సమాజం నిరంతరం మారుతూ ఉంటుంది. దీనికి భౌతిక, భౌద్ధికమైన అనేక కారణాలు దోహదం చేస్తూ ఉంటాయి. మారటం అనివార్యమని, మారనిది ఏదీ ఈ ప్రపంచంలో మనజాలదని చరిత్ర రుజువు చేస్తోంది. మార్పుకు ఏదీ అతీతం కాదు కాబట్టి మన జానపద కళారూపాలూ మారుతూ వస్తున్నాయి. కొన్ని ఏకంగా మరణిస్తున్నాయి. అట్లా మార్పులకు గురైనవీ, ఇప్పటికే మరణించినవీ, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నవీ ఎన్నో కళారూపాలు ఉన్నాయి. ఈ కళారూపాల్లో నిక్షిప్తమై ఉన్న మన సంస్కృతి, చరిత్ర, విజ్ఞానాలను ముందు తరాలకు అందించాలంటే డాక్యుమెంటేషన్ తప్పనిసరి. డాక్యుమెంటేషన్ ఆవశ్యకత, అందులోని సమస్యలపై రాసిన ప్రత్యేక వ్యాసం ఇది.
సంస్కృతిలో జానపద కళారూపాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శిష్ట సాహిత్యంలోని మూలాలు కూడా 'జానపద గిరిజన కళారూపాల సాహిత్యంలో' వినిపించడం విశేషంగా చెప్పుకోవచ్చు. తరతరాలుగా మారుతున్న సంస్కృతిలో తమకంటూ ఒక సాంస్కృతిక నేపథ్యాన్ని కలిగి విజ్ఞానాన్ని వినోదాన్ని పంచుతూ వస్తున్నారు. సంస్కృతికి గుప్త నిధిలాంటి జానపద గిరిజన కళారూపాలకు సరైన ఆదరణ, ప్రాచుర్యం లేకపోవటంతో కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇప్పటికే చాలా కళారూపాలు కనిపించకుండా పోయాయి. ఉదాహ రణకు విశ్వబ్రాహ్మణులను ఆశ్రయించే పనస, రుంజ కళాకారులు కథలు చెప్పకుండానే కట్టడి గ్రామాలకు పోయి ప్రతిఫలం పొందుతున్నారు. ఒకరకంగా వీరి కళారూపాలను డాక్యుమెంట్ చేయకపోవడం వల్ల వారి సంస్కృతి, సాహిత్యం భవిష్యత్తు తరాలకు ప్రశ్నార్థకమయింది.
ప్రస్తుతం ఈ కళాకారులు పోషక కులం వృత్తినే చేస్తున్నారు. అట్లాగే కూనపులి కళాకారులు పద్మశాలీలను ఆశ్రయించి మార్కండేయ పురాణం కథాగానం చేస్తారు. ప్రస్తుతం వీరుకూడా కళారూపాన్ని మరిచిపోయి ఇతర వృత్తుల్లో స్థిరపడ్డారు. ఈవిధంగా కళారూపం కనుమరుగవ్వడంతో పద్మశాలి వంశ చరిత్ర, వారి సాహిత్యంలోని విజ్ఞానం ఒక రకంగా భవిష్యత్ తరాలవారికి అందకుండా పోతున్నది. అట్లాగే కూనపులివారి సంస్కృతి ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడుతున్నది. వారి ఉనికే ప్రశ్నార్థకమవు తున్నప్పుడు వారిని ఆశ్రయించే గొడు గుబట్లవారి సంస్కృతి కూడా ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పటికే ఈ రెండు కులాలవారి కళారూపాలు కనుమరుగయ్యాయనే చెప్పవచ్చు.
