Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
బీసీ-ఏ లో ఉన్న బెస్త, గుండ్ల సామాజిక వర్గాన్ని ఎంబీసీలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర బెస్త, గుండ్ల చైతన్య సమితి అధ్యక్షులు పూస సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమితి ఆధ్వర్యంలో ఆదివారం హిమాయత్నగర్లోని బీసీ సాధికారత సంస్థ రాష్ట్ర కార్యాలయంలో టీఎన్జీవోస్ నగర కమిటీ కార్యదర్శిగా ఎన్నికైన కట్కూరి శ్రీకాంత్కు సమితి నాయకులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. గ్రామాలలో బెస్త, గుండ్ల కులస్తులు ఉన్నచోట ఇతర కులాలను చేపల వేట అనుమతించరాదని ఆయన కోరారు. చెరువులపై ఇతర కులస్తులు చేపల ఆధిపత్యానికి పాల్పడితే సొసైటీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 18 ఏండ్లు నిండిన సాంప్రదాయ మత్స్యకారులమైన బెస్త, గుండ్ల కులస్తులకు నేరుగా మత్స్యకార సొసైటీలలో సభ్యత్వాలు కల్పించాలని కోరారు. బెస్త, గుండ్ల కులస్తులపై గ్రామాభివృద్ధి కమిటీల ఆధిపత్యాన్ని అరికట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి శంకర్, ముఖ్య సలహాదారులు పూసా నర్సయ్య, అధికార ప్రతినిధి సురేష్, కోశాధికారి రవి, మహిళా విభాగం అధ్యక్షురాలు రేణుక, సంతోషిని, కొండమ్మ, బీసీ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి శేఖర్, తెప్పోత్సవ కమిటీ కన్వీనర్ పూస నర్సింహ పాల్గొన్నారు.