దాసరి కులం ప్రధానంగా భిక్షాటన వృత్తిగా కలిగిన కులం. వీరు వైష్ణవులు. నిజానికి వీరు అనేక కులాల సంగమం అని చెప్పవచ్చు. శూద్ర కులాలవారిలో కొందరు తమ పిల్లలను దేవునికి వదిలివేయడం వల్ల ఏర్పడిన కులం ఇది. అయితే శూద్రులలో తక్కువ కులాలుగా భావించబడేవారి కుటుంబాలకు చెందిన పిల్లలకు తిరుపతి దేవస్థానం వంటి దేవాలయాల్లో ఉండే గురువులు దాసరిగా ముద్రవేసి వారికి కొన్ని నియమ నిబంధనలు విధించడంతో ఈ కులం ఆవిర్భవించిందంటారు.
సాధారణంగా దాసరులు తప్పాయి వంటి వాయిద్యాన్ని వాయిస్తూ పాటలు, మంత్రాలు వల్లెవేస్తూ భిక్షాటన చేసేవారు. కొంతమంది శూద్ర కులాలవారి కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే శవం ముందు దాసరివారు శంఖం ఊదుతూ, పాటలు పాడ్నిందుకు కొంత డబ్బులు ఇచ్చేవారు. అప్పట్లో కాలినడకనే తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారు యాత్రికులు. అటువంటి యాత్రికుల గుంపు ముందు దాసరులు నడుస్తూ భగవంతుని కీర్తించే పాటలు పాడుతూ ఉండేవారు. దారి పొడవునా యాత్రికుల బృందంలో భక్తి భావం రగిలించేందుకు ఇట్లా వీరి సేవలను ఉపయోగించుకునేవారు. ఈ దాసరుల్లో కొందరు ఎరుదండులుగా పేరు పొందారు. దేవునికి కొన్ని కోడె గిత్తలను వదిలేవారు రైతులు. వాటి ఆలనా పాలనా చూసి వాటికి రకరకాల విన్యాసాలు నేర్పి ఆడమన్నట్లు ఆడేలా తయారుచేసి ప్రదర్శనలు ఇవ్వడం ఎరుదండుల పని.
దాసరుల్లో ఆరు ఉపకులాలు ఉన్నాయి. వారు బలిజ దాసరి, జానప్ప దాసరి, పల్లి దాసరి, వల్లువ దాసరి, గంగెద్దుల దాసరి, గొల్ల దాసరి. అయితే వీరు కలిసి భోంచేయడం కాని, వివాహ సంబంధాలు కలుపుకోవటం కానీ చేయరు. వారికి పెద్దగా సాంఘిక కట్టుబాట్లు అంటూ ఉండేవి కావు.
దాదాపు వందేళ్ల క్రితం దక్షిణ భారత దేశంలో వీరి సంస్కృతిని చూసినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. అనంతపురం ప్రాంతంలో ఉన్న దాసరులను గురించి ఓ బ్రిటిష్ పరిశోధకుడు పేర్కొన్నాడు. ''యాచకుల్లో ఎక్కువ మంది దాసరులే. ఈ కులం కాపు, బలిజ, కురుబ, బోయ, మాల కులాల నుంచి వచ్చినవారితో ఏర్పడింది. ముఖ్యంగా చివరి రెండు కులాల (సాంఘికంగా తక్కువ కులాలు) నుంచి నియమించబడిన దాసరులను మిగతా దాసరులు తమతో కలిసి భోజనం చేయడానికి అనుమతించరు. దాసరులందరూ వైష్ణవులే. వైష్ణవ గురువులు వారికి శంఖు, చక్ర ముద్ర వేసి దాసరులుగా నియమించేవారు. అప్పటి నుంచి వారు దాసరిగా ఇంటింటికీ తిరుగుతూ భిక్షాటన చేసి జీవించాలి. ఈ కుటుంబాల్లో పుట్టిన పిల్లలకు ఇదే వృత్తి వంశపారంపర్యంగా వస్తుంది. భిక్షాటనకు బయలుదేరిన దాసరి దగ్గర శంఖం, దళసరి లోహపు ప్లేట్ (గాంగ్), పొడవాటి దీపపు కుంచె, ఓ భిక్షా పాత్ర, చిన్న హనుమంతుని బొమ్మ ఉంటాయి. దీపపు కుంచెలో దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండేలా చూసుకుంటారు. ఆ దీపం ఆరిపోతే అతడితో వెంకటేశుడు లేనట్టే అర్థం. అది అపశకునానికి సూచిగా భావిస్తారు. వీరు కొన్ని కులాలవారి ఇండ్లలో ఉత్సవాలు , పండుగల సందర్భంలో పూజలు నిర్వహిస్తారు.''
