Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ముఠా సభ్యుల్లో ఒకరైన జీహెచ్ఎంసీ ఉద్యోగి శేరియర్ అలీఖాన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. యూసఫ్ గూడ అసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే మేకల జ్యోతి, అనుపమ, లక్ష్మి, జయంతి ఓ ముఠాగా ఏర్పడి డబుల్ బెడ్రూం ఇండ్ల మోసాలకు పాల్పడుతున్నారు. బహదూర్పుర, గౌలిపురలతో పాటు నగరంలోని మాదాపూర్, బేగంపేట, సికింద్రాబాద్, బండ్లగూడ వంటి ఎనిమిది ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూంలు అందజేస్తామని నమ్మబలికి మోసాలు చేశారు. ఇప్పటి వరకు 75 మంది వద్ద సుమారు రూ.15లక్షలు వసూలు చేశారు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.15 నుంచి రూ.18వేల వరకు వసూలు చేశారు. 35రూపాయల మీసేవా చలాన్లను కట్టించుకుని సంబంధిత ధ్రువపత్రాలను అందరిదగ్గర ఒకేలా తీసుకుని బాధితులను నమ్మించారు. అంతేకాకుండా టీఆర్ఎస్ సింబల్తో ఉన్న గుర్తులను ఒకేలాగా బాధితులకు అందజేశారు. ఇలా పక్కాగా పథకం ప్రకారం మోసాలకు పాల్పడ్డారు. కాగా ఈ మోసంతో ఏ రాజకీయ నాయకులకు సంబంధం లేదని డీసీపీ తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్లను కేవలం లాటరీ ద్వారా మాత్రమే అందజేస్తారన్నారు. ప్రజలు మళ్లీ మళ్లీ ఇటువంటి మోసగాళ్లను నమ్మి మోసపోవద్దన్నారు. ఇలాంటి మోసాలకు ఎవరైనా పాల్పడుతున్నట్టు కనిపిస్తే తమకు సమాచారమందివ్వాలన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసి వసూలు చేసిన సొమ్మును రికవరీ చేస్తామని తెలిపారు.