పూర్వం ఉన్న కొలతలు ఇప్పుడు ఎక్కువగా అమలులో లేవు కానీ గ్రామీణ ప్రాంతాలో ఇప్పటికీ అప్పటి కొలతలను అనుసరిస్తున్నారు. ధాన్యం, ఇతర వ్యవసాయ, పాడి ఉత్పత్తులను ఈ కొలతలను ఉపయోగించే క్రయ విక్రయాలు చేసేవారు. ఆసక్తి దాయకమైన ఈ కొలతల వివరాలు ఇవిగో...
ధాన్యం కొలతల్లో అతి చిన్న ప్రమాణం గిద్ద
2 గిద్దలు అర సోల
2 అర సోలలు ఒక సోల
2 సోలలు ఒక తవ్వ
2 తవ్వలు ఒక మానెడు
2 మానికలు ఒక అడ్డెడు
2 అడ్డలు ఒక కుంచెం
2 కుంచాలు ఒక ఇరస లేక కుండ
4 కుంచాలు (2 ఇరసలు) ఒక తూము
8 కుంచాలు (2 తూములు) ఒక గిద్దె /ఇద్దు / బస్తా
12 కుంచాలు (3 తూములు) ఒక ముత్తుం
16 కుంచాలు (4 తూములు) ఒక నల్తుం
80 కుంచాలు (20 తూములు) ఒక పుట్టి
డబ్బులు
స్వతంత్య్రానికి పూర్వం చలామణిలో ఉన్న డబ్బులు వేరుగా ఉండేవి. 1948కి పూర్వం 'హాలీ' చలామణిలో ఉండేది. దీన్నే ఉస్మానియా సిక్కా అనేవారు. హాలీ రూపాయకు 96 పైసలుగా ఉండేది. రూపాయలు వెండితో చేసి ఒక తులం బరువుండేవి. పైస, రెండు పైసలు, మూడు పైసలు, అయిదు పైసలు, పదిపైసలు, ఇరవై పైసలు నాణ్ణాలు ఉండేవి. ఈ మధ్య 25పైసలు, 50 పైసలు నాణ్ణాలూ చలామణి నుంచి తొలగిపోయాయి.
డబ్బులు
6 పైసలు ఒక వీసం లేక అణా.
2 వీసాలు బేడ
2 బేడలు పావల
2 పావలాలు అర్ధ రూపాయి
2 అర్ధలు ఒక రూపాయి
మన ద్రవ్యం విలువ తగ్గిపొయ్యే కొలదీ నాణ్ణాల చలామణిలో మార్పులు వస్తున్నట్లు అర్థమవుతోంది.
నాలుగు పైసలను ఒక 'కుచ్చం'గా పిలిచేవారు. హాలీ నాణ్ణాలు 1948లో హైదరాబాదు స్టేట్ ఇండియాలో కలిసిన తరువాత కూడా అంటే 1956 వరకు చలామణిలో ఉన్నాయి. 1956 తరువాత నయాపైసలు, ఆతరువాత పైసలు చలామణిలోకి వచ్చాయి.