రాజస్థాన్కు తూర్పువైపున ఉన్న మాల్వా ప్రాంతంలో అభివృద్ధి చెందిన హరప్పా తరువాతి కాలపు తామ్ర (రాగి)శిలాయుగపు స్థావరాల్లో పేర్కొనదగినవి నర్మదా నది తీరాన ఉన్న మహేశ్వర్, నవదతోలి, అనే స్థలాలు, చెంబల్ నదీ తీరాన ఉన్న నాగ్డా అనే స్థలము.మహేశ్వర్, నవదతోలి స్థలాలు తామ్ర శిలాయుగపు మొదటి దశకు చెందిన ప్రజలు వెదురు బొంగులతో పెండె పోసి బంకమట్టితో కట్టిన గుండ్రటి, చతురస్రాకారపు ఇండ్లలో నివసించినారు. నవదతోలి తామ్ర-శిలాయుగం నాటి పల్లెల్లో రమారమి 75 ఇండ్లు (గుడిసెలు) ఉండవచ్చని, జనాభా రెండు వందల మంది వరకు ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తల అంచనా. వీరు రాతి బ్లేడ్ పరికరాలను అధిక సంఖ్యలో ఉపయోగించినట్లు ఇక్కడ దొరికిన కొన్ని వేల రాతిబ్లేడుల వల్ల తెలుస్తున్నది. అదే సమయంలో వీరు రాగి పనిముట్లను కూడా వాడినారు. పశువులు, గొర్రెలు, మేకలు, పందులు వంటి జంతువులను మచ్చికచేసినారు. గోధుమ, నూనె గింజల చెట్లను సాగుచేసినారు. వీరు తయారుచేసిన మట్టి పాత్రలలో ముఖ్యమైనవి నగిషీ చేసిన నలుపు, ఎరుపు మట్టిపాత్రలు; ఎరుపు రంగు పామిన నలుపు రంగుతో చిత్రించిన పాత్రలు; మీగడ రంగు పామిన నలుపు రంగుతో చిత్రించిన పాత్రలు, బూడిద రంగు పాత్రలు. ఎరుపు రంగు పామిన నలుపు రంగుతో చిత్రించిన పాత్రలు మాల్వా ప్రాంతంలో సాధారణంగా లభించడం వలన వీటిని 'మాల్వా మట్టి పాత్రలు' అన్నారు. మొదటి దశ నివాసాన్ని నిర్మూలించి, దాని స్థానంలో రెండో దశ నివాసాన్ని నిర్మించారు. రెండవ దశలో మొదటి సారిగా వరిసాగు ఆరంభమయింది. నగిషీ చేసిన నలుపు, ఎరుపు రంగుల మట్టి పాత్రల వాడకం మరుగున పడిపోయింది. రెండవ దశ నివాసాన్ని చాలావరకు నిర్మూలించి, ఆ అవశేషాల మీద మూడవ దశ నివాసాన్ని నిర్మించినారు. మూడవ దశ నివాసంలో నాజూకైన ఎరుపు రంగు మట్టి పాత్రలు ప్రవేశపెట్టారు. వీటిలో కొన్ని కుమ్మరి సారె మీద చేసినవి. ఈ పాత్రలు దక్షిణ ప్రాంతపు జోర్వే అనే తామ్ర-శిలాయుగ స్థలంలో ప్రత్యేకంగా కనబడటం వల్ల వీటిని 'జోర్వే' మట్టి పాత్రలు అంటారు. ఆఖరి దశలో కొమ్ము చెంబు మాదిరి మట్టి పాత్రలు కొన్నింటిని ప్రవేశపెట్టారు. కానీ ఇతరితరా ముఖ్యమైన మార్పులు ఏమీ లేవు. కార్బన్-14 పద్ధతి ప్రకారం నవదతోలికి చెందిన తామ్ర-శిలాయుగపు సంస్కృతుల కాలాన్ని క్రీస్త్రు పూర్వం 1600 ఏండ్ల నుంచి 1300 ఏండ్ల వరకు అని నిర్ణయించినారు.
- మౌక్తిక్
Authorization