సరిదె మాణిక్యమ్మ దేవదాసిగా జీవితాన్ని శ్రీరామునికి అంకితం చేసింది. ఆ వృత్తిలో ఆనందాన్ని అనుభవించింది. ఆమె మేనత్తలు ఆమెకు ముందు అదే దేవాలయానికి దేవదాసీలుగా ఉండేవారు. ఆ తరువాత ఈమెను కుటుంబం దేవదాసిగా దేవాలయానికి ఇచ్చింది. తెలియని వయసులో దేవదాసి కావడంతో అదే వృత్తిలో ఆమె ఒదిగిపోయింది. దేవదాసీ వ్యవస్థ రద్దు కావడంతో మాణిక్యమ్మ జీవితం వీధినపడింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రనాట్య పునరుద్ధరణకు ఏకైక ఆధారంగా ఆమె నటరాజ రామకృష్ణ వంటివారికి కనిపించింది. దీంతో ఆమె జీవితం మరో మలుపు తీసుకుంది. ఆ మలుపే ఆమెను కేంద్ర సంగీత నాటక అకాడెమీ అవార్డు వరకు తీసుకుపోయింది. ఒక నాటి దేవదాసి దేశంలోనే అత్యున్నత అవార్డుల్లో ఒకటైన కేంద్ర సంగీత నాటక అకాడెమీ అవార్డును ఎలా అందుకుందో చూద్దాం..
తెలుగువారి లాస్య నర్తనరీతి ఆంధ్రనాట్యం. ఆలయ ఆగమ నర్తనము, ఆస్థాన (ఆలయ+ రాజ) నర్తనము, ప్రబంధ పారిజాత నర్తనముల త్రివేణీ సంగమమై, విస్తారమైన ప్రదర్శనాక్రమం కలిగి సశాస్త్రీయమై మార్గ, దేశీ పద్ధతుల మేలుకలయికగా కటక్ నుంచి ఆదిలాబాద్ జిల్లా వరకు ఆలయాలలో, ఆస్థానాలలో సామాన్యుల కొరకు కూడా ప్రదర్శింపబడిన నర్తన రీతి ఆంధ్రనాట్యం. పై మూడు సంప్రదా యాల్లో ప్రముఖులైన ముప్పరు అయిదు మంది నృత్య సరస్వతులు, డా.నటరాజ రామకృష్ణగారు సమన్వయకర్తగా 1970లో రాజమండ్రిలో జరిగిన 'అభినయ సదస్సు'లో పాల్గొని, వేదకాలం నుండే భారత దేశంలో వెలుగొందుతూ, ఆంధ్రదేశంలో కూడా ప్రాచుర్యంలో ఉన్న స్త్రీల లాస్య నర్తన రీతికి 'ఆంధ్రనాట్యం' అని పేరు పెట్టారు. ఆనాటి సదస్సులో పాల్గొన్న వృద్ధ కళామూర్తుల్లో ఆలయ ఆగమ నర్తన విధానం తెలిసి, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు పాడుతూ అభినయించగల ఒకే ఒక్క కళావేత్తగా పరిచయమైన నర్తకి సరిదే మాణిక్యమ్మ.
పశ్చిమ గోదావరి జిల్లా బల్లిపాడు గ్రామంలో సరిదే సన్యాసి, గౌరమ్మలకు సరిదే మాణిక్యమ్మ 1921లో జన్మించారు. తన తొలి నృత్య పాఠాలను ఐదవ ఏట నానమ్మ శేషాచలం దగ్గర ప్రారంభించినప్పటికీ, గుడికి అంకితమివ్వాలనే ఉద్దేశ్యంతో, నానమ్మ వృద్ధాప్యం వల్ల దాసరి మహాలక్ష్మమ్మ దగ్గర నృత్యభ్యాసం చేశారామె. అభినయదర్పణం, భరతార్ణవంలను అధ్యయనం చేసి, ఆగమ విధానాన్ని ఆకళింపు చేసుకున్నారు. సంగీతం, నృత్యం, ఆగమశాస్త్ర సమన్వయంలో పూజానృత్యాలు, పురాణ ఇతిహాసాల అధ్యయనం చిన్న నాడే మాణిక్యమ్మ దినచర్యలో భాగమయ్యాయి. తొమ్మిదో ఏట వంశానుగతంగా వచ్చిన దేవ నర్తకి బాధ్యతలు స్వీకరించారు. 17వ శతాబ్దిలో వెలిసిన బల్లిపాడు మదనగోపాల స్వామి సేవకు అంకితమై దాదాపు నలభరు ఏళ్ళపాటు ఆ దేవునికి నృత్య సేవ చేశారు. నృత్త, నృత్య, అభినయాలతో పాటు, గాయకులతో కలిసి పాట పాడటం కూడా చేసేవారు.
