తెలుగు నేలపై ఉన్న జానపద కళారూపాల్లో పటం కథలది ప్రత్యేక స్థానం. సాధారణంగా పటం కథలు అనేవి కులపురాణాలుగా ఉంటాయి. కులపురాణాలు చెప్పడానికి ఉపయోగించే పటాలను నకాశి కళాకారులచేత చిత్రింపజేస్తారు. ఆయా పురాణాలకు సంబంధించిన సంఘటనలను నిర్ణీత కొలతలు గల ప్రత్యేకించిన వస్త్రాలపై నకాశి కళాకారులు బొమ్మల రూపంలో చిత్రిస్తారు. కులపురాణాలు సుమారు పదమూడు ఉన్నాయని గుర్తించారు. ఇందులో ఏనూటివారు చెప్పే పురాణం ఒకటి. ఏనూటివారు గౌడకులాన్ని ఆశ్రయించి బతికేవారు. వీరు గౌడ పురాణాన్ని చెబుతారు. తెలంగాణలో ఒకప్పుడు పది ఏనూటివారి బృందాలు ఈ పటం సాయంతో గౌడపురాణం చెబుతూ జీవనం సాగించేవి. కానీ ప్రస్తుతం ఒకే బృందం మనుగడ సాగిస్తున్నది. ఆ బృందం కూడా ఎంతోకాలం ఉండేలా లేదు. ఇదే జరిగితే త్వరలోనే ఏనూటి కళారూపం అంతరించిపోతుంది.
ఏనూటివారు గౌడ కులంలోని అన్నదమ్ముల్లో ఒకరిగా చెప్పుకుంటారు. వీరు చెప్పే పురాణం ప్రకారం అన్నదమ్ములు ధనం పెట్టెల కోసం కులం నుండి విడిపోయినప్పుడు ఇటు కులానికి, అటు ధనానికి కాకుండా ఎటూకాని ఏనూటి (యానాటి)వారిగా మారిపోయామం టారు. గౌడ పురాణంలో వీరు ఎట్లా గౌడులకు ఆశ్రితులయ్యారో కూడా పేర్కొనడమయింది.
గౌడ పురాణం
గౌడపురాణాన్ని మిగతా కులపురాణాల్లాగానే సృష్టి పుట్టక నుంచి ప్రారంభిస్తారు.ఒకరోజు త్రిమూర్తులు ఇంద్రసభకు వెళ్లి వస్తుండగా బ్రహ్మ నుదుట చెమట వస్తుంది. ఆ చెమటను ఎక్కడా వేయలేక చివరికి పార్వతీదేవి పాలగుండంలో వేయగా, ఆ చెమట బిందువు నుండి కౌండిన్య మహాముని జన్మిస్తాడు. ఆ మహా రుషి పెరిగి పెద్దవాడై సంతానం కోసం శివపార్వతులను వేడుకోగా, ఆదిగౌడ్, అమరగౌడ్, వేదగౌడ్, విప్రగౌడ్, పుంగమ గౌడ్ అనే అయిదుగురు వరపుత్రులు జన్మిస్తారు. వీరికి తోడుగా చెల్లెలు నీలాంబరి జన్మిస్తుంది. ఈమెకే సురాభాండేశ్వరి అనే పేరుకూడా ఉంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్ర మధనం సాగిస్తుం డగా, మందర పర్వతం పగిలి కల్పవృక్షం, కామధేనువు జన్మిస్తారు. ఆ కల్పవృక్షాన్ని వేడుకొమ్మని పరమశివుడు గౌడవారికి చెబుతాడు. దీంతో వారు కల్ప వృక్షం నుంచి అమృతాన్ని తీసి దేవతలకు సమర్పిం చుకుంటారు. కొన్ని రోజుల తర్వాత రాక్షసులు నారదుని ద్వారా ఈ సంగతి తెలుసుకుంటారు. గజాసురుడు ఇతర రాక్షసులతో కలిసి, 33 కోట్ల దేవతల మారువేషంలో వచ్చి అమృతం పోయమని గౌడులను అడుగుతారు. రాక్షసులు మారువేషంలో వచ్చారని గమనించిన గౌడులు దేవతలు చెప్పిన ప్రకారం వారికి అమృతం లేదని చెప్పి పంపిస్తారు.
