Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడ్మెట్
ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్లు వేసి అమ్మిన వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని, మల్కాజిగిరి ఆర్డీఓ మల్లయ్య హెచ్చరించారు. నేరేడ్మెట్లోని ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అల్వాల్ మండలంలోని జొన్నబండ సర్వేనెంబరు 582, 583లలో యూఎల్సీకి చెందిన భూములను అమ్మిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పనులు నిలిపివేశామన్నారు. నేరేడ్మెట్ సప్తగిరి కాలనీలోని 218/1 సర్వే నెంబరులో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చిందని దానిపై మల్కాజిగిరి తహీసల్దార్కు నివేదిక పంపించాలని తహసీల్దార్ను ఆదేశించినట్టు తెలిపారు. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. చెరువులో డ్రైయినేజీనీరు, కలుషితం చెత్త వేయకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాలు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణం చేపట్టిన వారిపై కఠినంగా వ్యవహరించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.