Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాంనగర్
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 60వేల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 'తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్- ఆర్టీసీ పరిరక్షణ- ఆర్టీసీ బీసీ ఉద్యోగుల భవిష్యత్ కార్యాచరణ' అనే అంశంపై తెలంగాణ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిరంజన్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ రద్దు చేయాలని చూస్తే ప్రజలు తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విధానాల వల్ల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వివిధ రాయితీల కింద తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన 1300కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్సీ ,ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు కొమురయ్య, సూపర్వైజర్స్ అసోసియేషన్ నాయకులు రామకృష్ణ పాల్గొన్నారు.