తెల్జూరు కళారూపంవారు యాదవులను ఆశ్రయించి గంగదేవి కథ చెబుతారు. వీరు తాళపత్ర ప్రతుల మీద ఉన్న గంగదేవి కథను ఆధారం చేసుకొని సంప్రదాయబద్ధంగా కథాగానం చేస్తారు. యాదవులు ఐదేండ్లకొకసారి గంగదేవి పండుగ జరుపుకునే సందర్భంగా గంగదేవి కథను చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కథ చెప్పేవాళ్లు లేకపోవడంతో కథ చెప్పకుండానే పడుగ జరుపుకుంటున్నారు. ఇదే కోవకు చెందిన మరి కొన్ని కళారూపాలలో కుమ్మరి కులాన్ని ఆశ్రయించి గుండిబహ్మ పురాణం చెప్పే పెక్కర్లు, దేవాంగులను ఆశ్రయించి దేవాంగ పురాణం చెప్పే సింగనవారు, యాదవులను ఆశ్రయించే కొమ్ములవారు, కోమటి కులాన్ని ఆశ్రయించి కన్యకాపరమేశ్వరి పురాణం చెప్పే వీరముష్టివారు, బ్రాహ్మణులను ఆశ్రయించి ఇంద్రజాలాంశాలను ప్రదర్శించే విప్రవినోదులు, మేదరి కథ చెప్పే ఆదికొడుకులు, మంగలివారిని ఆశ్రయించి నాయిబ్రాహ్మణ పురాణం చెప్పే అద్దపువారు కనుమరుగయ్యే దశలో ఉన్నారు. ఇంతేగాకుండా కొన్ని కళారూపాలు కాలానుగుణంగా మార్పులు చెంది ప్రదర్శితమవుతున్నాయి. ఉదాహరణకి పటం కళారూపాలను చూసినట్లయితే ఒకప్పుడు పటం లేకుండానే కథలు చెప్పేవారు. ఎప్పుడైతే ఆ కళారూపాలకు ఆదరణ తగ్గిందో చెప్పే కథకు సంబంధించిన పాత్రలను, సన్నివేశాలను పటం ఆధారంగా వివరిస్తూ ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఇప్పుడు కొందరు కళాకారులు పటంతో పాటు కథలోని పాత్రలకు అనుగుణంగా వేషాలు ధరించి ప్రదర్శనలిస్తున్నారు. ఆవిధంగా వివిధ రకాలుగా కళారూపాన్ని మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఇట్లా చేస్తూ పోతే అసలు మొదట్లో ఉన్న కళారూపం మరుగై పోవచ్చు. అందుకే వాటిని నిర్మాణాత్మకంగా, సాంకేతికపరంగా డాక్యుమెంట్ చేయడం వల్ల భవిష్యత్ తరాలకు ఆయా కళారూపాల పట్ల అవగాహన కల్పించినట్లవుతుంది. తద్వారా సంస్కృతిలో భాగమైన ఆయా సంప్రదాయ రీతులు కాలగర్భంలో కలిసిపోకుండా ఉంటాయి.
కళతో పాటే కులం గుర్తింపూ...
డాక్యుమెంటేషన్ వల్ల కళారూపం మార్పు చెందినప్పటికీ ఏదో ఒక దశలో కళారూపం ఉనికి సంస్కృతిలో నిలిచిపోవడానికి అవకాశం ఉంటుంది. కళారూపాలపై సమగ్రమైన పరిశోధన లేకపోవడంతో కళారూపానికి సంబంధించిన కులాలు కూడా మార్పు చెందటం కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు రెడ్డి కులానికి ఆశ్రితులైన పిచ్చుకకుంట్లవారిని వంశరాజులుగా ప్రభుత్వం గుర్తించింది. పిచ్చుకకుంట్ల కళారూపానికి ప్రాచుర్యం లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం వీరంతా 'పిచ్చుకకుంట్ల'వారిగా గుర్తించాలని ఉద్యమాలు చేస్తున్నారు. ఇట్లాగే బుడిగిజంగాలవారు కూడా ఉద్యమం చేస్తున్నారు. గిరిజన కళారూపాల్లో కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి. తోటివారు గోండు గిరిజన తెగకు ఆశ్రితులు. వీరు ఆదిలాబాద్ జిల్లాలో ఉంటారు. అయితే కొందరు తోటివారు మైదాన ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ గిరిజన తెగయైన నాయకపోడులకు ఆశ్రితులయ్యారు. తోటి కళారూపంవారు మహాభారతం మాత్రమే చెబుతారు. కానీ నాయకపోడును ఆశ్రయించేవారు నాయకపోడు కులానికి మూలపురుషుడైన పద్మనాయకుని వృత్తాంతంతోపాటు మహాభారతం చెబుతారు. ఈవిధంగా చేయటం వల్ల కళారూపంలో, వారి ఆచారాల్లో అనేక మార్పులు సంభవించాయి. సమగ్రమైన పరిశోధనా పరమైన డాక్యుమెంటేషన్ వల్ల పలు విషయాలు తెలుస్తాయి.