కర్నూలు జిల్లాలో ఎవరైనా అమ్మాయిని 'బసవి'గా వదిలితే ఆమె పెండ్లిచేసుకునే వీల్లేదు. ఒక దేవుని విగ్రహానికి ఆమెకు పెండ్లి చేస్తారు. అయితే ఈ సందర్భంగా 'గరుడకంభం' అని పిలువబడే దాసరి దీపపు కుంచెకు పూల దండ వేయిస్తారు.
మైసూరు ప్రాంతంలో కొన్ని కులాల్లో పెద్ద కుమారుడ్ని దాసరిగా దేవునికి అర్పించే ఆచారం ఉండేది. తెలుగు బనజిగ, హొలేయ, తీగల, వక్కలిగ వంటి కులాల్లో ఈ ఆచారం ఉండేది.
విధులు
దాసరి విధులు చాలా ఆసక్తి కరంగా ఉండేవి. అతడు రోజూ ఉదయం తలస్నానం చెయ్యాలి. భోజనం చేసేటప్పుడు పవిత్రతకు భంగం కలిగేలా పదార్థాలు ఒకదానితో ఒకటి కలవకుండా చూసుకోవాలి. ప్రతి శనివారం స్నానం తరువాత కొన్ని గంటలపాటు ప్రార్థన చేసిన తరువాత తనే వంట చేసుకోవాలి. వీధుల వెంట హరికీర్తనలు పాడుతూ, శంఖం ఊదుతూ తిరుగుతారు.
కొంతమంది గుడిదాసరులనే పేరుతో జీవించినట్లు తెలుస్తుంది. వీరు గుడిలోనే ఉంటూ జీవితాన్ని వెళ్లబుచ్చేవారు. వీరు చాలా అమాయకంగా, సాధారణ జీవితం గడిపేవారు. వీరికి పూర్తి విరుద్ధంగా 'దొంగదాసరుల'నేవారు ఉండేవారు. వీరు భయంకరమైన దొంగతనాలు చేసినట్లు చెబుతారు. నిజానికి వీరు పేరుకు మాత్రమే దాసరులని , చేసేవన్నీ నేరాలని పేరు గడించారు.
వైష్ణవ బ్రాహ్మణ గురువులకు కొందరు దాసరులు సేవకులుగా ఉండేవారు. గురువులు వస్తున్నారనే సమాచారాన్ని శిష్యులకు అందజేయడం, ఏదైనా పూజ సందర్భంలో కాని, ఏదైనా గ్రామం సమీపానికి గాని గురువు వచ్చాడని తెలియజేయడానికి ఞఱసఱష్ట్రరఞవ బాకా ఊదడం ఈ దాసరుల విధిగా ఉండేది. ఈ బ్రాహ్మణ గురువులు పూజల సందర్భంలో కొందరు నిమ్న కులాల వారిదగ్గరకు వెళ్లి తీర్థం ఇచ్చేవారు కాదు. అటువంటి సమయంలో దాసరులే తీర్థం ఇచ్చేవారు.
వైష్ణవ గురువులు శూద్ర కులాల వారిని దాసరులుగా మార్చే క్రమంలో ముద్రలు వేయడానికి కూడా దాసరులనే ఉపయోగించుకునేవారు. దాసరిగా ముద్ర వేయవలసి వచ్చినప్పుడు శంఖం, చక్రం ఉన్న లోహపు పరికరాన్ని ఎర్రగా కాల్చి దాన్ని దాసరులకు అందచేస్తే వారు దాసరిగా మారే తక్కువ కులాలవారికి ఆ ముద్రలు వేసేవారు. వివాహాల సందంర్భంలోను, సాంఘిక సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించుకోవడానికి, ఇతర సమావేశాల కోసం దాసరులు తిరుపతి, తిరుత్తని, తిరువల్లూరు వంటి పుణ్యక్షత్రాల్లో ఒకచోటికి చేరేవారు.
