భారత దేశంలో మొదటిసారిగా ఆలయాలను, మత సంబంధమైన కట్టడాలను కొండలలో పెద్ద శిలలతో తొలచడం అశోకుని కాలంలో ప్రారంభమయింది. ఈపద్ధతీ, ఇటుక కలపలతో నిర్మాణ పద్ధతి రెండూ కొనసాగుతూ వచ్చాయి. అయితే శిల శాశ్వతమైనది. కనుక వాటిలోకి తొలిచిన ఆలయాలు ఈ నాటికీ నిలిచి ఉన్నాయి. రాతిలో తొలిచినవాటికి ఆదర్శం అంతకు పూర్వపు ఇటుక-కలప నిర్మాణాలు కనుక; వాటి ముందుపక్క, లోపల వాటి లక్షణాలను ప్రతిబింబిస్తుంటాయి. ఈవిధంగా ఆనాటి వాస్తుశిల్ప రీతులు మనకు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. శిలల్లోకి తొలిచిన ఈ 'ఆలయాలు' అని పిలుస్తున్న నిర్మాణాలు నిర్మించిన ఆలయాల లక్షణాలను ప్రతిబింబించినప్పటికీ, వీటిని ఒకదానితో ఇంకొకటి కలిపి, పేర్చి చేసిన 'నిర్మాణాల' కింద జమకట్టలేము. వాటిని బృహత్ శిల్ప నిర్మాణంగా భావించవచ్చు. వాటిని 'రాతి వాస్తు శిల్పం'గానో, 'శిలావాస్తు శిల్పం'గానో వ్యవహరించాలి. ఈ దశ అశోకుని కాలం నుంచి వెయ్యేళ్లు కొనసాగింది. పదవ శతాబ్దం దాక చలామణిలో ఉంది. దేశమంతటా విస్తరించింది.
ఈ రాతి వాస్తు శిల్పాలలో మొదటివాటిని అశోకుడూ, అతడి మనుమడైన దశరథుడూ గయ వద్ద, నాగార్జున కొండలోను, బరాబర్ వద్ద కఠినమైన శిలలలో తొలిపించారు. ఇవి ఆజీవికలకు అంకితమైనవి. ఈ సముదాయంలో సుదామ (న్యగ్రోధ), లోమస రుషి గుహలు చెప్పుకోదగినవి. ఈ గుహలు అచ్చంగా బార్హుత్లోని 'సుద్దమ్మ దేవసభ'ను పోలి ఉన్నాయి. ఈ గుహల వరుసను పరిశీలిస్తే వీటిలోని ముఖ్యాయతనం వర్తులాకారంలో (గుంటుపల్లిలో వలె) వుండేదని, ఆ తర్వాత భక్తుల నిమిత్తం మండపం చేర్చారని తెలుస్తుంది. ఈవిధమైన రాతి వాస్తు శిల్పం, ఆ తరువాతి శతాబ్దంలో పడమటి దక్కన్ ప్రాంతంలోని మృదు శిలా ప్రాంతానికి వ్యాపించింది. క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తు శకం 200 మధ్య బౌద్ధ రాతి ఆలయాలను ఎన్నింటినో తొలిచారు. బుద్ధుడికి ప్రతీకగా ఉన్న ఆరాధ్య స్తూపం, దాని చుట్టూ చైత్యాలు, ఇటూ అటూ గదులు గదులుగా ఉండి మధ్యను సమావేశమందిరానికి కూటం ఉన్న విహారా (మఠా)లు-ఇవి ఆ నిర్మాణాల్లో ఉన్నాయి. పూనా, నాసిక్, అజంతా, ఔరంగాబాద్ల సమీపాన ఇలాంటివి ఉన్నాయి. గయకన్నా ఇక్కడి శిల మెత్తటిదైనందువల్ల తొలవడం సులభమని ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. ఆంధ్ర కోస్తా ఉత్తర భాగంలోని తూర్పు కనుమల్లో, ఒరిసా రాష్ట్ర దక్షిణ జిల్లాల్లోను ఈ విధంగా మృదు శిలలో దొలిచిన ఆలయాల్లో చెప్పుకోదగినవి గుంటుపల్లి, శంకరం, ఖండగిరి, ఉదయగిరిలలో ఉన్నాయి. పాల్సెట్లోని కొండిదివ్టిలోని బౌద్ధ గుహ, జున్నార్ (పూనా)లోని తుల్జా గుహ, గుంటుపల్లి (ఆంధ్ర) గుహలు గయ వద్ద ఉన్న సుదామ, లోమస రుషి గుహల వలెనే ఉన్నాయి.
