భారత రాజ్యాంగం ఐదవ షెడ్యూల్డ్లో పేర్కొన్న గిరిజన తెగల్లో కోయలు ప్రధానమైన తెగ. ఒడిషా రాష్ట్రం మల్కాన్గిరి చత్తీస్గడ్ రాష్ట్ర అటవీ ప్రాంతాల్లోనూ కోయలు జీవిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం అడవులు, గోవిందరాపేట మండలం, మహాదేవ్పూర్, పెద్దపల్లి మంథనిలో కోయలు నివసిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు, పాకాలకొత్తగూడ, పాల్వంచ అడవులు బయ్యారం మండలం భద్రాద్రి గుండాల మొదలుకొని దమ్మపేట గోదావరి, శబరినది పరీవాహక ప్రాంతం, గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో కోయలు ఎక్కువగా కనిపిస్తారు. ఆదిలాబాద్, కొమురంభీం జిల్లాలలో అక్కడక్కడ ఉన్నారు. కోయల ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక జీవనాన్ని నదీ పరీవాహక ప్రాంతం ప్రభావితం చేస్తుంది. తమని తాము దొరల సట్టం (కోయ తెగల్లో ఉన్నతులు-దేవుడి వర్గం)గా పుట్ట దొరలు (నిజమైన దేవుళ్ళు)గా చెప్పుకుంటారు. గోండుల మాదిరిగా తమను తాము వారి పరిభాషల్లో 'కోయతూర్లు'గా చెప్పుకుంటారు.
కోయలను వారి వృత్తులను బట్టి ఏడు వర్గాలుగా విభజించవచ్చు అవి:
1. గట్టుకోయ లేదా రాచకోయ (కొండల మీద నివసించే వాళ్ళు)
2. గుమ్మకోయ (నదీ పరీవాహక ప్రాంతాలు, వాగులు, వంకల వెంట జీవించే వారు లేదా దోకసట్టం)
3. కమ్మరకోయ (ఇనుము పని చేసేవాళ్లు)
4. ముసరకోయ (ఇత్తడి పని, డప్పులను వాయించే వాళ్ళు)
5. గంపకోయ (బుట్టలు అల్లేవారు)
6. వడ్డెకోయ (పూజారులు)
7. పట్టెడ కోయ (కుల పురాణం చేప్పేవాళ్ళు)
కోయలలో కలసిపోయి కోయలుగా గుర్తింపు పొందిన మరో 4 తెగలు
1 డోలికోయలు, 2 కాక కోయలు, 3 మట్ట కోయలు, 4 లింగకోయలు
పరిశోథనల్లో కోయలో కొన్ని ఉప తెగలున్నట్లు గుర్తించారు అవి: రాచకోయ, పూసకోయ, పారటాకుల కోయ, కొండ కోయ, గంపకోయ, గొట్టెకొయ, గీతకోయ, వెదురుకోయ, గొత్తికోయ, చెంచుకోయ, భాషకోయ, అమ్ములకోయ.
భాష: కోయవారు కోయతూర్ భాషను మాట్లాడుతారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో కొం దరికి ఆ భాష రాదు. వారు తెలుగే మాట్లాడుతారు. భద్రాధ్రి జిల్లా భద్రాచలం ఏజెన్సీలోనూ, పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాంతంలోను కోయ తూర్ మాట్లాడితే వరంగల్ జిల్లా వంటి ప్రాంతాల్లో తెలుగు మాత్రమే మాట్లాడుతారు.
గోండుల జీవన విధానానికి అతి దగ్గరగా ఉండే కోయలను ఐదు వర్గాలుగా విభజించారు
అవి: 1) మూడవగట్టు (గోత్రం) 2) నాల్గవగట్టు 3) ఐదవగట్టు 4) ఆరవగట్టు 5) ఏడవగట్టు
ఈ విభజన ప్రధానంగా ఆయా గోత్రాల మధ్య వివాహ బంధాలు ఇతర కుంటుంబ బంధాలను ఏర్పరుస్తోంది.
