ప్రకృతి శక్తులను దేవుళ్లు, దేవతలుగా భావించడం ప్రారంభించిన దగ్గరి నుంచి మనిషి తన దైనందిన జీవితంలోని అనేక సందర్భాలలో వాటిని పూజించడం ఆనవాయితీ అయింది. మానవుడు వ్యవసాయం చేయడం ప్రారంభించిన తర్వాత, అంతకు ముందు కూడా చెట్లు మొక్కల నుంచి లభించే కాయలు, పండ్లు, గింజలు దేవుడు తమకిచ్చిన ఆహారంగా భావించేవాడు. అందుకే అడవుల్లో రుతువుల ప్రకారం కాసే కాయలు, పండ్లు, కూరగాయలను ఒక పండుగ లేక జాతర నిర్వహించి దేవునికి అర్పించిన తరువాతే మానవులు వినియోగించు కోవడం ఒక ఆచారంగా మొదలు పెట్టారు. అదేవిధంగా గింజలు, మొక్కలు నాటే టప్పుడు, పంటను కోసేటప్పుడు కూడా దేవతలను కొలిచికానీ పని ప్రారంభించేవారు కాదు. పైన పేర్కొన్న ఈ ఆచారాలు ఇప్పటికీ ఆదివాసీల్లో చూడవచ్చు. అయితే ఆదివాసీల్లో ఉన్నంత పెద్ద ఎత్తున ఇటువంటి ఆచారాలు మైదాన ప్రాంతాల్లో లేనప్పటికీ కొంతమేర తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రాచీన ఆచార సంప్రదాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకు మచ్చుకు కొన్ని వ్యవసాయ సంబంధిత బోనాలెత్తడం సాక్ష్యంగా చూపవచ్చు.
విత్తనాలు చల్లి నారుమడులు తయారు చేయడానికి నాందిగా అలుకుడు బోనమెత్తడం తెలంగాణ పల్లెల్లో సాధారణ దృశ్యంగా కనిపిస్తుంది. పొలంలో పని ప్రారంభించాలనుకున్న రోజు ఇంటిదగ్గర ఒక కుండలో అన్నం వండి దాన్ని ఒక తట్టలో పెట్టుకొని పొలం తీసుకువస్తారు. తరువాత ఎండిపోయిన ముండ్లు ఉన్న ఊడుగు కొమ్మను తెచ్చి దాని ముండ్లకు బంతిపూలు చెక్కుతారు. ఆ కొమ్మను రొప్పిన మడి ఒడ్డుకు దగ్గరగా సాయను ఆనుకొని ఉండేలా పాతుతారు. అయిదు పలుగు రాళ్లను ఏరుకొచ్చి కడిగి నూనెరాసి పసుపు, కుంకుమ అద్ది ఆ పాతిన కొమ్మ మొదట్లో పెడతారు. మొలక ధాన్యాన్ని తీసి పూదిచ్చిన పలుగురాళ్ల దగ్గర అయిదు కుప్పలు, పోత లింగనివద్ద అయిదు కుప్పలు, మైసమ్మ దగ్గర అయిదు కుప్పలు పోసి దండం పెడతారు. నెయ్యి, పెరుగు కలిపిన అన్నాన్ని పూదించిన పలుగురాళ్లకు నైవేద్యం పెడతారు. గొంగట్లో విప్పిన మొలకలను పోసుకొని రైతు మొలకలు చల్లుతాడు. నైవేద్యంగా పెట్టిన అన్నాన్ని అలుకుడు చెయ్యడానికి వచ్చిన స్త్రీలు తింటారు. మొలక అలికిన రైతు మాత్రం ఆ అన్నాన్ని తినకూడదని అంటారు.
