ఆదిమ మానవుడు కనుగొన్న డప్పు మనిషి కనుగొన్న మొట్టమొదటి వాద్య పరి కరం. దీనితయారీకి పశువుల చర్మంతో పాటు చెక్కతో నిర్మించిన గుండ్రని చట్రం కూడా ఉపయోగించాడు ఆనాటి మానవుడు.అంటే చనిపోయిన పశువు తోలును ఎండిన తోలుగా మార్చడం, చెట్టు మానును కుదురు (గుండ్రం)గా మలచడం అన్నమాట. తరవాతి కాలంలో ఈ పనులు చేయ డానికి వేరు వేరు వృత్తులవారు ఏర్పడ్డారు. వారే చర్మకార /మాదిగ, మాష్టి, వడ్రంగి ఈ డప్పు తయారీలో పాల్టొంటున్నట్లు చెప్పవచ్చు. అయితే కొన్ని చోట్ల మాదిగ వారే పూర్తిగా డప్పును తయారుచేసుకుంటున్నారు. ఆదిమానవుడు వంటరి గా అడవిలో ఉన్నపుడు తన ఉనికిని మరొకరికి తెలియజేయడానికి, క్రూర జంతువులను లేదా తాను వేటాడదలుచుకున్న జంతువులను భయ పెట్టడానికి కాని, అందరు ఒకచోట చేరడానికి సంకేతంగా కాని, ప్రమాద హెచ్చరిక చేయడానికి గాని డప్పును ఉపయోగించుకున్నాడు.
డప్పు దరువు : రాయిని ఉపయోగించి జంతువు చర్మాన్ని ఒలిచి డప్పు తయారు చేసిన మానవుడు అదే రాయిని దేవునిగా పూజిస్తూ జంతు చర్మంతో చేసిన డప్పు వాయిస్తూ అనుష్టానాలు, కర్మకాండలు, భూతాన్ని వదిలించడం వంటి పనులు చేశాడు. దీనితో పాటు తాను సంతోషంగా ఉన్న సమయంలో ప్రకృతిలోని శబ్దాలకు అనుగుణంగా దరువు వేయడం నేర్చుకున్నాడు. ఆ శబ్దాన్ని విన్న ఆ గుంపులో కలిగిన చేతన గుపు సభ్యుల్లో నృత్యం చేయడానికి ఉత్తేజపరిచింది. ధ్వని తరంగాలు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలకు సైతం వినిపిస్తాయి. ముఖ్యంగా ఉదయ కాలం, రాత్రిపూటల్లో డప్పు దరువు ధ్వనులు ఎక్కువ దూరం వినిపిస్తాయి. దరువుకి గల మరో లక్షణం ఏమంటే మనిషి నరాల్లో ఉత్తేజాన్ని నింపుతుంది. మనుషులను పులకరింపచేస్తుంది. దరువులు వింటున్న వారు తమకు తెలియకుండానే దరువుకు తగ్గట్లు చిందులేస్తారు.
డప్పు దరువులు ఆయా సందర్భాన్ని బట్టి జాతర దరువు, ఊరేగింపు దరువు, పెండ్లి దరువు, చిందు దరువు, ఉసిగొల్పే దరువు, పూనకం దరువు, సంతోషం దరువు, పీర్ల దరువు, చావు దరువు అంటూ కొడతారు. గ్రామాల్లోను, పట్టణా ల్లోను జరిగే వివిధ శుభ, అశుభ కార్యాలకు డప్పును వాడుతూ ఉన్నారు. గ్రామాలలో దేవర జాతరలు, వనభోజనాలు, గ్రామసభలు జరుపుటకు డప్పుతో టమకా/చాటింపు వేయిస్తారు. అపుడు గ్రామస్తులు చావడి వద్ద చేరి తదుపరి జరుగవలసిన కార్యాలను నిర్వహిస్తారు. వ్యాపారస్తులు వస్తువులను అమ్ముట కొరకు ఆయా గ్రామాధికారి అనుమతితో ఆ గ్రామ పెద్ద మాదిగను పిలిచి డప్పు కొట్టమంటారు. శవాన్ని స్మశానానికి (బొందలగడ్డ) డప్పుల మోతతో మోసుకెళతారు. అపుడు బాధను తెలియపరుచు డప్పు ధ్వనిని వాయిస్తారు. డప్పు ధ్వనుల ద్వారా తెలియని వారు కూడా అశుభకార్యమని తెలుసుకోగలుగుతారు. ఆ ఇంటి వారితో పరిచయముంటే వెళ్ళి వారిని ఓదార్చడం జరుగుతుంది. పరిచయం లేని వారు కూడా అయ్యో పాపం అంటూ తమ సానుభూతిని వ్యక్తపరుస్తారు. డప్పుపై వేసే సానుభూతి దరువు గాలిలో కలిసిపోయిన ప్రాణాన్ని కలుస్తుందని, తద్వారా అతని ఆత్మ శాంతిస్తుందనేది చావు డప్పు దరువు ఉద్ధేశంగా కనిపిస్తుంది.
ఒకప్పుడు ప్రతి గ్రామంలో మాదిగల ఇండ్లలో కుటుంబానికి ఒక డప్పు తప్పకుండా ఉండేవి. అలా ప్రతి గ్రామంలో పది నుండి ఇరవై దాకా డప్పులు కనిపించేవి. గ్రామంలో ఏదైనా ఒక జాతర, పండుగ, పెండ్లి, చావులు, కందూరు, మొక్కుబడులు మొదలగు కార్యాలు జరుగుతున్నపుడు డప్పుల మోతతో ఊరంతా దద్దరిల్లేది. మూలనున్న ముసలమ్మ మొదలుకొని చంటి పిల్లల వరకు ఏ ఇంట్లో కార్యం జరుగుతుందో సులభంగా తెలుస్తుండేది.
.విజ్ఞానాభివృద్ధి జరగని రోజుల్లో నాటి సమాజం ఏ వృత్తి చేసేవారికి అదే వృత్తిని అంటగట్టి వారి ఆర్థిక, సామాజిక విజ్ఞాన అభివృద్ధికి అడ్డుకట్ట వేసింది. ప్రాచీన, మధ్యయుగ సమాజంలో వస్తు తయారీదారునికి, ఉత్పత్తిదారునికి (మాదిగ, వడ్రంగి, కుమ్మర, సాలె, మంగలి, నేత) బ్రాహ్మణీయ భావజాల భూస్వామ్యవ్యవస్థ తగిన ప్రాధాన్యాన్నివ్వలేదు. అంతే కాదు వృత్తి కులాల మేధాశక్తితో తయారైన వస్తువులతో తమ జీవనాన్ని గడుపుకుని ఆధిపత్యకులాలవారు వీరిని కింది వర్గాలుగా ముద్రవేశారు.
ఆధునిక కాలంలో సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి వస్తున్న పాటలకు డప్పు దరువే ప్రాణం. అనేకమంది కళాకారులు డప్పుపై పట్టు సాధిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి వలన రెడీమేడ్ (కంజర) డప్పులు మార్కెట్టులోకొస్తున్నాయి. డప్పును కనుగొనిన వారి వారసులకు అంద వలసిన ఆర్థిక వనరులను కొత్తగా వచ్చిన ప్రవృత్తి కళాకారులు తన్నుకు పోతున్నారు.
-ఎన్.కనకరత్నం
Authorization