జానపద నృత్యాల్లో ఒక్కరే ప్రదర్శించే నృత్యాలు కూడా ఉంటాయి. అందులో నామాల సింగడు ఒకటి. సింగడు వ్యక్తి పేరు. 'నామాల' ఇంటిపేరు. నామాల అనే గ్రామం అనంతపురం జిల్లాలో ఉంది. 'నామాల గుండు' అనే పుణ్యక్షేత్రం కడప జిల్లాలో ఉంది. అయితే క్షేత్రంలో నామాల సింగని పేర ఒక జాతర జరుగు తుంది. ఆ సందర్భంగానే కాక, వేరే పండుగల సందర్భంలోనూ నామాల సింగని నృత్యం చేస్తారు రాయలసీమ వాసులు. నిజానికి ఈ జాతర కాని, నృత్యం కాని అతి ప్రాచీనమైనవి కావు. కేవలం సింగడు అనే వ్యక్తి పీడ విరగడైనందువల్ల ప్రజలు జాతర చేస్తూ నృత్యం చేయడం జరిగింది. అప్పటి నుంచి ''నామాల సింగడు'' అనే పేర ప్రతి యేడాది ప్రజలు ఉత్సవం జరుపుకోవడం ఆనవాయితీ అయింది. సంస్కృతిలో కొత్త సంప్రదాయాలు, కళా రూపాలు ఎట్లా పుడతాయో చెప్పడానికి ఈ జాతర, నృత్యం మంచి ఉదాహరణలు. అట్లాగే కొత్తగా భౌగోళిక స్థల నామాలు ఎట్లా పుట్టుకొచ్చి స్థిరపడతాయో కూడా నామాల సింగని కథ చెబుతున్నది.
నామాల సింగడు దారి దోపిడి దొంగ. కాలిబాటన నడిచే బాటసారుల్ని దోచుకుంటూ ఉండేవాడు. తన అనుచరులతో కలిసి రోజుకొక గ్రామం ప్రకారం దోచుకుంటూ బీదవారికి కొంత సహాయం చేసేవాడని ప్రజలు చెప్పుకుంటారు. ఇతడి స్థావరం కడప జిల్లా పులివెందుల తాలూకాకు 15 కిలో మీటర్ల దూరంలో ఉండే కొండల్లో ఉంది. అక్కడి స్థలాన్ని నామాల గుండు అని పిలుస్తారు. ఇక్కడి నుంచి కొండల్లో మూడు మైళ్ల లోపలికి పోతే నామాల సింగని కోట కనిపిస్తుంది. ఈ కోటలో అతని అనుచరులు నివసించడానికి కావలసిన వసతులు ఉన్నాయి. ఇతని సింహాసనం కూడా ఉంది. దీన్ని 'తౌటు' అంటారు. కొండల్లో అక్కడక్కడ బాటసారులను గుర్తించి చెప్పడానికి వీలుగా కొందరు నైపుణ్యం గల వ్యక్తులను నియమించేవాడు. వీరు సైగలతో సమాచారాన్ని అందించేవారు. సమాచారం అందగానే సింగని ముఠా బాటసారుల్ని దోచుకునేది. వెదురు బుంగల్లో దాచుకున్న వెండి రూపాయలు కూడా దోచుకున్నట్లు తెలుస్తున్నది.
