తెలుగు రాష్ల్రాలు, దక్కన్లోని మిగతా ప్రాంతాల్లో అనేక నవీన శిలాయుగపు స్థలాలు ఉన్నాయి. అందువల్ల మన తెలుగు నేలపై వేల ఏండ్ల క్రితమే వ్యవసాయంతో సహా ఇప్పుడు మన సమాజంలో చూస్తున్న అనేక ఆచార సంప్రదాయాలు, వాణిజ్యం వంటివి ప్రారంభమయ్యాయని అర్థమవుతుంది. ఇప్పటికీ కొనసాగుతున్న గ్రామదేవతారాధన, అంత్యక్రియల పద్ధతులూ ఆ కాలంలో ప్రారంభమైనవే. అంటున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు.
విస్తృతంగా వ్యావసాయిక కార్యకలాపాలు చేపట్టిన కారణంగా తీరాంధ్ర ప్రాంతంలో, పూర్వ చారిత్రక దశకు చెందిన చాలా పురాతత్వ ఆధారాలె నశించిపోయాయని మనం భావించవలసి ఉంటుంది. పూర్వ చారిత్రక ప్రాముఖ్యం కలిగిన ఒక స్థలం కృష్ణా జిల్లాలోని కాసనపల్లిలో కాంస్య, రాతి పరికరాలతో కూడిన నిక్షేపాలు కనిపించాయి. అధిక సంఖ్యలోనలుపు, ఎరుపు పాత్రలేకాక, చిత్రించిన రెండు కుండపెంకులు లభించాయి. వీటిలో ఒకదానిపై బూడిదరంగు నేపథ్యంలో నలుపురంగులో ఒక డిజైను, మరోదానిపై తెలుపు రంగు నేపథ్యంలో నలుపురంగు డిజైను ఉన్నాయి. ఈ స్థలంలో లభించిన పాత్రలకు మధ్యభారతంలో, రాజస్థాన్లో లభించిన పాత్రలకు సన్నిహిత సంబంధం ఉందనితెలిసింది. ఈ స్థలం నుండి ఎట్లాంటి సూక్ష్మశిలా పరికరాలు లభించలేదు. కాని కొన్ని రకాల కొత్తరాతి యుగం (నవీన శిలాయుగం) పనిముట్లు లభించాయి. సింగనపల్లిలో జరిగిన తవ్వకాల్లో రంగులేని మట్టిపాత్రలు, రాతి అలుగులు, బెజ్జాల చేవలు లభించాయి. కాసనపల్లిలోను, సింగనపల్లిలోను జరిపిన తవ్వకాల ఆధారంగా క్రీ.పూ.2వ సహస్రాబ్దపు ఉత్తరార్థానికి చెందిన కాంస్య-రాతి యుగ జనావాసాలు తెలుగు నేలపై ఉండేవని భావిస్తున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. ఆకాలపు జనావాసాల స్వభావం సమర్థమైన వ్యవసాయా నికి చెందినదని భావించారు. అందుకు అక్కడ లభ్యమైన సారెపై తయారుచేసిన కుండలు, రాతిపరికరాలు, రాగివస్తువులు, పంటలు, పాడిపశువుల ఎముకలు, మరికొన్ని గృహ సంబంధం వస్తువులే సాక్ష్యం. భారతీయ కారెనుము, గోధుమవర్ణపు జింక, మచ్చల లేడి వంటి జంతువుల పెంపకం సాగినట్లు నాగార్జున కొండ తవ్వకాల్లో దొరికిన ఎముకల వల్ల తెలుస్తున్నది. అల్చిన్ అభిప్రాయంలో దక్కన్లోని తొలి కొత్తరాతియుగ సాంస్కృతిక సముదాయం క్రీ.పూ.మొదటి సహస్రాబ్ది ఆరంభం వరకు కొనసాగింది.
