చెల్లించాలి, వాటర్ ట్యాంకర్లకు చెల్లించాలంటే ఇక మేము బతకాలా వద్దా? ధనిక, పేద, మధ్యతరగతి అనే తేడా లేకుండా అందరికి ఒకే బిల్లులు పెట్టినపుడు అందరికీ సమానంగా నీటిని వదిలేలా చూడాలి.
- అరుణ, గృహిణి