గజాసురుడు అందుకు కోపించి 66 కోట్ల రాక్షసులను నాలుగు గజ ఏను గులుగా చేసి, గౌరీవనాన్ని (ఈత, తాటి వనాన్ని) నాశనం చేయని శాసిస్తాడు. అవి వనానికి కాపలాగా ఉన్న ముదిరాజ్ బంటులకు కూడా దొరకక వనాన్ని నాశనం చేస్తాయి. ఈ సంగతి తెలుసుకున్న గౌడులు పరిష్కారం చూపమని పరమశివుని వేడుకుంటారు. అప్పుడు శివుడు తన కంఠం నుంచి కంఠమహేశ్వరుణ్ణి సృష్టించి, అతడికి 33 కోట్ల దేవతల బలాన్ని చేకూర్చుతాడు. ఈ బలంతో కంఠమహేశ్వరుడు వెళ్ళి గజాసురుని, అతడి నాలుగు గజ ఏనుగు లను సంహరిస్తాడు. గజాసురుని శరీర భాగాలతో దేవతలు గౌడ వృత్తికి సంబంధించిన వస్తువులను తయారుచేసి గౌడులకు ఇస్తారు.
ఆ తర్వాత పరమ శివుడు కంఠమహేశ్వరునికి, సురమాంబకు, అట్లాగే గౌడవారికి పెండ్లి జరిపిస్తాడు. ఈ అయిదుగురిలోని ఆదిగౌడ్, అమరాగౌడ్, వేదగౌడ్, విప్రగౌడ్ ప్రతిరోజు గౌరీవనానికి వెళ్ళి కల్లుతీసి పుంగమా గౌడ్కు ఇవ్వగా, ఇతడు భావ కంఠమహేశ్వరుడు, చెల్లి సురమాంబతో కలిసి అమ్ముతాడు. అంతేగాక, ఈ ముగ్గురు ప్రతిరోజు ఏడు కోట్ల జంగమలకు అన్న సంతర్పణతోపాటు మహాలింగపూజ చేసి దానధర్మాలు చేస్తారు. ఈ విధంగా పుణ్యవంతులుగా పేరుగాంచుతారు. ఇది గిట్టని మిగతా నలుగురు పుంగమాగౌడ్తో ''కష్టం మాది పేరు నీకా, మా ధనం పెట్టె మాకు పంచితే మేం కులం నుండి వెళ్లిపోతా'' అంటారు. అప్పుడు పుంగమాగౌడ్ ''నాకు ధనం కంటే కులమే ఎక్కువ. మీకు కులం కంటే ధనమే ఎక్కువ అంటున్నారు కాబట్టి ధనంపెట్టెలు తీసుకొని వెళ్ళిపొమ్మం''టాడు. ఆ ప్రకారంగా నలుగురిలో ముగ్గురు ధనం పెట్టెలు తీసుకొని వెళ్తారు. అయితే ఈ విభజనకు కారణమైన విప్రాగౌడ్ ధనం పెట్టెను శివుడు మాయం చేస్తాడు. అందుకు విప్రాగౌడ్ పరమశివునితో ''నేను అటు కులానికీ కాక, ఇటు ధనానికీ కాకుండా అయ్యాను. టూకాకుండా ఏనూటివాడినయ్యాను. నాకు భృతి చూపెట్టు'' అని వేడుకుంటాడు. అందుకు శివుడు అనుగ్రహించి గౌడ కులపురాణాన్ని కీర్తిస్తూ, గౌడులను ఆశ్రయించాలని, వారిచ్చే ప్రతిఫలం మీదనే జీవించాలని, పటం మీద పురాణాన్ని చిత్రించి ఏనూటివారికిచ్చి దీవిస్తాడు.
ఈ పురాణంలో వృత్తికి చెందిన అనేక సాంస్కృతిక అంశాలతోపాటు, వీరి కులానికి చెందిన మూలపురుషులు అనేక నియమ నిష్టలు అనుసరించారని, దేవతలే తమ వృత్తిని సృష్టించి తమకు వరంగా ఇచ్చారని చెప్తారు. ఇది తమ కులస్తులకు తమ వృత్తి పట్ల ఉన్న ఆత్మన్యూనతా భావం తొలగించి ఒకవిధమైన ఆత్మగౌరవాన్ని రేకిత్తించడానికి చేసిన ప్రయత్నంగా చెప్పవచ్చు. వృత్తిలో భాగంగా తాటి ముంజలను కొట్టకూడదని, తాటిగెలకు 'మెరే'స్తున్నప్పుడు మాట్లాడకూడదనేవి నియమాలు వీటన్నింటినీ కళాకారులు దృష్టిలో పెట్టుకొని గౌడవృత్తిపట్ల, కులానికి చెందిన మూలపురుషుల పట్ల భక్తి భావం, గౌరవాన్ని కలిగేలా తెలియజేస్తారు.
- డా||బాసని సురేష్, జానపద గిరిజన విజ్ఞానపీఠం, వరంగల్ 9989417299
Authorization