ఉత్తర, మధ్య భారతాలతో సంబంధం
ఇప్పటి తెలుగు మాట్లాడే ప్రజలు నివసించే భూభాగం తొలి కొత్తరాతి-కాంస్య రాతియుగ ప్రజలు మధ్య భారతం, రాజస్థాన్ లాంటి ఉత్తర ప్రాంతాలతో సంపర్కం కలిగి ఉన్నారని తెలుస్తుంది. ఈ ప్రాంతాల నుంచే వీరు చిత్రిత మృణ్మయపాత్రలు (పెయింటెడ్ పోటరీ), అలుగు సంప్రదాయాలను పుణికిపుచ్చుకున్నారు. కృష్ణా లోయలోని నాగార్జునకొండ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో చరిత్ర పూర్వ జనావాసాలు ఉన్నట్లు వారికి రాయచూరు అంతర్వేది ప్రాంతంలో ఉన్న నవీన శిలాయుగపు జనావాసాలతో సాంస్కృతిక సంపర్కం ఉన్నట్లూ, నదీప్రవాహం కొనసాగింపు కారణంగా, సహేతుకంగా భావించవచ్చు. రాయచూర్ ప్రాంతంలోని పిక్లిహాల్, మస్కి వంటి చరిత్రపూర్వ చారిత్రక స్థలాల ఆవిష్కరణ తొలి ప్రాక్చరిత్ర (తొలి చారిత్ర పూర్వ) స్థలాల ఆవిష్కరణ తొలి ప్రాక్ చరిత్ర కాలం నుంచి దక్షిణానికి వలసపోయే మార్గంగా భావించవచ్చు. ఈ ప్రాంతంలో అశోకుని శాసనాలు కూడా కనిపించడం ఆసక్తిదాయకమైన విషయం. ఉత్తరం నుండి ఈ ప్రాంతానికి పశ్చిమాంధ్ర ద్వారా సాంస్కృతిక సంపర్కం కొనసాగిందని ఆ శాసనాలు చెబుతున్నాయి. తొలి నవీనశిలాయుగం లేదా కాంస్య-రాతియుగం తర్వాత వచ్చిన దశే మలి కొత్తరాతియుగం లేక అయో (ఇనుప) యుగం. దక్కన్లో దాని ప్రారంభం క్రీ.పూ.ప్రథమ సహస్రాబ్ది తొలిభాగానికి చెందినదని భావించవచ్చు. ఆంధ్రపాంతంలోని ఎన్నో రాక్షషగుళ్లు అని పిలిచే ప్రాచీన సమాధులున్న స్థలాలలో ఇనుప పరికరాలు లభ్యమయ్యాయి. అంటే వ్యావసాయిక పద్ధతుల్లో ఆమేరకు పురోగతి చోటుచేసుకున్నదన్నమాట. ఇనుపగొడ్డలి, కొడవలి, నాగలికర్రు లాంటి వాటిని ఉపయోగించి చిన్నతరహా చెరువు నీటి సేద్యం చేసినట్లు తెలుస్తున్నది. అట్లా మిగతా దక్కనులోని ప్రాంతాలలోలాగానే ఆంధ్రదేశ పురాతత్వ చరిత్ర, ఆదిమ సంచార ఆహార సేకరణ దశలను వదిలివేస్తే, రెండు స్పష్టమైన దశలుగా భావించవచ్చు. అవి తొలి నవీనశిలాయుగం లేక కాంస్య-రాతియుగం (క్రీపూ1000), రెండోది మలి నవీన శిలాయుగం (క్రీ.పూ1000-క్రీశ6 శతాబ్దం). ఈ యుగంలో ఇనుము వాడకం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికీ మన తెలంగాణలో రాక్షసగుళ్లు (పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించిన సమాధులు) ఉన్న ప్రాంతాల్లో అలనాటి అంత్యక్రియలు కొద్ది మార్పులతో కనిపిస్తున్నాయి. ఆకాలంలో కొండ ప్రాంతాల నుంచి సేకరించిన పెద్ద పెద్ద రాళ్లను శవాన్ని పూడ్చిపెట్టిన సమాధి చుట్టూ పేర్చేవారు. ఇప్పుడు మహబూబ్నగర్ వంటి ప్రాంతాల్లో చూస్తే శవాన్ని పూడ్చిన తరువాత సమాధి చుట్టూ చిన్న చిన్న రాళ్లను ఉంచడమో లేక గోరీపై తల, పొట్ట, కాళ్ల దగ్గర ఒక్కో రాయిని పెట్టడమో చూడవచ్చు.