పురుడు ఆచారం
కోయ స్త్రీలు నేల మీదే ప్రసవిస్తారు. మంత్రసానిలు ఉంటారు. పుట్టినవెంటనే పిల్లలకు కలి చల్లుతారు. దొండాకు పసరు పోస్తారు.
బాలింతలకు ఉప్పుచెక్క, పెద్దచెట్ల మందు పోస్తారు 11, 13, 15 రోజుల్లో పేర్లు పెడతారు. 21వ రోజు తొట్టెలో వేస్తారు. పిల్లల పేర్లు ఇలవేల్పు సమ్మక్క పేరు మీదే ఉంటాయి. నాగదేవత మీద,ఇతర దేవుళ్ళ పేరు మీద పెట్టుకుంటారు.
పండుగలు దేవతలు
కోయల పండగలు ఎంతో విశిష్టంగా ఉంటాయి. కోయలు ప్రధానంగా ఆరు రకాలు పండుగలు చేసుకుంటారు అవి
భూమి పండుగ లేదా విత్తు పండుగ
తొలకరి సమయంలో చేసే పండుగ భూమి పండుగ, విత్తనాలు చల్లడానికి ముందు పంటలు బాగా పండాలని బతుకులు బాగుండాలని భూమి తల్లికి గిరిజనులు చేసే పండుగ కావడంతో దీన్ని ''విత్తు పండుగ'' అని కూడా అంటారు. ఈ పండుగ మే నెల చివర జూన్ నెల మొదటి వారంలో చేసుకుంటారు. కుంటుంబం మొత్తం తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి గూడెంలో ఉన్న అంబలి, జావ, గంజి గడి ముంతలో కలిపి ఊరుచుట్టూచల్లడం, కోళ్ళను, యాటలను బలివ్వడం చేస్తారు. ఆ పక్కనే పారే వాగు వద్దకు చేరుకొని వాగులో పెద్ద చెలిమ తీస్తారు. కొత్త పసుపు బట్టలతో ముడి కట్టి పవిత్రంగా బద్రపరచిన ఇప్పపూల గుత్తులను తీస్తారు. యువకుడి కళ్ళకు గంతలు కట్టి, ఏడాదిలో వచ్చే కార్తులు (చైత్రం నుంచి ఫాల్గుణం) వరకు ఒక్కొక్కటిగా చదువుతూ, ఒక్కో ఇప్పపూవును చెలిమ నీటిలో వేస్తారు. ఒక కార్తి చదివి వేసిన ఇప్పపూవు చెలిమె నీటిలో మునిగితే ఆ మాసంలో భారీ వర్షాలు కురుస్తాయని. సగం మునిగితే ఓ మోస్తరు లేదా సగం వర్షాలు పడతాయని, అసలే మునగకపోతే ఆ కార్తెలో కాలం కాదని నమ్ముతారు. ఆయా కాలాలను బట్టి పంటలు వేస్తారు.
పొట్ట పండుగ
మాఘకార్తి ఆగష్టులో నిర్వహిస్తారు. పిల్లల కోసం పెద్దలు చేసే పండుగ ఇది. పంటలు పొట్టకు వచ్చిన సందర్భంగా పిల్లలు తినడానికి జరుపుకునే పండుగ. ఈ పండుగ చేసిన తర్వాతనే ధాన్యం, కంకులు, కూరగాయలు ముట్టు కుంటారు. ఏట పిల్ల లేదా కోడి పిల్లను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
కొత్తల పండుగ లేదా పెద్ద పండుగ
ఉత్తర కార్తె మొదటి వారంలో సెప్టెంబర్లో నిర్వహంచే పండుగ గిరిజనేతరుల పెదరమాస లేదా అమవాస్య రోజు నిర్వహించే పండుగనే కోయలు పెద్దల పండుగ అని నిర్వహించుకుంటారు. ఈ పండుగను వడ్డె దొర ముందుండి జరిపిస్తాడు. ఇలవేల్పు అమ్మవారికి కోడి పుంజులు అర్పించి పెద్దలను స్మరించుకుంటారు.
