Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరైన పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ క్రమంలో జంక్షన్లు, ప్రధాన రహదారులపై సీసీటీవీలు ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తిచేసేందుకు జీహెచ్ఎంసీ, పోలీస్శాఖ సంయుక్తంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జోనల్ కమిషనర్లు, పోలీస్ కమిషనర్లు, సీఆర్ఎంపీ ఏజెన్సీలు, ఎల్ అండ్ టీ, జియో సంస్థల ప్రతినిధులతో జీహెచ్ ఎంసీ కార్యాలయంలో జీహెచ్ఎంసీ కమిష నర్ డి.ఎస్.లోకేష్ కుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ జితేందర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీ టీవీల ఏర్పాటుకు రోడ్ కట్టింగ్ జరిగిన 48 గంటలలోపు రోడ్డు పునరుద్దరణ కోసం ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్తో పాటు సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణ ప్రాజెక్ట్ను పైలెట్గా హైదరాబాద్ నగరంలో అమలు చేస్తున్నందున పోలీసు, జోనల్ కమిషనర్లు, ఏజెన్సీల మధ్య జోనల్ స్థాయిలో చర్చించుకుని రోడ్ కట్టింగ్ పనులను చేపట్టి వెంటనే పునరుద్దరణ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సూచించారు. స్మార్ట్ సిటీ కింద జంక్షన్లలో సీసీటీవీల ఏర్పాటుకు మూడు దశల్లో ఎల్అండ్టీ సంస్థ రోడ్ కట్టింగ్కు అనుమతులకై దరఖాస్తు చేసిన 2662 జంక్షన్లలో 2557 చోట్ల అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. ఈ రోడ్ కట్టింగ్ విస్తీర్ణం 59 కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు. అలాగే నెట్వర్క్ ఏర్పాటుకు రిలయన్స్ జియో 1077 జంక్షన్లలో మైక్రో కట్టింగ్కు అను మతులు కోరితే మొదటి విడతగా దరఖాస్తు చేసిన 493 చోట్ల దాదాపు 26 మీటర్ల కట్టింగ్కు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. రిలయన్స్ జియో ఏజెన్సీ సీసీ కెమెరాలకై 5280 పోల్స్ ఏర్పాటుకు 221 మీటర్ల పొడవున రోడ్ కట్టింగ్కు అనుమతి ఇచ్చారు. రోడ్ కట్టింగ్ జరిగిన చోట శిథిలాలను తొలగించాల్సిన బాధ్యత సీసీ కెమెరాల ఏర్పాటు సంస్థలదేనని స్పష్టం చేశారు. అలాగే ఇంటిగ్రేటెడ్ పార్కింగ్ సిస్టం, డార్క్స్ స్పాట్ల రిపేర్లు, ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు జంక్షన్స్లో ప్రతి శాఖ తమ అవసరాలకై వేర్వేరు పోల్స్ నిర్మించుకుండా అందుబాటులో ఉన్న పోల్స్ను సమిష్టిగా వినియోగించుట, వీధి వ్యాపారుల కు లొకేషన్ లింక్తో గుర్తింపుకార్డుల జారీ తదితర అంశాలను చర్చించారు. 533 చోట్ల ఇప్పటికే నెట్వర్క్ కనెక్షన్లు ఉంటే, కొత్తగా నెట్వర్క్ ఏర్పాటుకు 297 లొకేషన్లలో 5.79 కిలో మీటర్ల పొడవున మైక్రో కట్టింగ్ పనులు పూర్తి చేశారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియాఉద్దీన్, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, రాచకొండ అడిషనల్ కమిషనర్ సుధీర్బాబు, సైబారబాద్ ట్రాఫిక్ డీసీపీ విజరుకుమార్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎల్.ఎస్.చౌహాన్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్, జోనల్ కమిషనర్లు ఎన్.రవికిరణ్, వి.మమత, బి.శ్రీనివాస్రెడ్డి, సామ్రాట్ అశోక్, ప్రావిణ్య, అదనపు కమిషనర్లు పాల్గొన్నారు.