జానపద నృత్యాలు భారత దేశంలో చాలా ఉన్నాయి. అయితే శాస్త్రీయ నృత్యాల కున్న గుర్తింపు, మర్యాద, గౌరవం వీటికి దక్కడం అరుదుగా కనిపిస్తుంది. శాస్త్రీయ నృత్యాలకు ఉన్నట్లు దేశవ్యాప్తంగా వీటికి ఆద రణ తక్కువ. అయితే ఏ ఏ ప్రాంతాల్లో ఆయా జానపద నృత్యాలు బాగా తెలిసి ఉంటాయో ఆయా ప్రాం తాల్లో మాత్రం విపరీతమైన ప్రజాదరణ ఉంటుంది. అటువంటి జానపద నృత్యాల్లో 'జ్యోతినృత్యం ఒకటి.
ఈ నృత్యానికి తెలుగు రాష్ట్రాల్లో రకరకాల పేర్లున్నాయి. జ్యోతుల బోనాలు, ముద్దలు పెట్టడం, జ్యోతి ఆడటం వంటివాటిని ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అయితే రాయల సీమలో ఈ నృత్యపద్ధతి ఎట్లా ఉంటుందో చూద్దాం. జ్యోతి నృత్యాన్ని రాయల సీమలో కులాచారంలో భాగంగా ప్రదర్శిస్తారు. అంటే ఇది ఒక ఆరాధనా నృత్యమన్నమాట. 'నేత' (సాలె) కులస్తులు చౌడమ్మ దేవతకు జ్యోతి నృత్యం ప్రదర్శనతో బలిస్తారు. బోనం పెడతారు. ఏడాదికొకసారి ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలంలోని పెద్దకోట్ల చౌడమ్మకు నేత కులంవారు జ్యోతినృత్యంతో జాతర చేస్తారు. కర్నూలు జిల్లా నంద్యాల, కడపజిల్లా సింహాద్రిపురం, అనంతపురం జిల్లా ధర్మవరంలో అత్యంత ఉత్సాహంగా ఈ నృత్యాన్ని చేస్తారు.
గ్రామం బయట జ్యోతిని తయారుచేస్తారు. నియమ నిష్టలతో ఆరాధించి అనుభవమున్నవారు నెత్తిన ఎత్తుకుంటారు. బియ్యం బెల్లం కలిపిన పిండి ముద్దచేసి నెయ్యితో జ్యోతిని తయారుచేస్తారు. జ్యోతి ఉన్న పాత్రను ఒకరు నెత్తిన పెట్టుకుంటారు. అతని చుట్టూ తాళాలతో, చేతుల చప్పట్లతో శివుని మీద, చౌడమ్మ మీద రకరకాల పాటలు పాడతారు. తాళానికి అనుగుణంగా జ్యోతి ఆడతారు. జ్యోతిని నెత్తిమీద పెట్టుకున్నవారు రెండు చేతులను వదిలి రకరకాల అడుగులు వేయడం ప్రత్యేకం. అట్లా గ్రామం వెలుపల నుంచి అన్ని ఇండ్ల దగ్గరకు వెళ్ళిన తరువాత చౌడమ్మ గుడి దగ్గరకి వచ్చి జ్యోతిని అర్పిస్తారు. చౌడమ్మ గుడిదగ్గర బోనాలు పెట్టి బలివ్వడం ఆచారం. బలిలో ముఖ్యంగా కోళ్లు, పొట్టేళ్లు, గొర్రెలు ఉంటాయి. అందరూ బంధుమిత్రులతో కలిసి సంబరాలు జరుపుకుంటారు. అట్లా చేస్తే గ్రామాన్ని, తమ కులాన్ని చౌడమ్మ దేవత కాపాడుతుందని వారి నమ్మకం. నృత్యప్రదర్శనలో పొరపాటున జ్యోతి కిందపడిపోతే అపశకునంగా భావిస్తారు. ఆ ఏడాది గ్రామానికి కీడు కలుగుతుందని, చౌడమ్మకు కోపం వస్తుందని వారి నమ్మకం. జ్యోతి నృత్యంలో ఒకరు పాడుతుంటే మిఇలినవారు వంత పాడుతారు. జ్యోతిని ఎత్తుకున్న కళాకారుడు ఆడుతూ ఉంటాడు.
-సిహెచ్..కె..రెడ్డి
Authorization