ఉమ్మడి పశ్చిమాంధ్ర... అంటే ఇప్పటి తెలంగాణ, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలు, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు తొలి చాళుక్య రాజుల ప్రత్యక్ష పాలనలో ఉండేవి. వారి పాలనా కాలంలో అంటే క్రీ.శ.ఏడు, ఎనిమిది శతాబ్దాలలో ఉన్న పాలనా విభాగాలను నాడు, వాడి, విషయ అనేవారు. వీటిలో 'విషయం' అనే విభాగం కింద ఉన్న ఇప్పటి ప్రాంతాలేమిటో చూద్దాం.
చాళుక్య విషయం అనేది శాసనాల్లో కనిపిస్తుంది.ఈ విషయంలో తుంగభద్ర, కృష్ణా నదులు; వాటి ఉపనదులు- భవనాశి, చింతేరులకు అటు ఇటూ ఉన్న భూ ప్రాంతాలు ఉంటాయి. తుంగభద్ర, చింతేరు, భవనాశిలు కృష్ణా సంగమం వల్ల కొన్ని ప్రాంతాల భూములు సారవంతమయ్యాయి. రాళ్లు ఉన్న నేలలు, చిన్న చిన్న కొండలు వాటికి అందమైన రూపాన్ని ఇచ్చాయి. విషయం అనే పదం రెండవ పులకేశి శాసనంలో కనిపిస్తుంది.
'వంగూరు నాటి విషయం'లో కృష్ణా నది ఎగువ భూములు ఉన్నాయి. పాత మహబూబ్నగర్ జిల్లాలోని వీపనగండ్ల, పానగల్, కొల్హాపూర్, నాగర్కర్నూల్, బిజ్నెపల్లి, వనపర్తి, కోడేరు మండలాలు ఈ విషయంలోకి వస్తాయి. దక్షిణాన కృష్ణా నది, ఈశాన్యాన దిండి నది దీనికి చెప్పుకోదగిన జలవనరులు. ఆముదాలపాడు, తామ్రశాసనంలో పేర్కొన్న గ్రామాలు - వడ్డమాన్, పనియాలు, పల్లిపాడు, బమన్కల్ నగర పానగల్, కృష్ణా నది ఒడ్డున ఉన్న మానూరు, చిన్న మర్రూర్/పెద్దమర్రూర్, ఇపరుంకల్, వీపనగండ్ల, వంగూరు. ఈ విభాగానికి బహుశా వంగూరు కేద్ర స్థానం అయి ఉండవచ్చని భావిస్తున్నారు.
మరో మధ్య యుగ పాలనా విభాగం 'కన్నె విషయం'. మొదటి విక్రమాదిత్యుని శాసనం ఒకటి కన్నె-విషయంలోని చింతకుంట గ్రామ దానాన్ని ప్రస్తావిస్తున్నది. కృష్ణా-తుంగభద్రానదుల మధ్య దోబ్లోని పంచలింగాల నుండి సిద్ధేశ్వరం వరకు గల భూ ప్రాంతాలు; కర్నూలు జిల్లాలోని భవనాశీ నదిని ఆనుకొని ఉన్న ప్రాంతాలు, కర్నూలు జిల్లాలోని కొత్తపల్లె, నందికొట్కూరు మండలాలు; మహబూబ్నగర్ జిల్లాలోని అలం పురం మండలం ఉండి ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఆ తర్వాత ఈ విభాగాన్ని కన్నె-300 అనీ, కన్నె-నాడు అనీ ప్రస్తావించేవారు కాని, విషయం అనే వారు కాదు. తెలంగాణ లోని ఉత్తర, తూర్పు ప్రాంతాలు చాళుక్య శాసనాల్లో చోటు చేసుకోనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ప్రాంతాలు 'సపాద-లక్ష' విభాగం, కోశవలదేశం మరో భూ విభాగమని భావించవచ్చంటు న్నారు చరిత్రకారులు.
Authorization