ఇప్పుడు మనం చూస్తున్న జానపద విజ్ఞానం హటాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినదేమీ కాదు. అది ఒక తరం నుంచి మరో తరానికి ఒక క్రమ పద్ధతిలో వివిధ రూపాల్లో అందుతూ వస్తున్నది. మౌఖిక, లిఖిత పద్ధతుల్లో ఇది పరివ్యాప్తమవుతూ వస్తున్నది.మౌఖిక రూపంలో ప్రచారం పొందిన జానపద విజ్ఞానం ఇటీవలి కాలంలో లిఖితరూపం సంతరించుకుంటోంది. క్షేత్ర సందర్శనలు, పరిశోధనల కోసం జానపద విజ్ఞానాన్ని సేకరించి ముద్రణా రూపంలోను, వస్తు రూపంలోను, ఫొటోలు, సీడీల రూపంలోను భద్రపరుస్తున్నారు. ఈ ముడి సరుకుల ఆధారంగా ఆయా ప్రాంతాల ప్రజా మూలాలను వెదుకుతున్నారు. లిఖిత సంప్రదాయం కన్నా మౌఖిక సంప్రదాయమే శక్తివంతమైనది. మౌఖిక జానపద విజ్ఞానంలో జానపద గేయాలు, కథాగేయాలు, జానపద పురాణాలు, ఇతిహాసాలు, గద్యకథలు, సామెతలు, పొడుపు కథలు, మాండలికాలు నుడికారాలు, తిట్లు, ఒట్టులు వంటివన్నీ ఉన్నాయి. వీటిలో కొన్ని సాహిత్యంలో ఎట్లా ప్రతిఫలించాయో చెప్పేదే ఈ వ్యాసం.
సాధారణంగా జానపదుల దైనందిన జీవితం పని, పాట, మాట, ఆట అనే నాలుగు అంశాలతో ముడివడి ఉంటుంది. పనిచేస్తూ శ్రమ మరిచిపోవడానికి పాట పాడినా, వినోదం కోసం, మానసిక ఉల్లాసం కోసం ఆట ఆడినా, మాట్లాడినా... ఆయా అవసరాలకు సంబంధించిన విజ్ఞానాన్ని సాహిత్యం లోని వివిధ రూపాల ద్వారా జానపదుడు వ్యక్తం చేస్తాడు.
ఎరుక ఏసిన పోటు కేమేమి మందు
జాజికాయ జాపత్రి చల్లనీ మందు
కుంకంబు గువెళ్లగూర్చినా మందు
మంచి గంధముతోను మానునీపుండు
ఇవి వరహావతారం వీరగాధలోని పంక్తులు. ఎరుకలసాని పుట్టను తవ్వడం మూలంగా అందులో ఉన్న వరాహ స్వామికి దెబ్బలు తగు లుతాయి. ఆ గాయాలను మాన్పడానికి జానపదులు, జాజికాయ, జాపత్రి ఇత్యాది మొక్కలతో వైద్యం చేశారు. ఇది పైకి భగవంతునికి చేసిన వైద్యంలాగా అనిపించినా అంతర్గతంగా మనిషికి తగిలిన దెబ్బలను మాన్పడానికి చేసే వైద్యమే అన్నది వాస్తవం. అట్లాగే చిన్నపిల్లలు పాడుకునే గీతాల్లో కూడా వైద్య సంబంధమైన విజ్ఞానాన్ని అందించే పాటలు ఉన్నాయి.
కొండమీది వెండి గిన్నె కొక్కిరాజు కాలు విరిగె
దానికేమి మందు వేపాకు చేదు
వెల్లుల్లి గడ్డ నూనెమ్మ బొట్టు నూటొక్క ధార
కాలు విరిగితే ఏఏ ఔషదాలతో కట్టుకడితే కాలు అతుక్కుంటుందో చెప్పే గేయాన్ని పిల్లలు ఆటపాటల్లో పాడుకుంటారు.
జానపద గద్య కథల్లో 'ఈగ ఇల్లు అలకడం'', ''నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా'' వంటి కథలను పరిశీలించినట్లయితే చక్కటి కథాకథన శిల్పంతో జీవజాలాన్ని, సామాజిక జీవనంలోని వివిధ వృత్తులను, వస్తుజాలాన్ని పరిచయం చేయడమే కాకుండా అంతర్లీనంగా ఒక నీతిని బోధించడం గమనించదగింది. అనగనగా ఒక రోజు అంటూ సాగే గద్య కథలో రాజులు వేటాడతారని, గొల్లలు పశుపోషణతో జీవిస్తారనే విషయాలతో పాటు, చేపలు, గడ్డి, చీమ పుట్ట వంటి అంశాలను కూడా పరిచయం చేయడం జరిగింది. ఎవరైనా ఇతరుల పనుల్లో జోక్యం చేసుకున్నప్పుడు అది అనర్థాలకు దారితీస్తుందన్న నీతిని కూడా ఈ కథ చెబుతుంది. ఇట్లాంటి కథలను పిల్లలకి చెప్పడం మూలంగా వారికి విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించినవారమవుతాం.
