తెలంగాణలో పిట్టలోళ్లు అని పిలుస్తున్న పార్థీలు ఇక్కడికి ఉత్తరాది, మధ్య భారత దేశం నుంచి వలసవచ్చారు. తెలంగాణలో సిద్ధిపేట, ఆదిలాబాద్, హైదరాబాదు వంటి చోట్ల వీరు బతుకులు వెళ్లదీస్తున్నారు. సిద్ధిపేట ప్రాంతంలో ప్రయాణిస్తున్న 'జాతర' ప్రతినిధికి కొండ పక్కన చిన్న చిన్న గుడిసెలు వేసుకొని జీవిస్తున్న 'పిట్టల'వారు కనిపించారు. వారితో మాట కలిపినప్పుడు ఎన్నో సంగతులు మాట్లాడారు. ఆ సంగతులకు మరింత సమాచారం జోడించి ఇస్తున్న వ్యాసం ఇది.
పార్థీలు తమదైన ప్రత్యేక జీవన శైలిని కలిగి ఉంటారు.వీరిని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటి రకంవారు వేటాడటం ద్వారా జీవిస్తే రెండో రకం వారు రాళ్లపని చేసి బతుకుతారు. మొదటి రకంవారు గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ల్లో ఎక్కువగా ఉంటే; రెండో రకంవారు ప్రధానంగా రాజస్థాన్లో ఎక్కువగా కనిపిస్తారు. రాణాప్రతాప్ మరణించినప్పుడు ఈ ప్రజలు చాలా కష్టాలు అనుభవించినట్లు చెబుతారు. ఆ సమయంలో వారు మహారాష్ట్ర వలసవచ్చారు. పార్థీ ప్రజలు తమ చుట్టుపక్కలున్న భిల్లు తెగకన్నా భిన్నంగా ఉంటారు. వీరు కుల వ్యవవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. అందువల్లే వీరు ఎవరితోనూ కలవకుండా స్వతంత్రంగా తమ కోసం కొన్ని ఆచార, సంప్రదాయాలను ఏర్పరచుకున్నారు. వారు వేట, యాచక వృత్తుల వంటివాటినైనా ఎంచుకోవడానికి ఇష్టపడ్డారు కాని తమ సాంఘిక మర్యాదను తగ్గించే హిందు సామాజిక వ్యవస్థలో కలిసిపోవడానికి మాత్రం ఇష్టపడలేదు.
ముంబయి ప్రాంతంలో చాలామంది పార్థీలు నివసిస్తున్నారు. సంచార జీవితం గడుపుతూ అక్కడక్కడ చిన్న చిన్న పూరి గుడిసెలు, తాత్కాలిక షెల్టర్లు నిర్మించుకుని వీరు నివసిస్తున్నారు. వీరు ముఖ్యంగా పక్షులను వేటాడుతారు. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉన్నవారు పాములు పట్టడంలో ప్రావీణ్యం గడించారు. అందువల్ల వీరు పాములను ఆడించడాన్నీ వృత్తిగా బతుకుతున్నారు. చాలామంది బుట్టలు అల్లడం, నల్లరాతితో వస్తువులు తయారుచేయడం వంటి వృత్తుల్లోనూ ఉన్నారు.
చిన్న చిన్న బృందాలుగా బతుకుతూ వలలు, ఉచ్చుల ద్వారా వేటాడటం కనిపిస్తుంది. అట్లాగే రాళ్లపని చేసేవారు ఊళ్ల ల్లో ఇంటింటికి తిరుగుతూ రోళ్లు, తిరగళ్లు వంటివాటికి కక్కు కొడుతూ బతుకడం సాధారణ దృశ్యం. పార్థీలు తమ ఉపకులాల వారిని మాత్రమే వివాహం చేసుకుంటారు. ఇక వీరి నమ్మక వ్యవస్థ సంగతికి వస్తే... వందల ఏండ్లుగా వారు తమకే ప్రత్యేకించిన విశ్వాసాలు కలిగి ఉన్నా హిందు ఆచార సంప్రదాయాల ప్రభావం కూడా వారి మీద ఉంది. . వారు ఆత్మలను నమ్ముతారు. అవి ఈ భౌతిక ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తారు. బహుదేవతారాధన చేస్తారు. ఎంతోమంది దేవతలు, దేవుళ్లు వారి ఆధ్యాత్మిక ప్రపంచంలో పూజలందుకుంటారు. హైదరాబాదులో ఉన్న పిట్టలవారు తమ ఆడపడుచు ఒకరిని గుర్తు చేసుకుంటూ జాతర కూడా చేస్తారు.
ఆదివాసీ జీవనమే...
సిద్ధిపేట ప్రాంతంలో ఉన్న పిట్టలవారు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. 'జాతర' ప్రతినిధి వారి గుడిసెలను చూసినప్పుడు అవి గట్టి గాలి వచ్చినా లేచిపోయేలా కనిపించాయి. ప్లాస్టిక్ పట్టాలను పైకప్పుగా ఉన్న చిన్న చిన్న ఈ షెల్టర్లను గుడిసెలు అని కూడా అనలేం. అక్కడ ఉన్న పది పన్నెండు గుడిసెల్లో ఒకరిద్దరు తప్ప మిగతావారంతా పనుల కోసం బయటికి వెళ్లారు. అచ్చంగా అడవిలో నివసించే తెగలమాదిరిగానే వారి జీవనం ఉన్నట్లు కనిపించింది. వంట చేసుకున్న పాత్రల్లోని ఆహారం కుక్కలు, పక్షులు, చీమల పాలు కాకుండా... వారు ఒక స్తంభాన్ని గుడిసె బయట పాతి దానికి ఒక గుడ్డను జోలె (ఉట్టి)లాగా కట్టి అందులో పాత్రలు ఉంచుకున్నారు.
వారు వలను ఎట్లా పన్నుతోరో ప్రదర్శించి చూపారు. పిట్టలను పట్టుకొని అమ్ముకోవడం ద్వారా జీవిస్తున్నా... వీరు ప్రస్తుతం ఆ వృత్తిని వదిలి వేరే జీవన ఉపాధిలను అనుసరిస్తున్నారు. కొంతమంది కూలికి వెళ్లడం, పొలాలను, తోటలను గుత్తకు తీసుకోవడం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం ద్వారా ఇక్కడి పిట్టలవారు తమ జీవితాన్ని మెరుగుపరుచుకునే దారిలో ఉన్నారు. దుర్భర జీవితం గడుపుతున్న పిట్టలవారిని ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని ఏండ్లు గడిచిపోయినా పిట్టలవారి వంటివారు ఎందరో ఇంకా అమానవీయ పరిస్థితుల్ల్లో జీవించడం బాధాకరం.
- శివ
Authorization