సమగ్రమైన డాక్యుమెంటేషన్ అవసరం
ఒక కళారూపాన్ని వివిధ కోణాల నుండి డాక్యుమెంట్ చేయడానికి అవకాశముంది. ఇప్పటివరకు కొందరు పరిశోధకులు వారి వారి అభిరుచులను బట్టి కొందరు కేవలం ఈ కళారూపాల సాహిత్యాన్ని మాత్రమే డాక్యుమెంట్ చేస్తుంటే, మరికొందరు భాషపైనా, ఆచార సంప్రదాయాలపైన, ఆర్థిక పరిస్థితులను రికార్డుచేస్తున్నారు. ఇంకొందరు ఆడియో, వీడియో, ఫొటోల రూపంలో రికార్డు చేస్తున్నారు. ఇట్లా రకరకాల కోణంలో ఎవరికి ఇష్టమైన కోణంలో వారు డాక్యుమెంట్ చేయడం వల్ల ఈ కళారూపాలు, వాటిని ప్రదర్శించే కళాకారుల సమాచారం సమగ్రంగా రికార్డు కాకుండా పోతున్నది. అందుకనే తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠంవారు కళారూపాన్ని సజీవంగా భవిష్యత్తరాలకు అందించాలనే దృక్పథంతో కళారూపం మూలాలను కళారూపం ప్రదర్శించే సహజమైన వేదికపై డాక్యుమెంట్ చేస్తూ ఉంది. కళారూపాన్ని ఏదో ఒక కోణం నుంచి కాకుండా, వారికి సంబంధించిన బహుముఖాంశాలు డాక్యుమెంట్ చేయడం వల్ల కళారూపం మూల కథతో పాటు పరిశోధనకు ఉపయుక్తమైన సమగ్రమైన అనేక అంశాలు తెలియడానికి వీలుంది. ఒక కళారూపాన్ని వివిధ మాధ్యమాల్లో డాక్యుమెంట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్యుమెంట్ చేయడానికి నిర్ణయించు కొనేటప్పుడు కళారూపాన్ని ప్రదర్శించే చోట స్వేచ్ఛగా మనగలగాలి. ఈ సమయంలోనే సాంఘికంగా అనేక విషయాలు తెలుస్తాయి. అట్లాగే ప్రేక్షకుల స్పందన తెలియడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని కళాకారులకు నిర్దిష్ట సమయమిచ్చి చెప్పమనటం, కథలోని ప్రధాన ఘట్టాలను మాత్రమే చెప్పమనటం సరైనది కాదు. దీనివల్ల కళారూపానికి సంబంధించిన పూర్తిసమాచారం రాదు.
ఏదైనా కళారూపాన్ని డాక్యుమెంట్ చేయాలంటే ముందు మంచి కళారూపాన్ని ఎంచుకోవడం నైపుణ్యంతో కూడిన పని. కళారూప కళాకారులమధ్య సమన్వయం లేనట్లతే ప్రదర్శన రసాభాస అవుతుంది. మంచిగా ప్రదర్శి:చే కళాకారులు కూడా ఆడియో, వీడియోలను చూసేసరికి తమ సహజత్వాన్ని కోల్పోతారు. కొన్ని సందర్భాల్లో పాత్రవైపు చూసి చెప్పే సంభాషణల్ని కెమెరా వైపు చూసి చెబుతారు. ఫలితంగా ప్రదర్శన రక్తికట్టక పోవడం, ప్రదర్శనకు అంతరాయం కలగటం కనిపిస్తుంది. కొందరు కళాకారులు రంగస్థలంపై తమ పాత్ర సమయం ముగిసినప్పటికీ వీడియోలో ఎక్కువ సేపు కనిపించడం కోసం రంగస్థలంపైనే ఉండి మిగతా కళాకారులకు ఆటంకం కలిగిస్తారు.
కళాకారులతో వచ్చే ఇబ్బందులు
కళారూపాన్ని డాక్యుమెంట్ చేసే సంస్థకు కాని, వ్యక్తికి కాని ఎంతో లాభం ఉందని కళాకారులు భావిస్తారు. ఇటువంటి భావన అన్ని కళారూపాల ప్రదర్శనకారుల్లో లేనప్పటికీ కొన్ని కళారూపాల్లో మాత్రం పాతుకుపోయింది.
ఒక కళారూపానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ జురుగుతున్నప్పుడు ''మీరు పుస్తకాలు రాస్తారు. మీకు పేరు వస్తుంది. మీకే డబ్బులు వస్తాయి. మాకు ఏం లాభమొస్తుంది'' అని ప్రశ్నిస్తున్నారు. అదే బహుళ ప్రాచుర్యంలో ఉన్న కళారూపం ప్రదర్శి:చేవారు మాట్లాడితే తప్పులేదు. కాని రేపో మాపో అంతరించే కళారూపం కళాకారులు పైవిధంగా మాట్లాడితే ఎట్లా ఉంటుందో ఆలోచించాలి. నిజానికి ఆ కళారూప ప్రదర్శనకు ఉపయోగపడే వనరులు లేనప్పటికీ, వనరులు సమకూర్చి, వారికి పారితోషికం ఇచ్చి కథ చెప్పమన్నా చెప్పకుండా ''మా కథను మీరు తీసుకుపోయిన తర్వాత మాదగ్గరికి ఎవరువాస్తార''నే రీతిలో కళాకారులు మాట్లాడుతున్నారు.
గిరిజన కళారూపాలను డాక్యుమెంట్ చేసేటప్పుడు కూడా చాలా సమ స్యలు ఎదురవుతాయి. ప్రధానంగా భాష సమస్యగా ఉంటుంది. గిరిజనులు సాధారణంగా కొత్తవారిని తొందరగా నమ్మరు. ఇటు వంటి సమస్యలు ఉన్నప్పుడు వారి భాషతోను, వారితో సంబంధం ఉన్న వ్యక్తులను వెంటపెట్టుకొని వెళ్లినట్లయితే సమస్య పరిష్కా రానికి అవకాశం ఉంటుంది.
- గంపా సతీష్
Authorization