జానపద కళారూపాలు ఆయా ప్రజా సమూహాల చరిత్ర, సంస్కృతులకు ప్రతిబింబంగా ఉంటాయి. వాటిలో కొన్ని అతిశయోక్తులు, కల్పనలు ఉన్నా మొత్తంగా చూసినప్పుడు సమకాలీన నిజాలు కొన్నయినా ఉంటాయి. పరిశోధకులు ఆ నిజాలను పట్టుకొని జనానికి తెలియజేయడానికి ప్రయత్నిస్తారు. ఇట్లా ఇటీవల కాలంలో పరిశోధకులు, సాధారణ జనం దృష్టినీ ఆకర్షిస్తున్న జానపద కళారూపాల్లో ముఖ్యమైనవి పటం కథలు. ఆశ్రిత కళాకారులు చెప్పే కుల పురాణాలు ఇందుకు మంచి ఉదాహరణ. అయితే పటం కథలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమై లేదు. రాజస్థాన్ వంటి పశ్చిమ రాష్ట్రాల్లోనూ అనేక పటం కథలు ప్రదర్శితమవుతూ ఉంటాయి. అటువంటి కథల్లో చెప్పుకోదగింది పాబూజీ పటం కథ.
పాబూజీ అనేది చాలా పెద్ద కళారూపం. రాజస్థాన్లో అత్యంత ప్రజాదరణ పొందిన జానపద కళారూపం. దీన్ని సాధారణంగా రాత్రి పూట మాత్రమే ప్రదర్శిస్తారు. పాబూజీ మధ్యయుగంలో రాజస్థాన్లోని ఒక మేవార్ రాజవంశజునిగా భావిస్తున్నారు. ఆయన్నే తరువాతి కాలంలో దేవునిగా కొన్ని సంచార జాతులవారు ( ముఖ్యంగా 'రెబారీలు' అనే పశువులకాపరులు) పూజిస్తున్నారు. అట్లాగే ఆయన చరిత్ర కథలు కథలుగా ప్రచారం అవుతూ వచ్చింది. పాబూజీ పూజ జరిగేటప్పుడు తప్పనిసరిగా రెబారీలు పాబూజీ పురాణాన్ని చెప్పిస్తారు. ఈ పురాణం చాలా పెద్దగా ఉంటుంది. అందువల్లనే నాలుగైదు రాత్రుల పాటు చెబుతారు. రాత్రి చందకాడ ప్రారంభమయ్యే ఈ కళారూపం తెలతెలవారుతుండగా ముగుస్తుంది.
పాబూజీ పురాణం రెండు పద్ధతుల్లో చెబుతారు. ఇద్దరు పురుషులు డ్రమ్స్ వాయిస్తూ పాడటం ఒక పద్ధతయితే, రెండో పద్ధతిలో పెద్ద పటం ఎదుట ఇద్దరు స్త్రీపురుషులు (సాధారణంగా భార్యాభర్తలు) నిలబడి పాబూజీ కథను గానం చేస్తూ మధ్య మధ్యలో ఆయా ఘట్టా లకు సంబంధించిన బొమ్మలను పటంలో చూపించడం ఉంటుంది. కథ చెప్పే స్త్రీని భోపీ అనీ, పురుషుణ్ణి భోపో అనీ అంటారు. చెప్పే కథకు సంబంధించి బొమ్మలుండే పటాన్ని 'పర్' లేక 'ఫడ్' అంటారు.
వేషధారణ : భోపో పైనుంచి కింది వరకు ఎర్రని బట్టలు ధరిస్తాడు. అట్లాగే ఫిడేల్ లాంటి సంగీత సాధనాన్ని వాయించుతూ పాటలు పాడతారు. ఈ సంగీత సాధనాన్ని 'రావణ్హత్తో' అని వ్యవహరిస్తారు. ఈ కళాకారుడు కాళ్లకు గజ్జెలు ధరిస్తాడు. తలపాగా ధరించి, నడుముకు ఒక తువ్వాలు లాంటి దాన్ని కట్టుకుంటాడు. ఇక భోపీ మామూలుగానే రాజస్థానీ శైలిలో బట్టలు ధరిస్తుంది. పలుచని ముసుగు ముఖపై ధరిస్తుంది.
పాబూజీ కళారూపం ఎప్పటి నుంచి మనుగడలో ఉందో చెప్పే ఆధారాలు కనిపించడంలేదు కానీ 'టాడ్' అనే బ్రిటిష్ రచయిత పేర్కొన్నదాన్నిబట్టి 19వ శతాబ్దంలో ఈ కళాకారులు ఉన్నట్లు తెలుస్తున్నది. టాడ్ ప్రకారం పాబూజీ కథను చెప్పే కళాకారులు ఏడాదికొకసారి ఎడారిలోని గ్రామాల్లో తిరుగుతూ ఉబుసుపోక కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే గ్రామీణులకు పటాలను ప్రదర్శిస్తూ పాబూజీ వీరుని కథను చెప్పేవారు. అయితే ఇంతకంటే ముందు 17వ శతాబ్దంనాటి మూహతో నైణసి అనే వ్యక్తి 16వ శతాబ్దంలో పాబూజీ కథను చెప్పే భోపోల గురించి పేర్కొన్నాడు.
పాబూజీ కథను చెప్పే కళాకారులు వంశపారంపర్యంగా చెప్పే దళితులు. దళితులకు చదువు సంధ్యలు ఉండేవి కాదు కాబట్టి ఈ పురాణ కథను చదువుకున్నవారు మధ్యయుగాల్లోనే గ్రంథస్థం చేసి ఉంటారని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అటువంటి గ్రంథాలు మాత్రం లభ్యం కాలేదు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరుగుతూ కథలుచెప్పే క్రమంలో పిల్లలు తమ తల్లిదండ్రులు చెప్పే కథను కొన్ని వందలు సారు చూసి, వినడం ద్వారా నేర్చుకొని తామూ ఆ కథను చెప్పడం మొదలుపెడతారు. ఈ కళాకారుల్లో చదువుకున్నవారు అతి తక్కువ. సంచారజీవితం గడిపే వీరికి ఒక చోట స్థిరంగా ఉండి పిల్లల్ని పాఠశాలల్లో చదివించే అవకాశం ఉండదు. భోపో కళాకారుడు ఈ కథ చెప్పగల అమ్మాయిలనే పెండ్లాడుతాడు.
తాము ఒక గ్రామంలో ప్రదర్శన ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి తమ ప్రదర్శనకు ఆర్థిక సహాయం చేసేవారికోసం వెతుక్కుంటారు. ఆ తరువాతే సాధారణంగా కథ చెబుతారు.భోపో కళాకారులు పాబూజీ కథను 12 భాగాలుగా చెబుతారు.
- శివ
Authorization