సంస్కృతే చరాచర ప్రపంచానికి మూలమనిగాని, అదే సర్వస్వమనిగాని భావించకూడదు. సంస్కృతి అతి ముఖ్యమైనదన్న విషయం నిర్వివాదాంశం. అయితే మరి సంస్కృతిని సృజించిన మానవుడు ఉన్నాడు కదా. సంస్కృతే సర్వస్వమైతే ఒకే సంస్కృతిలో పుట్టిన మావులంతా ఒకే రకంగా ఎందుకుండరు? మనుషుల్లో వైయక్తిక విభేదాలున్నాయి. వారిమధ్య సామాన్య లక్షణాలున్నాయి. సామాన్య లక్షణాలకు సంస్కృతి కారణమైతే వైయక్తిక భేదాలకు, వైలక్షణాలకు, మూర్తిమత్వం వ్యక్తిత్వం, సృజనాత్మకతలు కారణాలు. మనిషి వ్యక్తిగా అనన్యుడు. అచ్చు అతనిని బోలినవాడు వేరొకడు ఉండడు. ఒకే సంస్కృతిలో పుట్టి పెరిగినప్పటికీ వ్యక్తులు తమ తమ వ్యక్తిత్వాలను పెంచుకుంటారు.
వ్యక్తిత్వానికి మూలకందకమైన ఆత్మ సాంఘిక ప్రక్రియా ప్రభావితం కావచ్చు. అయినా ''తనను తాను గుర్తించిన'' మానవుడు, తన వ్యక్తిత్వాన్ని పరిసరం మీద ప్రసరింపజేసి అందులో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అంతేగాక ప్రతిమనిషికి ఆత్మాభివ్యక్తి అనే మానసిక అవసరం ఉంది. తన కోర్కెలను, అనుభవాలను, అనుభూతులను, భావనలను ఇతరులకు చెప్పుకోవాలి. అట్లా చెప్పుకోకుండా మనిషి బతకలేడు. ఈ అవసరం ప్రభావం వ్యక్తి వ్యక్తికీ మారవచ్చు. అది వారి బాహ్య, అంతర పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆత్మాభివ్యక్తీకరణం అప్పుడప్పుడు సంస్కృతిని తృణీకరిస్తుంది. తను విధించుకున్న నియమాలను తానే ధిక్కరించడంలోనే మనిషికి ఆనందం ఉంది. ఇది మానవ జాతికి సామాన్యం కూడా. ఇది మరో విజ్ఞాన శాస్త్ర సత్యం. వాస్తవ ప్రవర్తనకు, ఆదర్శ ప్రవర్తనకు మధ్య ఎప్పుడూ తేడా ఉంటుంది. ఇంతేకాక మనం మామూలుగా ఒకటి వల్లిస్తుంటాం. వేరొకటి చేస్తూ ఉంటాం.ఈ వైరుధ్యం కూడా ఎప్పుడూ ఉండనే ఉంది. అందుకే సమాజ శాస్త్రజ్ఞులు ఆదర్శ, వాస్తవ సంస్కృతులకు మధ్య తేడా చెప్పారు. దాదాపు ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ 'అగమ్య గమన' (ఇన్సెస్ట్) నిషేధం ఉంది. ఈ నియమాన్ని పాటించకపోతే ఎంత బాగుండు! ఒకరు ఏర్పరచిన నియమాన్ని ఉల్లంఘించడం ఎంత తృప్తిగా ఉంటుంది! పిల్లల ప్రవర్తన జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ వైరుధ్యాలు గోచరిస్తాయి. వారికి సంస్కృతిని అలవాటు చేసే క్రమంలో వారి నుంచి ఎదురయ్యే సంఘర్షణ, విముఖత, పెనుగులాటలు మనకు అనుభవాలే. బహుశ మానవునిలోని నిరంతర వేదన, నిస్పృహ, నిరాశలకు ఈ వైరుధ్యం (ఆచణాదర్శాల మధ్య అంతరం) కారణమేమో. తన అభివ్యక్తీకరణాన్ని సమాజం కుంటుపరిచినప్పుడు భద్రత లేని వ్యక్తి బాధపడతాడు. బానిసనని సిగ్గుపడతాడు. అందుకేనేమో ''ప్రపంచం దు:ఖమయం'' అనే తత్వం మనకు బాగా నచ్చుతుంది.
జీవపదార్థంతో తయారైన పశువులాంటి శిశువు సాంఘికీకరణ ప్రక్రియ ద్వారా మనిషి అవుతుంది. పుట్టినప్పుడు శిశువు రక్తమాంసాల ముద్ద. ఆత్మగాని, మనసుగాని ఉండవు. తర్వాతనే ఇవి ఏర్పడతాయి. ఎట్లా ఏర్పడతాయో చూద్దాం.