పొడుపు కథల్లోను, సామెతల్లోను జానపదులు తమ దైనందిన జీవితానికి సంబంధించిన అంశాలతో పాటు వివిధ వృత్తుల వాళ్ల మనస్తత్వాన్ని, వాళ్ల వస్తు సామగ్రిని, విశ్వాసాలను, సామాజిక జీవన స్థితిగతుల్ని నిక్షిప్తం చేస్తారు.
'తొలకరి వానల మొలకలకు తల్లి', ఉత్తర వచ్చె ఎత్తర గంప, పత్తికి పది చాళ్ళు, జొన్నకు ఏడు, నువ్వులకు ఏడు దుక్కులు, ఉలవలకి ఒక దుక్కి దుక్కి లేని చేను తాలింపు లేని కూర వ్యర్థం. ఏరువాక ముందా ఏరు ముందా వంటి సామెతలు వ్యవసాయ వృత్తికి సంబంధించిన విజ్ఞానాన్ని అందిస్తాయి. పొద్దు పొడుపు నుంచి పొద్దు కుంగేదాక సాగే జానపదుల దైనందిన జీవితంలోని సంభాషణల్లో సామెతలు లేకుండా మాట సాగనటంలో అతిశయోక్తి లేదు.
జానపదుల జీవితంలో సామెతలకు ఎంత ప్రాముఖ్యం ఉందో పొడుపు కథలకు కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. పొడుపు కథలు జానపదుల మెదళ్లను పదునుపెట్టే సానెరాళ్లుగా పేర్కొనవ్చు. జానపదుల సంప్రదాయ పాటల్లోని సీత సమర్త, రుక్మిణి సమర్త అనే పాటలను పరిశీలించితే వారి ఆచారాలు, విశ్వాసాలు వ్యక్తమవుతాయి. ఒకప్పుడు మన సమాజంలో బాల్యవివాహాలు జరిగేవి. ఆడపిల్ల సమర్తాడక ముందే పెండ్లి చేయాలన్నది అప్పటి ఆచారం. సీత సమర్త గేయంలోఈ ఆచారం మనకు కనిపిస్తుంది.
వస్తు సంస్కృతిలో జానపదుల భౌతిక జీవితానికి సంబంధించిన అన్ని వస్తువులు ఈ విభాగంలో చేరతాయి. చిత్రకళ, శిల్ప, వాస్తు కళలు, ఇతర వృత్తులకు సంబంధించిన పరికరాలు, దుస్తులు, ఆభరణాలు ఆహార సామగ్రి, పూజా సామగ్రి, దారు-శిలా విగ్రహాలు ఇత్యాదులన్నీ కూడా ఈ విభాగానికే చెందుతాయి. రంపాల రాజు కథలో జానపదులు ఎరుకల సాని వేషాన్ని వర్ణించిన తీరు వారి జాతి వస్తు సంస్కృతిని తెలియజేస్తుంది.
సామాజిక పరిణామక్రమంలో జాతులు గణాలుగా, గణాలు రాజ్యాలుగా విస్తరించిన క్రమంలో వస్తున్న సంస్కృతిలో కూడా మార్పు వస్తుంది. సీత చేత జానపదులు పాడించిన
ఏడవకు కుశలవుడరామకుమారా
ఏడిస్తే నిన్నెవరెత్తుకుందూరు
ఉంగరమ్ములు గొనుచు ఉయ్యాల గొనుచు
ఊర్మిళా పినతల్లి వచ్చే నేడవకు
పట్టు లుంగీ గొనుచు పులిగోరు గొనుచు
భూదేవి అమ్మమ్మ వచ్చే నేడవకు
అంటూ సాగే ఈ పాటను చూస్తే... చిన్న పిల్లలకు సంబంధించిన ఆభరణ విశేషాలతో పాటు, తొట్లల్లో ఉన్నప్పటి నుండి పిల్లలకు తమ కుటుంబాన్ని, వావివరుసలను, వస్తు విజ్ఞానాన్ని పరిచయం చేయడం కనిపిస్తుంది.
గ్రామదేవతల కథలు, పేరంటాండ్ర కథలు వంటివి జానపదుల సంస్కృతికి సంబంధించిన పూజా విధానాలను, చిత్ర, శిల్ప-దారు కళారూపాలకు సంబంధించిన పద్ధతులను ఆయా దేవతలకు సమర్పించే ఆహార పానీయాదుల అంశాలను తెలియజేస్తాయి. శారీరక శ్రమ- మానసిక ఉల్లాసం ఈ రెండు అంశాలు జానపద పాటల్లో నిక్షిప్తమై ఉంటాయి.
-డా||వి.వీరాచారి
Authorization