అజంతా (దక్కన్)లో తొలిచిన 30 గుహల్లో రెండు (9,10 నెంబర్ గుహలు) చైత్యకూటాలు; నాలుగు విహారాలు: ఇవన్నీ కూడా తొలిదశకు చెందినవి, భాజ, కార్లె, కొండానె, పిత్తల్కోరా, నాసిక్; కన్హేరిలలోని బుద్ధ గుహలను పోలినవి. వీటిని బహుశ క్రీ.పూ 200-క్రీ.శ.200 మధ్య తొలిచి ఉంటారని భావించవచ్చు. మిగతా గుహలన్నీ నాల్గవ శతాబ్దం, ఆ తరువాత కాలానికి చెందినవిగా భావించవచ్చు.
తొలినాటి చైత్యాలు పెద్దగా, గజపృష్టాకారంలో, సువిశాలమైన ద్వారంతోను, దానిపైన గుర్రపు నాడా వంటి కిటికీలతోను ఉంటాయి. వీటి అతర్భాగంలో, మధ్య పొడుగాటి కూటము, వాటికి అటూ ఇటూ రెండు వరుసల స్తంభాలతో పేర్చబడిన దారులు ఉంటాయి. ఈ దారులు చివరంటా వెళ్ళి చాపం దగ్గిరవంగి ప్రదక్షిణ మార్గంగా రూపొందుతాయి. ఈ చాప భాగంలోనే, రాతిలో దొలిచిన ఆరాధ్య స్తూపం ఉంటుంది. ఈ దారుల పై కప్పులు చదునుగాగాని, లేక గొడుగులాగా కాని వుంటాయి.
విహారాలన్నీ కూడా స్తంభాల్లేని కూటములు.ఈ కూటములలో అటూ ఇటూ వరుసగా మూడు వైపుల రాతి గోడలలో చెక్కిన సన్యాసి గదులుండేవి. ఈ కూటానికి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ప్రధాన ద్వారాలు ఉంటాయి.
రెండవ దశకు చెందిన చాపాకారపు చైత్యాలు రెండు పాతవాటిలాగే ఉంటాయి. కానీ వీటిలో స్తూపానికి ముందుగా ఒక బుద్ధ విగ్రహం ఉంటుంది. ఈ బుద్ధ విగ్రహం స్తూపం అడుగు దిమ్మ నుంచి పొడుచుకొచ్చిన 'నాసిక' కింద ఉంటుంది. అంటే స్థూపాన్ని గుండ్రటి కప్పున్న వర్తులాకారపు గర్భగుడిలాగాను, ఆ కప్పు నుంచి బండి గూడు వలే ముందుకు సాగిన 'శుకనాసిక'ను ద్వారం లాగాను రూపకల్పన చేశారు. ఇది తరువాతి కాలపు'వేసర' పద్ధతి ఆలయ నిర్మాణానికి చెందుతుంది. చాలా వాటిలో సన్యాసి మఠాలు, ఆయతనాలు కలిసి ఉండటమూ, క్రమంగా ఆయతనాలు ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకోవడం కనిపిస్తుంది. ఆరాధ్య వస్తువు ఉన్న ఆయతనాన్ని (గర్భగుడిని) మనం 'చైత్యము' అని పిలిచేటట్లయితే వీటన్నిటినీ 'చైత్యవిహారాలు' అని పిలువవలసి ఉంటుంది. చైత్యానికి దేవకులము, ఆయతనము, విమానము, ధామము, మందిరము అన్న ఇతర పేర్లూ ఉన్నాయి.
ఈ విహారాలకు తరువాతి కాలంలో రూపొందిన దేవాలయాలకు పోలికలు ఉన్నాయి. ఈ విహారాలలో ఆలయాల ముఖమండపము లేదా అగ్ర మంటపమును పోలిన బయట వసారా ఉంటుంది. చివర గర్భ గృహం కల మహామంటపాన్ని పోలిన కూటం ఈ విహారాల్లో ఉన్నాయి.
వరుసగా మండపాలుండి చివర దీర్ఘచతురస్రాకారపు కూటము, దాని వెనుకగాని, దానిలో చొచ్చుకొని వస్తున్నట్లుగాని ఆయతనం ఉండడం అన్నది-దక్షిణ దేశంలో చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు వంటి రాజుల కాలంలో తొలిచిన హిందు, జైన కొండరాతి దేవాలయాల్లోనూ కనిపిస్తుంది. ఇటువంటి రాతి వాస్తుశిల్ప నిర్మాణం పదవ శతాబ్దం దాకా, ఎల్లోరా వంటి చోట్లయితే ఆ తర్వాత కూడా కొనసాగింది.
-మౌక్తిక్
Authorization