సమ్మక్క పండుగ లేదా పౌర్ణమి లేదా మండ మెలిగే పండుగ
సంక్రాంతి పండుగ తర్వాత జరిపే పండుగ సమ్మక్క పండుగ. జనవరి చివరి వారంలో కానీ, ఫిబ్రవరి మొదటి వారంలో కాని వచ్చే పౌర్ణమి రోజున సమ్మక్క పండుగ జరుపుకుంటారు. సంప్రదాయం ప్రకారం కోడిని కోసి నైవేద్యాలు పెడతారు. బంధువులను ఇంటికి పిలుచుకుని, వాళ్ళకి భోజనాలు పెడతారు.
పచ్చ పండుగ లేదా చిక్కుడు పండుగ
ప్రతి యేట ఫ్రిబ్రవరి చివరి వారం లేదా మార్చి నెల మొదటి వారంలో ఈ పండుగ నిర్వహించుకుంటారు. ఈ పండుగ అనంతరం అడవిలో లభ్యమయ్యే, బీపురం, గడ్డి, తునికి, పాల, మొర్రిపళ్ళు, పూనుగుకాయలు, ఉసిరి, బంక, ముష్ఠిగింజలు, తేనే, చిక్కుడు కాయలు పచ్చని ఆకులు, తోట కునలతో చేసే పండుగ కాబట్టి దీన్నే ''పచ్చపండుగ'', ''కోలుకడిగే'' పండుగ అంటారు
రెండేళ్లకొకసారి సమ్మక్క సారక్క పండుగ
శ్రీ మేడారం సమ్మక్క సారక్క పండుగ యథావిధిగా రెండేళ్ళ కొకసారి జనవరి చివరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జాతరకు హజరై ఆవు, గేదే, మేక, కోళ్ళు, పసుపు కుంకుమ, నిలువెత్తు బంగారం, వడి బియ్యం, గాజులు బొట్టు కనులు సమర్పించుకొని ఇండ్లకు తిరిగి వెళ్లి వారం తరువాత మళ్ళి తమ గూడాల్లో జరుపుకుంటారు. ఉదా: పూనుగోండ్ల పెనుక వంశీయిలు వారి ఇలవేల్పు పగిడిద్ద రాజుకి తిరుగుబెల్లి లేదా మరుబెల్లి రూపంలో జరుపుకుంటారు.
దేవతలు
కోయలు తమ ఇలవేల్పులుగా సమ్మక్క, సారలమ్మ, నాగులమ్మ, ముత్తలమ్మ, మహలక్ష్మమ్మ, కొర్రాజులు, కాతురుడు, కొమ్మలమ్మలను కొలుస్తారు. 4వ గోత్రంలోని కొందరు తాబేలుని పూజిస్తారు. 3వ గోత్రంలోని కొందరు ఉడుముని తమ ఇష్టదైవంగా పూజిస్తారు. ఆదివాసీలకు ప్రత్యేకించి కోయల్లో విగ్రహారాధన లేదు. చెట్టు, పుట్ట, జంతువులను ఆరాదిస్తారు.
ఆహారం
కోయలు ముఖ్యంగా జొన్న, వరి, సజ్జ, కొర్రలు, సామలు, మినుములు, పెసళ్ళు, చిక్కుళ్లు, బొబ్బర్లు, కందులు తింటారు. అలాగే అడవిలో దొరికే బొద్దికూర, తిమ్మికూర, పచ్చకూర, గునుగకూర, తెల్లగడ్డ, నల్లగడ్డ. ఎల్లేరుగడ్డ, వంటి దుంపలు, తునికిపాలపండు, పసుకుకాయ, ఇప్పపువ్వు ఇప్పసారా తీసుకుంటారు. అటవీ ఉత్పత్తులపై, అడవి జంతువులపై ఆహర సేకరణ కొనసాగిస్తారు.