బిడ్డ ముందు తల్లితో, తరువాత కుటుంబ సభ్యులతో, ఆ తరువాత ఇరుగుపొరుగుతో ప్రతిచర్య జరుపుతుంది. ఈ ప్రతి చర్యలో అతని మూర్తిమత్వం రూపురేఖలు దిద్దుకుంటుంది. తను నివసించే సమూహం భాష, అలవాట్లు, ఆచార వ్యవహారాలు నేర్చుకొంటాడు. ఒక వ్యక్తి సుఖసంతోషాలు ఇతరులతో అతడు నెరపే పరస్పర సంబంధాలపై ఆధారపడి ఉంటాయి.
ఒకపక్క మూర్తిమత్వం వికసిస్తూ ఉంటే, అదే సమయంలో మరో వైపు నుంచి వ్యక్తిత్వం ప్రాదుర్భావం చెందుతుంది. ఒకపక్క సమాజం కట్టుబాట్లను పాటిస్తూనే తాను ప్రతిచర్య జరిపే ఇతరులకంటే 'తాను వేర'ని గుర్తిస్తాడు. ఒకపక్క సామాజిక స్పృహ ఏర్పడుతూ ఉంటే మరోపక్క ఆత్మ స్పృహ రూపొందుతుంది. రెండింటి మధ్య సాన్నిహిత్యం అత్యంతం. ఒకటి లేకుండా రెండోది లేదు. ఒకే నాణేనికి ఈ రెండూ రెండు ముఖాలు. సమాజ భావంలో వ్యక్తి తనను తాను ఎరగలేడు. ఎందుకంటే ఆత్మ నిష్పన్నం కాదు. ఇతరులతోడి ప్రతిచర్యతోనే క్రమంగా వ్యక్తి తనను గురించిన తన ప్రతిమనొకదాన్ని రూపొందించుకుంటాడు. ఆవిధంగా అతడు అనన్యుడవుతాడు. ఈ అనన్యత, వ్యక్తిత్వాలు ఇతరులను అర్థం చేసుకోవడానికి ఉపయోగ పడతాయి. ఈ వైయక్తీకరణ ప్రక్రియలో వ్యక్తి స్వతంత్రుడవుతాడు. ఆత్మ సంయమనుడవుతాడు. ఆత్మ పెరిగేకొద్దీ, కట్టుబాట్లు, ఆచారాల ప్రభావం అతని మీద తగ్గిపోతుంది. అధికారాన్ని, ఆప్తవాక్యప్రమాణాన్ని అంగీకరించక, గుర్తించక స్వతంత్ర అభిప్రాయాలను ఏర్పరచుకుంటాడు.
మూర్తిమత్వం పొందే తీరు చూస్తే అక్కడ కూడా సంస్కృతితో ఘర్షణ కనిపిస్తుంది. సంస్కృతి లక్ష్యం వ్యక్తిని తనకు అనుగుణ్యంగా, అనువృత్తునిగా చేసుకోవడం. మరి జరుగుతున్నదేమిటి? అనువృత్తితో పాటు దానిననుసరించి ఫ్రస్ట్రేషన్, టెన్షన్లు వస్తున్నాయి. సంస్కృతికి రెండు పక్షాలున్నాయి. ఒకటి అది జీవనవనావరాలను తీరుస్తుంది. రెండోది ఆ అవసరాలను కుంఠితమూ చేస్తుంది. సంస్కృతికి ఉన్న ఈ రెండు పక్షాలను మనం అర్థం చేసుకోవాలి. తల్లి బిడ్డను ప్రేమతో పెంచుతుంది. అవసరమైతే కొడుతుంది కూడా.
సాంఘిక కుంఠనం (సోషల్ ఫ్రస్ట్రేషన్) ద్వారా మూర్తిమత్వాలలోని భిన్నత్వాన్ని అర్థంచేసుకోవచ్చని మనో విశ్లేషణ వేత్తలు చెబుతున్నారు. నియమబద్ధమైన ప్రవర్తన శిశువుకు ఎప్పుడూ కంటకంగానే ఉంటుంది. చికాకు కలిగిస్తుంది. మరి సంఘం సాఫీగా సాగిపోవాలంటే, మూర్తిమత్వం వికసించాలంటే, అది ఎంతైనా అవసరం. భారతీయులు ఈ విషయాన్ని ఎప్పుడో గుర్తించారు. మానవ సంబంధాలకు మూలం రాగద్వేషాలన్నారు. దీనిని ఫ్రాయిడ్ తిరిగి కనుక్కున్నాడు. వాటికి ఈరీస్, తానటాస్-జనన మరణాలు అని పేర్లు పెట్టాడు. జీవన గతిలో వ్యక్తి లభించిన రాగద్వేషాల సాంద్రత అతని మూర్తిమత్వ విశేషాలను నిర్ణయిస్తుంది.కుంఠనాన్ని ఎదుర్కొనడంలో మనిషి ఎదుగుతాడు. పరిణతి చెందుతాడు.
-ఎ.వి.రెడ్డి
Authorization