దాసరి ఉమ్మిన ప్రసాదం తింటారు
కోయంబత్తూరు జిల్లాలోని కారమడాయి దేవాలయంలో ప్రతి ఏడాది జరిగే ఉత్సవాలకు శూద్రకులాలవారు (మరీ తక్కువ కులాలుగా భావించబడినవారు) అధిక సంఖ్యలో హాజరై తమ కోరికలు తీరినందుకు దాసరులకు 'కవళం' వేసేవారు. ఈ కవళాన్ని అనేక పండ్ల ముక్కలు, పంచదార, బెల్లం, అటుకులు వంటి మిశ్రమంతో తయారుచేసేవారు. ఈ దేవాలయానికి అనుసంధానించబడిన దాసరులు మొల చుట్టూ చిన్న చిన్న గంటలు వేలాడదీసుకొని డ్రమ్స్ మోగిస్తూ ముందుకు కదులుతారు. ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చిన భక్తులు వారినోట్లో కొద్దిగా కవళం పెడతారు. దాసరి తన నోట్లో పెట్టిన కవళాన్ని కొద్దిగా తిని, మిగిలినదాన్ని భక్తుల దోసిళ్లలో ఊసేవారు. అలా దాసరి తమ చేతిలో ఊసిన కవళాన్ని భక్తులు మహా ప్రసాదంగా భావించి తినేవారు. ఈ ప్రసాదం తింటే తమకు ఉన్న జబ్బులు నయమవుతాయని, పిల్లలు కలుగుతారని భక్తులు విశ్వసించేవారు. కొందరు కవళం బదులుగా తమలపాకుల్ని దాసరి నోట్లో పెడితే అతడు వాటిని నమిలి భక్తుల నోళ్లలో ఊసేవాడు.
విశాఖపట్టణం ప్రాంతంలో ఉండే దాసరులను శంఖుదాసర్లు అని పిలిచేవారు. అయితే వీరు తిరిగి అనేక విభాగాలుగా జీవించారు. వీరు మేనమామ కూతుర్ని పెండ్లిచేసుకోవడం తప్పనిసరి. వితంతు వివాహాలకు అనుమతి ఉంది కాని విడాకులు తీసుకోవడానికి వీల్లేదు. చనిపోయిన తరువాత దహనం చేయడం, పెద్ద దినం, చిన్నదినం చేయడం వీరిలో ఉంది. అయితే ఆర్కాట్, అనంతపురం దాసరుల దగ్గరున్నట్లు వీరిదగ్గర రాగి భిక్షాపాత్ర, శంఖం, హనుమాన్ల బొమ్మ, దీపపు కుంచె వంటివి ఉండవు. విశాఖపట్టణ దాసర్లు అనేక చారిత్రక సంఘటనలు, స్త్రీపురుషులకు చెందిన కథలను జానపద గేయాల రూపంలో గానం చేయడంలో ఎంతో పేరుగాంచారు.
బొబ్బిలి పాట పేరుతో వారు పాడిన బొబ్బిలి యుద్ధం చరిత్ర ఎంతో ప్రఖ్యాతి గాంచింది. అట్లాగే అమ్మినాయుడు పాట మరొకటి. పాలకొండ తాలూకాలో అమ్మినాయుడనే దుష్టుడయిన గ్రామ పెద్దను అతడి దగ్గరే పనిచేసే ఒక సేవకుడు ఎట్లా చంపేశాడో రికార్డు చేసిన పాట ఇది.
ఇటువంటి చారిత్రక సంఘటనలను ఇద్దరు దాసరులు గానం చేస్తారు. ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తూ ఇంటిటికీ తిరుగుతూ పాడతారు. అట్లాగే వారాంతపు సంతల్లోను ఈ పాటలు గానం చేస్తారు. ఒకరు పాడుతూ ఉంటే మరొకరు వంతపాడతారు.
ఇప్పుడు దాసరివారి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నిజానికి వారి సాంఘిక ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయో పరిశోధన జరుగవలసిన అవసరం ఉంది. ఇప్పటికీ కొందరు హరిదాసుల రూపంలో సంక్రాంతి పండుగ సందర్భంలో వీధుల్లో కనిపిస్తున్నారు కొందరు దాసర్లు. ఎప్పుడో వైష్ణవ మత ప్రచారకులు తమ మత ప్రచారానికి పూర్తికాలిక కార్యకర్తలుగా (హోల్టైమర్స్) రిక్రూట్ చేసుకున్న రకరకాల కులాలవారిని ఇప్పుడు సమాజం ఓ తక్కువ కులంగా భావించి యాచకులుగా చూడటం ఎంతవరకు సబబో ఆలోచించాలి. వారికి గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించాల్సిన బాధ్యతనేటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలమీద ఎంతయినా ఉంది.
-జాతర డెస్క్
Authorization