వేషభూషణాలు
కోయలు వేషభాషలు హిందు సంప్రదాయానికి కాస్త దగ్గరగా, మరికొంత భిన్నంగా ఉంటాయి. మహిళలకు కుంకుమబొట్టు, పసుపును కాళ్ళకు ముఖానికి వాడతారు. చెవులకు కమ్మలు, గంటీలు, ముక్కుపోగులు, కాళ్ళకడియాలు, చేతి కడియాలు, నల్లపూసలు, పుస్తెలతాడు, చీరకట్టులోనూ గోచి పద్ధతి ఉంది. మగవాళ్ల పంచెకట్టులో గోచి, బుగ్గలకు, చేతులకి పచ్చబొట్లు ఉంటాయి. కాని ఇప్పుడు ఆధునిక దుస్తులు ధరిస్తున్నారు.
పెళ్ళిళ్ళు
ఇంటి పేరు, గట్టు ద్వారా వరస అవుతారో కాదో తెలుసుకొని కులపెద్దలతో పాటుగా 5 లేదా 9 లేదా 11 మంది పేరంటాలు పిల్ల ఇంటికి వెళతారు. సంబంధం నచ్చితేనే భోజనం పెడతారు, భోజనం పెట్టలేదంటే పెళ్ళి కుదరదని అర్ధం. నచ్చితే ఒకరి ఇంటికి ఒకరు కుల పెద్దలతో వెళతారు. వరుడికి పేరాంటాలు పసుపు, కుంకుమ, నలుగు పెడతారు. ఈ తతంగమంతటినీ ఊరింద అంటారు. పెళ్ళికి వస్తున్నామని తెలపడానికి జోడాలను పంపిస్తారు. మార్గం మధ్యలో కాళ్ళ తీపుల కల్లు తాగుతారు. పెళ్ళిలో అవిరేని కుండలు, ఎదుర్కొనుట, తలంబ్రాలు వంటి తంతులతో పెళ్ళిపిల్లను చేసి, తాళి కట్టించి ఒడియాల బియ్యంతో అత్తవారింటికి పంపిస్తారు.
కర్మకాండలు
కోయ కర్మకాండలో శవాలను కాల్చేయడం, పూడ్చి వేయడం రెండు పదతులూ ఉన్నాయి. పిల్లలు, గర్భవతులను పూడ్చిపెడతారు. మిగతా వాళ్ళను దహనం చేస్తారు. సంబంధిత తెగవారు మాత్రమే శవాలను మోస్తారు. నాలుగు వేర్వేరు గట్ల వారు మోస్తారు. మగవాళ్ళకు మొలదారం, కంకణాలు తీస్తారు. ఆడవారైతే గాజులు, మంగళసూత్రాలు, నగలు, తీసి చనిపోయిన వాళ్ళ బంధువులకు అప్పగిస్తారు. 3,5,7,9,11, లేదా 21 రోజులకు (వృద్ధులు) దిన కార్యం చేస్తారు. దినకార్యానికి, బియ్య, ఏటలు, మిగితా సామాను అంతా కూడా సమీప దగ్గర బంధువులు సమకూర్చడం జరుగుతుంది.
పంచాయితీ కులతప్పు
ఆదివాసి పంచాయితీలను కులపెద్దలే తీర్చుతారు, పెద్ద మనిషి వంశపారం పర్యంగానే కులపెద్దలుగా కొనసాగుతారు. పెళ్ళిళ్ళు, విడాకులు, భార్యభర్తల పంచాయితీలు, కులాంతర వివాహాలు, పండుగలు, పబ్బాల్లోనూ పంచాయితీ కీలక పాత్ర పోషిస్తుంది. కుల పరమైన తప్పులను గ్రామ పెద్ద దొర, పటేల్, గ్రామ పెద్దలు నిర్ణయించి తీర్పు ఇచ్చేవారు.
- పెనుక ప్రభాకర్ దొర
ఆదివాసీ రచయితల సంఘం తెలంగాణ
Authorization