గుడి గంటతో తెల్లవారు ఝామున ప్రారంభించే దినచర్య తిరిగి గుడి తలుపులు మూసి అష్టదిక్పాలురకు గుడిని అప్పగించేవరకూ సాగేది. రోజులో సగం సమయం ఆలయ అర్చనావిధిలో పాల్గొనడంతోనే గడిచిపోయేది. ఆమె ప్రపంచం మదన గోపాలస్వామి మాత్రమే. ఆమె జీవితం ఇలా గడిచిపోతున్న సమయంలో దేవదాసీ చట్టం, ఎండోమెంట్ యాక్ట్ వంటి చట్టాలు ఆమె జీవితాన్ని పెను మార్పులకు గురిచేసింది. దేవదాసీ వ్యవస్థ రద్దవ్వడం, దేవదాసిగా బాధ్యతలు నిర్వహించడం ద్వారా అనుభవిస్తున్న గుడి మాన్యం ఇరవై ఎకరాల మాగాణి ప్రభుత్వపరమయింది. దీంతో ఆమె జీవనం సాగించడం కష్టమైపోయింది. ఆమెకు గుళ్ళో నాట్యం చెయ్యడం, తప్ప వేరే పని తెలియదు. అందువల్ల అతి త్వరలోనే ఆమె దారిద్యం కోరల్లో చిక్కుకుంది. ఇదే సమయంలో అభినయసదస్సు జరిగింది.
1970లో జరిగిన అభినయ సదస్సు ఆమె జీవితాన్ని కొత్త తీరం వైపు తీసుకెళ్ళింది. ఆ సదస్సులో మాణిక్యమ్మ స్వయంగా పాడి అభినయించడం సదస్యుల ను ఆకట్టుకుంది. అన్నాబత్తుల బులి వేంకటరత్నమ్మ, పద్మశ్రీ నటరాజ రామకృష్ణల ప్రోత్సాహంతో 1972లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ ఆధ్వర్యంలో జరిగిన అభినయ శిక్షణాతరగతులను నిర్వహించే అవకాశం మాణిక్యమ్మకు దక్కింది.ఈ విధంగా ఆమె నృత్యార్చన తిరిగి ప్రారంభమయింది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో నృత్యకళానిలయంలో నృత్యగురువుగా 12 ఏళ్ళు ఎందరికో నృత్య విద్యను ధారపోశారు. జిల్లాలో నృత్యకళ పట్ల అవగాహన రావడానికి సరిదే మాణిక్యమ్మే కారణం. 1970 లోను, తిరిగి 1982లో నృత్య అకాడెమీ తరఫున 'ఆంధ్రనాట్యా'నికి సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులకు గాను సిలబస్ రాసే కమిటీ సభ్యురాలిగా వ్యవహరించారు. 1990లో సరోజినీ నాయుడు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (హైదరాబాద్ యూనివర్సిటీ) విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీగా ఆధ్యాత్మ రామాయణ కీర్తనాభినయాన్ని నేర్పారు.
సరిదే మాణిక్యమ్మ గారు 1970 నుండి ఆంధ్రనాట్యం సంప్రదాయాన్ని ప్రచారం చెయ్యటంలో, సంప్రదాయ కళాకారిణిగా ఆమె చేసిన సేవలకు, నృత్యకళా ప్రజ్ఞకూ, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలకు అభినయించే విశిష్ట రీతికి గుర్తింపుగా జాతీయ కేంద్ర సంగీత నాటక అకాడెమీ అవార్డు దక్కింది. హైదరాబాదు విశ్వవిద్యాలయం వారు, కాశీలో జాతీయ సంగీత నాటక అకాడెమీ వారు, తెలుగు విశ్వవిద్యాలయం వారు మాణిక్యమ్మగారి ఆధ్యాత్మిక కీర్తనల అభినయాన్ని వీడియోగా చిత్రించి భద్రపరిచారు.
జడ్చర్ల ఊరంతా అవ్వా అని పిలిచినా, శిష్యులంతా మామ్మగారని పిలిచినా మమతల మాధుర్యాన్ని పంచుతూ జీవించిన ధన్యజీవి శ్రీమతి సరిదే మాణిక్యమ్మ.
'ఆంధ్రనాట్యం' చరిత్రలో దేదీప్యమానంగా నిరంతరం వెలిగే ధృవతార, జాతిరత్నం మా గురువు సరిదే మాణిక్యమ్మ'.
-డా.సువర్చలా సురేష్
99890 50937
Authorization