Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చివరి రోజు పోటెత్తిన సందర్శకులు
- ఎగ్జిబిషన్ బయట పుట్పాత్ వ్యాపారానికి పెరిగిన గిరాకీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్ మంగళ వారం అర్ధరాత్రితో ముగిసింది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు ప్రతి ఏటా జరిగే ఈ నుమాయిష్ ఈసారి మూడు రోజులు పొడ ిగించడంతో ఈ నెల 18 అర్ధరాత్రితో ముగిసింది. ఈ ఏడాది 46 రోజుల పాటు కొనసాగిన నుమాయిష్ను 20.5 లక్షల మంది సందర్శకులు తిలకించినట్టు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. మంగళవారం చివరి రోజున సుమారు లక్ష మంది వరకు వచ్చే అవకాశాలు ఉన్నందున ఎగ్జిబిషన్ సొసైటీతో పాటు హైదరాబాద్ సిటీ పోలీసు యంత్రాంగం, ఇతర శాఖల అధికారులు విస్తతస్థాయిలో ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు ఎగ్జిబిషన్ను అందుబాటులో ఉంచుతున్నట్లు సొసైటీ కార్యదర్శి ప్రభాశంకర్, కోశాధికారి వినరుకుమార్ ముదిరాజ్ సోమవారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సొసైటీ నిర్వాహకులు మంగళవారం ఉదయం నుంచే అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల నుంచే సందర్శకుల తాకిడీ క్రమ క్రమంగా పెరిగు తూ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇసుకేస్తే రాలనంతగా సందర్శకులు నుమాయిష్ను సందర్శించారు. నుమాయిష్ చివరిరోజు కావడంతో తక్కువ ధరకు విక్రయాలు జరుగుతాయన్న ఉద్దేశంతో మహిళలు పెద్ద సంఖ్యలో నుమాయిష్కు చేరుకున్నారు. అయితే ఏ స్టాల్స్కు వెళ్లినా అవే ధరలు దర్శనమిచ్చాయి. వస్త్రాలు, చీరలు, యూత్ అమ్మాయిలకు సంబంధించిన వస్త్రాలు, కాస్మోటిక్, అలంకరణ వస్తువుల ధరలు ఏమాత్రం తగ్గకపోవడంతో వచ్చిన వారంతా నిరాశకు గురయ్యారు. ఎగ్జిబిషన్లో కొనుగోలు చేసేకంటే బయట కొంటేనే తక్కువ ధరకు దొరుకుతున్నాయని, ఇక ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటే ఆఫర్లో ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ దొరుకుతుందని చాలా మంది మహిళలు మాట్లాడుకోవడం కనిపించింది.
ఇదిలావుండగా నుమాయిష్ చివరి రోజు కావడంతో స్టాల్స్ ఖాళీ చేసే వ్యాపారులు తమ వస్తువులను బయటకు తెచ్చి తక్కువ ధరకు విక్రయిస్తారన్న ఉద్దేశంతో మహిళలు, రోడ్డున పోయేవారు ఎగబడి కొనుగోలు చేశారు. అయితే ఆయా వస్తువుల స్టాల్స్ బయట పెట్టింది నుమాయిష్ లోపని వ్యాపారులు కాకపోవడంతో చాలా మంది చీఫ్ క్వాలిటీ వస్తువులుగా భావించి వదిలేశారు. సుల్తాన్ బజార్, కోఠి, అబిడ్స్, మదీనా, పటేల్మార్కెట్, లాడ్బజార్, లాడ్సాహెబ్ బజార్, చార్మినార్, మదీనా మార్కెట్, ఖిల్వత్ తదితర ప్రాంతాలకు చెందిన ఫుట్పాత్, చిరు వ్యాపారులు తక్కువ క్వాలిటీకి చెందిన వస్తువులను తెచ్చి నుమాయిష్ బయట ఫుట్పాత్లపై పెట్టి విక్రయించారు. తెలిసిన వాళ్లు వాటి జోలికి వెళ్లలేదు. అసలు విషయం తెలియని వాళ్లు తక్కువ ధరకుల వస్త్రాలు, కిచెన్వేర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, మహిళల అలంకరణ వస్తువులు, చీరలు, చిన్న పిల్లల ఆట వస్తువులు, దుస్తులను ఎగబడి కొనుగోలు చేశారు.