తమిళనాడులోని కూవగాం లింగమార్పిడి చేసుకున్నవారి (ట్రాన్సజెండర్స్)కి చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రం. విల్లిపురం జిల్లాలో ఉన్న ఈ ఊరుళ్లో ప్రతి ఏడాది 15 రోజుల పాటు పెద్ద ఎత్తున ట్రాన్స్జెండర్స్ తమకే ప్రత్యేకించిన ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తమిళ మహాభారతంలో ఉండే అరవణ్ కథను ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాలు కోదండవార్ దేవాలయంలో జరుగుతాయి. మహాభారతం ప్రకారం ఇరవణ్ అనే పాండవ రాకుమారుడు ఉంటాడు. ఇతడు అర్జునునికి నాగ రాకుమార్తె ఉలిపికి జన్మించినవాడు. తమిళ ప్రాంతంలోని కూదండవార్ శాఖకు ఇరవణ్ ప్రధాన దేవుడు. ఇతడిని ఈ ప్రాంతంలో అరవణ్ అనే పేరుతో పూజిస్తారు. ఇతడే 'అరవణి' అనే పేరుతో ట్రాన్స్జెండర్స్ నుంచి పూజలందుకుంటూ ఉంటాడు. వారికి ఈయనే కులదైవమన్నమాట.
మహాభారతం ప్రకారం యుద్ధంలో పాండవులకు విజయం చేకూరడానికి కాళిమాతకు బలి అవ్వడానికి సిద్ధమవుతాడు అరవణ్. ఇందుకు కృష్ణుడు ఎంతో సంతోషించి అతడిని ఒక వరం కోరుకోమంటాడు. అందుకు అరవణ్ తాను మరణించక ముందు పెండ్లిచేసుకోవాలని ఉందంటాడు. కానీ అరవణ్ చనిపోతాడని తెలిసిన ఏ ఆడకూతురు అతణ్ణి పెండ్లాడటానికి ఇష్టపడదు. అప్పుడు శ్రీకృష్ణుడే మోహిని అవతారం దాల్చి అరవణ్ని వివాహమాడుతాడు. తరువాత అరవణ్ కాళిమాతకు తన ప్రాణాలర్పిస్తాడు.
ఈ మొత్తం కథను ప్రతి ఏడాది కూదండవార్ ఆలయంలో ట్రాన్స్జెండర్స్ తామే పాత్రధారులుగా మారి ప్రదర్శిస్తారు.ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చే ట్రాన్స్జెండర్స్ అందరూ తమకున్నంతలో మంచి బట్టలు, నగలు ధరిస్తారు. తమను తాము మోహినిగా భావించుకుంటారు. కూదండవార్ దేవాలయం గర్భగుడిలో దేవుని ముందు పూజారి దేవుడు అరవణ్కు బదులు తానే ట్రాన్స్జెండర్ మెడలో తాళి కడతాడు. ఆ మరుసటి రోజు ట్రాన్స్జెండర్స్ అందరూ కలిసి వితంతువులుగా మారే తంతును నిర్వహిస్తారు. ఆరోజు హృదయవిదారకంగా ట్రాన్స్జెండర్స్ అందరూ విలపిస్తారు. మెడలో ఉన్న తాళిని తెంచి, గాజులు పగులగొట్టి వితంతువుగా మార్చే దృశ్యం హృదయాలను కదిలించివేస్తుంది.
ఉత్సవాల్లో మిగిలిన రోజుల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అట్లాగే అందాల పోటీలు, పాటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. ఇదే సమయంలో ట్రాన్స్జెండర్స్ సమస్యలు, హక్కులపైనా అనేక చర్చలు జరుగుతాయి.
- తేజస్ రామానుజన్
Authorization