నామాల గుండు అనేది పెద్ద రాతి గుండు ఈ గుండు కింద ఒక సాధువు శివ భక్తునిగా ఉంటూ శివుని పూజ చేస్తూ ఉండేవాడు. శివలింగం పక్కనే ఉంది. అక్కడ నది ప్రవహిస్తున్నది. మడుగులున్నాయి. సింగడు దొంగతనాలకు వెళ్లే సమయంలో సాధువు అనుమతి తీసుకునేవాడు. వెళ్లమంటేనే వెళ్ళేవాడు. ఒక్కొక్క గ్రామం కొల్లగొట్టిన తరువాత అక్కడున్న పెద్ద రాతి గుండుకి నామాలు పెట్టేవాడు. అందుకనే అది నామాల గుండు అయింది. సింగని చేష్టలకు విసిగిన చుట్టుపక్కల గ్రామాల వారు ఎట్లాగైనా అతడ్ని చంపాలని నిర్ణయించుకున్నారు. పోలీసులకు సహాయపడుతూ ఒక పన్నాగం పన్నారు. సింగనికి అనుచరుడుగా ఉన్న ఒకర్ని డబ్బు ఆశ చూపించి సింగన్న ఎట్లాగైనా 'కనుమ క్రింద కొట్టాల' గ్రామానికి తీసుకురావాలని ఆమీద రుబ్బురుగుండు' పందాల్లో పాల్గొనాలని తెలిపారు. రుబ్బురు గుండు పందెం అంటే బరువైన రాతిని ఎత్తి మెడ చుట్టూ తిప్పటం వంటివి చేస్తారు. గ్రామాలలో ఒకరిద్దరికి బరువులెత్తడంలో నైపుణ్యం ఉండేది. వారంతా ఎత్తలేక కిందపడేశారు. గ్రామ మర్యాద పోతుందనే బిడియంతో సింగడు రాయిని ఎత్తడానికి పోయాడు. అప్పుడు తన దగ్గరున్న రెండు పిడిబాకుల్ని నమ్మిన బంటుకిచ్చి వెళ్లాడు. ఈ పిడిబాకులు సింగని దగ్గరుంటే జనం భయపడేవారు. గుండు ఎత్తి పట్టుకున్న సమయంలో మామూలు ప్రజల వేషంలో ఉన్న పోలీసులు, ప్రజలు సింగణ్ణి బంధించారు. అక్కడి నుంచి పులివెందుల జైలు వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రజలు జాతర చేసుకున్నారు. దీపావళి పండుగ లాగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. తరువాత సింగణ్ణి ఉరి తీశారని ప్రజలు చెబుతారు. అట్లాగే సింగనికి బేడీలు వేసి, వేప మండలు కట్టి తప్పెట వాయిద్యంతో ఊరేగింపు చేసిన విధానమే ఈనాటికీ జానపదులు మొహరం పండుగ ఉరుసు రోజు నామాల సింగని నృత్యం ప్రదర్శిస్తారు.
జాతర రోజు
జాతర లేక పండగ రోజు నామాల సింగని వేషం వేస్తారు. ఈ వేషంలో భాగంగా తలకు రుమాలు, ముఖానికి నామాలు, ఎరుపు, తెలుపు బొట్టు పెడతారు. వేప మండలు కడతారు. రెండు చేతులకు ఇనుప గొలుసుతో తాళం వేస్తారు. రెండు పిడిబాకులను రెండు చేతులతో పట్టుకుంటారు. పిడిబాకులకు చివర నిమ్మకాయలు గుచ్చుతారు. పెద్ద మీసాలు కడతారు. రెండు చేతుల భుజాలనీ రెండువైపులా తాళ్లతో ఇద్దరు పట్టుకుంటారు. తప్పెట గతికి అనుగుణంగా అడుగులు వేస్తారు.
తప్పెట చర్మ వాయిద్యం. ఈ వాయిద్యం మీద పుట్టే గతే 'జెగ్నకన్'. ఇది సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి కొడతారు. డప్పు గతులకు అనుగుణంగా సింగని వేషధారి రెండు చేతులను ముందుకు చాపి అటు ఇటు తాళ్లతో పట్టుకున్న వారిపైకి దూకడం, రెండు కాళ్లతో అడుగులు వేయడం, బస్కీలు తీయడం, కుప్పిగంతులు వేయడం, కూర్చోవడం, ఒక కాలిని వెనక్కి చాపడం చేస్తాడు. మొహరం పండగ రోజు అయితే వేషధారి ఇంటి నుంచి తప్పెట గతికి అనుగుణంగా అడుగులు వేసుకొంటూ గుండం చుట్టూ నృత్యం చేసుకుంటూ మరలా తిరిగి ఇంటికి రావడం జరుగుతుంది. మధ్యలో ఎర్రటి నీళ్లతో దిష్టి తీయడం, బొరుగులు ఎగజల్లడం చేస్తారు.
సింగని వేషం చూస్తే చిన్నపిల్లలు భయపడి దూరంగా వెళతారు. ముఖానికి రంగుల్ని, కత్తుల్ని చూసి పిల్లలు జడుసుకుంటారు. నామాల గుండు దగ్గర ఏడాది కొకసారి పూజలు చేస్తున్నారు. శివరాత్రి పర్వదినాన నామాల గుండుకు పూజలు చేస్తారు. అప్పుడు నామాల సింగని నృత్యం ప్రదర్శిస్తారు. ఇట్లాంటి నృత్యాలు ఎన్నో మరుగున పడిపోతున్నాయి.
-సిహెచ్.కె.రెడ్డి
Authorization