కొనసాగుతున్న నవీన శిలాయుగంపేర్లు
తెలుగు ప్రాంతాల్లో రెండవ దశకు చెందిన లక్షణాలు విశిష్టమైనవి. ముందుగా చెప్పుకోవలసింది ఈ దశలో రవాణా, సమాచార వినిమయ అవకాశాలకు తెరలేపడం. విజయవాడ ప్రముఖ పట్టణ కేంద్రమయింది. అక్కడ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమం నుంచి వచ్చే గొప్ప రాజమార్గాలు కలిశాయి. అట్లాగే స్థిర నివాస జీవితం ఏర్పడిన కారణంగా ఆ ప్రాంతంలో ప్రజలు మాట్లాడుకునే భాష ఒక సామాజిక సాన్నిహిత్య బంధంగా అవతరించింది. ఆ భాషను ఆంధ్రం అనవచ్చు. తెలుగు అనవచ్చు; ఆ పేరు ఆ ప్రజలకూ, వారు నివసించే ప్రాంతానికి కూడా వర్తిస్తుంది. తెలింగ, కళింగ, మున్నంగి, రేలంగి, వేంగి మొదలైన ప్రదేశాలు 'అంగి'తో అంతమయితే, అద్దంకి, పోరంకి, తడంకి మొదలైనవి 'అంకి'తో అంతమవుతాయి. 'వంక, 'లంక', 'ఏరు' (నది), 'చర్ల' (చెరువులతో నిండిన గ్రామం), 'ఊరు', 'పర్రు', 'అల', 'కుర్రు', 'పాడు' లాంటి పేర్లతో అంతమయ్యే గ్రామాలు ప్రాచీన కాలంలోనే మొదలయ్యాయి. అట్లా భాషపరంగా రూపంలో, స్వభావంలో గుర్తింపు ఇప్పటికీ కనిపిస్తుంది. కొన్ని పదాలు ప్రాముఖ్యం, వాటి అసలు అర్థంలో ఇప్పుడు తెలుసుకోవడం అంత సులువు కాదు. అట్లాగే రంగుల పేర్లు కూడా. 'నల్ల', 'తెల్ల', 'ఎర్ర', 'వెలి' లను కొండలకు ముందు ఉపయోగించి నల్లగొండ, వెలికొండ, ఎర్రగొండ అని వ్యవహరించడమూ ఉంది.
చాలా క్రియారూపాలు గ్రామాల్లో స్థిరపడటం ప్రారంభించిన నవీనశిలాయుగపు వాడుకలో పుట్టినవే. నిజానికి ఏ భాష మూల రూపమయినా తొలి ఆవాసం చేసుకున్నవారు వాడినదే. కనుక, తెలుగు వాడుక భాష అందుకు మినహాయింపుకాదు. మానవ నాగరికతకు కొత్తరాతియుగ ప్రజలు చేసిన గొప్ప సేవ లోహాలను కనుగొనడం. వీరు తొలిదశలో రాగిని కనుగొన్నారు. ఆ తరువాత ఇనుమును కనిపెట్టారు. ఈ లోహాలతో చేసిన వస్తువులు, అట్లాగే బంగారంతో చేసినవీ ఈ కాలానికి చెందిన స్థలాల్లో మొత్తం దక్కన్ లో కనిపిస్తాయి.
