పోలాల పండుగ అనగానే అందంగా అలంకరించిన ఎద్దులు గుర్తుకువస్తాయి. వ్యవసాయా ధార కుటుంబాలకు ఎద్దులు, గిత్తలు ప్రాణాధారం. అందుకేనేమో ఈ పండుగ రోజు ఎడ్లే కేంద్రంగా ఉంటాయి. అందంగా ముస్తాబు చేసిన ఎడ్లను మంద పోశవ్వ దగ్గరకు తీసుకువచ్చి పూజలు చేసి, చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు. రైతులు పండుగ నాడు బోనాలు వేస్తారు. ఎడ్లకు వండిన ఆహారపదార్ధాలు పెడతారు. తరువాత ఊరి హనుమాండ్ల గుడి దగ్గర తోవకు కట్టిన తోరణం ఒక్క ఉదుటన ముల్లుకట్టెలాంటి పెద్దకట్టెతో తెంపేసి 'పార్వతి పతి హర హర మహాదేవ' అంటూ నినాదాలిస్తూ ఎడ్లను ప్రదక్షిణ జరిపిస్తారు. డప్పు బాజాలతో, జంగమయ్య మంత్రాలతో, ఎడ్ల గిట్టల చప్పుడు, గుంగుర్లు గజ్జల సప్పుళ్లతో ఊరు, చేను, సెలక, పుట్ట మారు మ్రోగుతుంది.
ప్రదక్షిణ అనంతరం ఇంటికి వచ్చిన ఎద్దులకు ఆడబిడ్డ హారతి పడుతుంది. మంగళ హారతి పాట పాడతారు. పూజలు చేసి, కొత్త చాటలో తెచ్చిన నైవేద్యం.. అంటే ఆ రోజు ఏమి పిండివంటలు చేసుకుంటారో అవి పెడతారు. బూరెలు, గారెలు, పరమాన్నం పెడతారు. మూతులు కడిగిన తర్వాత 'ఇడం' (తమలపాకు) తినిపించి దండం పెడతారు. ఇంటిల్లిపాది ఆనందంగా భోజనం చేస్తారు. పిండివంటలు ఆరగిస్తారు. పాలేర్లకు కొత్త బట్టలు లేదా ఇనాం ఇచ్చి భోజనం పెడతారు. ఇతర వృత్తుల వారిని పిలిచి భోజనం పెడతారు.
పోలాల పండుగ రెండు రోజుల పండుగ. రెండో రోజును 'బొడిగె' పండుగ అనే పేరుతో జరుపుకుంటారు. ఈ రోజు పూర్తిగా తినడం, తాగడం తో గడిచి పోతుంది. మాంసా హారులు శ్రావణ మాసంలో ఇంట్లో మాంసాన్ని వండుకోరు. ఆ మాసం పూర్తయి బొడిగె పండుగ ఎప్పుడొస్తుందా అని పిల్లలు ఎదురు చూస్తుంటారు. ఈ రోజునే మళ్లీ మాంసాన్ని తినడం ప్రారంభించడానికి వీలుండటమే ఇందుకు కారణం. అంతే కాదు మక్క కంకులను కూడా ఈ పండుగ వచ్చేదాకా తెంపి తిననివ్వరు. ఈ ఆంక్షలు ఎత్తివెయ్యాలంటే పోలాల పండుగ రావాల్సిందే.
అనగనగా ...
బొడిగె పండుగకు పూర్వగాధ ఏమిటంటే.. భడగడు అనే రాక్షసుడు పరమకిరాతకంగా ప్రజలను హింసించేవాడు. ఆరోజు తాగినమైకంలో భడగడు ప్రజలతో కొట్లాటకు దిగగా ఊరి ప్రజలంతా ఏకమై భడగడిని చంపేస్తారు. చనిపోయిన భడగడి చుట్టూ ఈగలు, దోమలు ముసురుకుంటాయి. ప్రజలంతా మోదుగ కొమ్మలు పట్టుకొని ''ఈగలు, దోమలు గంజోర భడిగ'' అంటూ ఆనందంతో చిందులు వేస్తారు. పండుగకు ముందు నెల శ్రావణ మాసం పవిత్ర నెలగా భావిస్తారు. ఈ నెలలో మాంసాహారం తినడం, మద్యం సేవించడం ఉండదు. పండగతో శ్రావణం ముగుస్తుంది. కావున తెల్లారి ఆనందంగా పండుగ జరుపుతారు. మద్యం తాగే వాళ్ళు మద్యం తాగి, మాంసాహారం తింటారు. 'బొడిగ ఊపుడు' అనుకుంటూ కోళ్ళ కోసం వెతుకుతున్న మనుషులు, ఇట్లాచెద్దాం.. అట్లాచెద్దాం.. అనుకుంటూ... జోకులు చేసుకుంటారు. అయితే పోలాల పండుగ నాడు ఇంటికి మామిడి తోరణంతో పాటు, మోదుగ కొమ్మలు ఇంటి దరువాజకు అటు ఇటు పెడతారు. పోలాల తెల్లారి ఈ మోదుగ పొరకతో ప్రొద్దున అయిదు గంటలకు ఇంట్లోని పెద్దలు ''ముసల్ది పిడక అయిసిది తడక, ఈగలు దోమలు గంజోర బొడగ'' అంటూ పొరకలను చేతులలో ఆడిస్తూ గోడలకు కొడతారు. కొట్టంలో కూడ కొడతారు. ఊరంతా మబ్బున బొబ్బలతో మారుమ్రోగుతుంది. నిదురమత్తులో ఉండేవాళ్ళు తిట్టుకుంటూలేస్తారు. వర్షాకాలం కావున ఈగలు, దోమలు విస్తరించే అవకాశం ఉన్నందున వాటిని తరిమే కార్యక్రమం ఇది. ఈ పొరకను దీపావళి రోజువరకు దాచి పెడతారు. కొట్టంలో గాని, ఇంటి మీద గాని వేస్తారు. దీపావళి రోజున ''పోలాల నాటి పొరక, దసరా నాటి పిడక'' భోగిమంట నీళ్ళు వేడి చేసి స్నానం చేస్తారు. ఒక పండగకు ఇంకొక పండగకు అవినాభావ సంబంధం ఉన్నది. ఇది ఎంతో విశిష్ట మైనది. ఆధునికత వల్ల సమాజంలో వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయి. వ్యవసాయ సమాజాలు పూర్తిగా చిన్నా భిన్న మయ్యాయి. గత ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న పండగ ఉత్సాహం నేడు సన్నగిల్లింది. పాలకుల నిర్లక్ష్య వైకరి వల్ల బరువైన వ్యవసాయరంగం నుంచి రైతులు తప్పుకుంటున్నారు. పెట్టుబడి అధికం కావడం వల్ల ఉన్న భూమిని కౌలు కిచ్చి బట్టల షాపులలో, కిరాణ దుకాణాల్లో జీతం ఉంటున్నారు. కాపు అరకను ఇడిసి పెట్టిండు. కన్న కొడుకుల్లా చూసుకున్న ఎలపట దాపట ఎడ్లను ఎడ్లాపురం అంగడిల అమ్ముకున్న రైతు గోస చెప్పలేనిది.
- వేణుగోపాల్
Authorization