ఇక నారుమడి నుంచి నారును పీకి చేలో నాటిన రెండు నెలల్లోనే పంంట బాగా దుబ్బుచేయడం ప్రారంభమవుతుంది. పంట మొక్కలతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి.ఈ కలుపును తీస్తే తప్ప పంటలు బాగా పండవు. కాబట్టి కలుపు తీయడానికి పూనుకుంటారు. ఇట్లా కలుపు తీసే రోజున కూడా బోనం వండుతారు. సున్నంతో పూదిచ్చిన కుండలో అన్నం వండి తెచ్చి, ఆ అన్నంలో పెరుగు, నెయ్యి కలిపి చేనుదగ్గర నైవేద్యం పెడతారు. కలుపు తీయడానికి వచ్చిన స్త్రీలు ఆ అన్నాన్ని తిని పనికి ఉపక్రమిస్తారు.
ఇక రేపో మాపో పంట చేతికి వస్తుందనగా గానీ, లేక చేను ఇంకా పచ్చగానే ఉన్నప్పుడు కాని రైతులు 'పొలి' చేస్తారు. అంటే గొర్రెను మైసమ్మకు బలివ్వడమన్నమాట.ఈ ఆచారం ప్రకారం ముందుగా రజకుణ్ణి (చాకలిని) తీసుకొని రైతు గొల్ల లేక కురుమవారి దగ్గరికి పోయి ఒక గొర్రెను ఎంచుకుంటాడు. ఆ గొర్రెను ఇంటికి చేర్చే బాధ్యత చాకలివానిదే. పొలిరోజునాడు చాకలి స్త్రీ తన ఇంటి నుంచి పచ్చి సున్నం ముద్దను రైతు ఇంటికి తీసుకువస్తుంది. రైతు ఇంటి నుంచి బోనం వండటానికి కావలసిన బియ్యం, నూనె, పసుపు, కుంకుమ తీసుకొని మైసమ్మ గుడికి పోతుంది. అక్కడ సున్నం పూసిన బోనంలో అన్నం వండుతుంది. మిగిలిన సున్నాన్ని మైసమ్మగుడికి పూదిచ్చి పసుపు కుంకుమలతో బొట్లు పెడతారు. మైసమ్మ విగ్రహం ఉండకపోవడం విశేషం. రాయినే దేవతగా పూజిస్తారు. మంద నుంచి తెచ్చిన గొర్రె ముఖాన్ని కల్లుతో కడిగి పసుపు, కుంకుమలు బొట్లుగా పెట్టి, మొడలో వేప మండల దండ వేస్తారు. పచ్చిమోదుగు ఆకులపై నిప్పులు వేసి వాటిపై నూనె వేసి గొర్రెకు పొగపడతారు. ఆ తరువాత చాకలి వ్యక్తి గొర్రె తలను కోస్తాడు. యాట తలను గుడి ముందు కొద్దిసేపు ఉంచుతాడు. అట్లాగే బోనం పెట్టి నైవేద్యం సమర్పిస్తారు. యాట కార్జాన్ని నిప్పులపై కాల్చి మైసమ్మకు నైవేద్యంగా పెడతారు. కొంత రక్తాన్ని అన్నంలో కలిపి దాన్ని తట్టలో పెట్టుకొని పొలం తీసుకుపోతాడు ఆ చాకలి వ్యక్తి. ఈ అన్నాన్నే 'సర్వు' అంటారు. పొలం చుట్టూను, పొలంలోను సర్వు వేస్తాడు. ఇట్లా చేయడం వల్ల పంట ఎక్కువవుతుందని రైతుల నమ్మకం.
అదే రోజు రైతు పనిపాటలవారిని పిలిచి 'బొట్టు' పంచుతాడు. పొలి చేసు కున్న రైతుల్లో కొందరు యాట మాంసాన్ని ఇంటిదగ్గర వండుకుంటే మరికొందరు బాయిదగ్గరనే వంట చేసి , మైసమ్మకు, పోతలింగనికి నైవేద్యం పెడతారు. అట్లాగే పనివారినందరినీ భోజనాలకు పిలుస్తారు.ఈ పొలి కార్యక్రమం వల్ల దేవత దీవెనార్తి లభిస్తుందని రైతులు నమ్ముతారు.
ఇట్లా తెలంగాణలో ప్రాచీన కాలపు ఆచార సంప్రదాయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ విధంగా మన సంస్కృతి అతి ప్రాచీనతను కలిగి ఉందని చెప్పవచ్చు.
-శివ
Authorization