పెండ్లిలో మనం వాడే గరిగముంతలు లేక అయిరేణి కుండలు నవీన శిలాయుగపు ఆచారాలు ఇంకా కొనసాగుతున్న గుర్తుగా చెప్పవచ్చు. నవీనశిలాయుగంలో కొన్ని కుండలు రంగులు వేసి ఉంటాయి. దాదాపు వాటిని పోలిన అలంకరణలు కలిగిన కుండలనే అయిరేణిగా వివాహ సమయంలో తెలుగువారు వాడుతున్నారు.
అదనపు భూమి సాగులోకి...
కొత్తరాతియుగం మరో ముఖ్యలక్షణం... ఏ ప్రాంతంలో అయినా అదనపు భూమిని సాగులోకి తెచ్చుకోవడం. అయితే, అది చాలా మెల్లగా సాగింది. అందువల్ల అది బహుళమైన ఫలితాలను కూడా ఇచ్చింది. వ్యావసాయిక ఉత్పత్తుల పెంపుదల, పట్టణీకరణ, సామాజిక వ్యవస్థ ముక్కలు ముక్కలు కావడం, వృత్తి ఆధారంగా కులవ్యవస్థ ఏర్పడటం అందువల్ల జరిగింది. భూమిని అదనంగా సాగులోకి తెచ్చినవారు సమాజంలో ఉన్నత స్థానం పొందారు. వారు వ్యవసాయదారులు కూడా కావడం వల్ల భూమి యజమానులు కూడా అయ్యారు. ఈ ముఖ్య భూయజమానులకు చేతివృత్తులవారయిన కమ్మరి, వడ్రంగి, చాకలి, సాలె, పశుపోషకుడు, పశువుల కాపరులు వంటివారు సహాయకారులయ్యారు. అదే యుగంలోజీవనపు అనాది పద్ధతులకు అలవాటుపడిన ఆదివాసులు నవీనశిలాయుగపు జనావాసాలకు సమీపాన ప్రత్యేక స్థలాలలో నివసించాల్సి వచ్చింది. చాతుర్వర్ణ వ్యవస్థ, పురాణ సంస్కృతి స్పష్టంగానే తర్వాతి కాలంలో దక్కనుకు దిగుమతి అయ్యాయి.
గ్రామదేవతల సృజనకు కొత్తరాతియుగ సమాజమే కారణం. వ్యవసాయ రుతువు ప్రారంభం సందర్భంగాను, సామాజిక పండుగల సందర్భంగాను వారు తరచు పూజలు జరిపేవారు. వాటిని ఇప్పటికీ గ్రామీణులు కొనసాగించడం చూడవచ్చు. శాంతిభద్రతల సంరక్షణకై ప్రతి గ్రామంలోను ఒక గ్రామపెద్ద ఉండేవాడు. ఆయా రుతువుల్లోను, ప్రతివారమూ సంతలు జరుగుతూ ఉండేవి. వాటికి వర్తకులు హాజరవుతూ ఆ ప్రయత్నంలో దేశమంతా వర్తక వాణిజ్యాలు ఏర్పడటానికి కారణమయ్యారు. ఈ వర్తక వాణిజ్య మార్గాలే పట్టణ కేంద్రాల పెంపునకు ముఖ్యకారణమయ్యాయి. అట్లా వ్యవసాయపద్ధతులు, వ్యవస్థీకృతమైన సమాజం, గ్రామం, వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా ఆర్థికవ్యవస్థ, చేతివృత్తులు, వర్తక కేంద్రాలు, పూజలు, పండుగలు ఏర్పడినటువంటి కాలం నవీన శిలాయుగం. వీటి కారణంగా కొన్ని సాంస్కృతిక సంప్రదాయాలు ప్రారంభమయ్యాయి.పదజాలంతోపాటు ఈ అన్ని సందర్భాలలోను తెలుగు ప్రజలు కానీ, భూమి కానీ, వీరి పశ్చిమ పొరుగు కర్నాటక ప్రాంతంతో పెద్దగా విభేదించింది ఏమీ లేదు.
- భూపేంద్రనాగ
Authorization