Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్లైఓవర్లపై పల్టీలు కొడుతున్న వాహనాలు
- వరుస ఘటనలతో నగర వాసుల బెంబేలు
- బ్రిడ్జీలు, డివైడర్ల వద్ద నిత్యకృత్యంగా ప్రమాదాలు
- ప్రతిరోజూ పదుల సంఖ్యలో గాయాలపాలు
- మరణవార్త లేకుండా ఉండని రాజధాని
నవతెలంగాణ-సిటీబ్యూరో
గతేడాది నవంబర్ 23న మధ్యాహ్నం 1.04 నిమిషాల సమయంలో కారు గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మీదుగా 19 మీటర్లపై నుంచి గాలిలో ఎగురుతూ కింద రోడ్డుపై పడింది. 105 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న కారు పడడంతో పల్టీలు కొడుతూ చెట్టు కింద కుమార్తెతో కలిసి బస్సు కోసం వేచి చూస్తున్న సత్యవేణి అనే వృద్ధురాలిపై పడింది. ఈ ఘటనలో తల శరీర భాగాలు ఛిద్రమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పొ యింది. చెట్టు కూకటివేళ్లతో సహా పడిపోయింది. ఈ సంఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
కానీ కారు నడుపుతున్న కల్వకుంట్ల కృష్ణ మిలాన్రావు మాత్రం కారులోని ఎయిర్ బెలూన్లు తెరచుకోవడంతో గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో దాదాపు 45 రోజుల పాటు ఈ రూట్ను మూసివేసి ప్రమాదాలకు గల కారణాలను అధికారులు అంచనా వేశారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉండగా, వేగాన్ని అదుపు చేయడంలో అధికారుల చర్యలు పనిచేయడం లేదు. తాజాగా మంగళవారం సనత్ నగర్ పీఎస్ పరిధిలోని భరత్ నగర్ ఫ్లైఓవర్ పైనుంచి కారు ప్రమాదవశాత్తూ కిందపడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హఠాత్తుగా కారు పై నుంచి కింద పడటంతో బ్రిడ్జి కిందున్నవారు భయంతో పరుగులు తీశారు. వేకువజామున ఈ ప్రమాదం జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది.
కంటతడి పెట్టించిన ఘటన...
2016 జూన్ 1న గారాలా పట్టి రమ్య(9) స్కూల్కు తయారైంది. మూడో తరగతి చదువుతున్న రమ్యకు సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ స్కూల్లో సీటు వచ్చింది. తొలిరోజు దాంతో పాటు కొత్త స్కూల్ కావడంతో ఇంట్లోని అమ్మా నానా, బాబారులు, తాతయ్య హడావుడిగా తయారయ్యారు. అయితే ఆలస్యం అవుతుండడంతో రమ్యతండ్రి వెంకటరమణ ముందుగా రమ్యను తీసుకొని కారులో బయలుదేరాడు. ఉదయం స్కూల్లో కూతురిని దించేశాడు. తిరిగి పాపను ఇంటికి తీసుకచ్చేందుకు వెంకటరమణ సోదరులైన రాజేష్, రమేష్, భార్య రాధిక, తండ్రి మధుసూదనాచారికి వెంకటరమణ వెళ్లారు. రాజేష్ కారును నడిపిస్తున్నారు. స్కూల్కు వెళ్లి పాపాను కారులో ఎక్కించుకొని ఇంటికి బయలుదేరారు. చిన్నారి తొలిరోజు స్కూల్కు వెళ్లిన కబుర్లు ఇంటూ మురిసిపోతున్నారు. చిన్నారి మాట్లాడుతున్న మాటల్తో అందరు ఆనందంలో మునిగిపోయారు. అంతలోనే తాగుబోతుల రూపంలో మృత్యువు కబలించింది. నారాయణ గూడలో బీటెక్ చదువుతున్న శ్రావెల్ ఎన్.సూర్య, విష్ణు, అశ్విన్, సాయి రమేష్, అలెన్ జోసెఫ్ కారులో వస్తున్నారు. అంతకుముందు బంజారాహిల్స్ సినీ మ్యాక్స్లో సినిమాచూసిన వీరు టీజీఐ ఫ్రెడేస్లో మద్యం సేవించి కారులో బయలు దేరారు. అప్పటికే మద్యం మత్తులో జోగుతున్న ఆరుగురిలో శ్రావెల్ కారు నడిపిస్తున్నాడు. వేగంగా కారు నడపడంతో, అది అదుపుతప్పి డివైడర్ను ఢకొీట్టి పల్టీలు కొట్టింది. ఈ క్రమంలో పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి వస్తున్న రాజేష్ కారుపై పడింది. కారునడుపుతున్న రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కారకులైన ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. కానీ రమ్య కుటుంబం మాత్రం బలైపోయింది. నాలుగు కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.
సర్వసాధారణమైన ప్రమాదాలు
హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లోని జాతీయ రహదార్లపై సైతం అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. చందానగర్ టూ హయత్నగర్, శంషాబాద్ టూ ఎల్బీనగర్ వరకు ఉన్న జాతీయ రహదారులతోపాటు రాజీవ్ రహదారిపై ప్రమాదాలు స్వర సాధారణంగా మరిపోయాయి. దాంతోపాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలల్లో గత కొన్ని నెలలుగా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఇదే తరహాలో నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలల్లో నిండు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. దాంతో బాధిత కుటుంబాల్లో కడుపుకోత మిగులుతోంది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటా వేచిచూడాల్సిందే.