పుట్టుక, వివాహం, మరణం అనేవి మానవుని జీవితంలో చాలా ప్రధానమైన సంగతులు. ఏ సంస్కృతికి చెందినవారైనా ఈ మూడు సంఘటనలను పురస్కరించుకుని అనేక ఆచార సంప్రదాయాలను పాటిస్తారు. కొన్ని సంప్రదాయాలు కొందరికి ప్రత్యేకించినవిగా కనిపిస్తాయి. వివిధ జాతుల ఆచారాల్లో కొన్ని సారూప్యాలూ కనిపిస్తాయి. ఉగాండాలో మనిషి చనిపోయినప్పుడు అనుసరించే ఆచారాలను గమనిస్తే చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. ఉగాండాలోని బగండా ప్రజల అంత్యక్రియలకు సంబంధించిన ఆచారం చూడండి.ఈ తెగకు చెందినవారు బతికి ఉండగానే గోరీని ఏర్పాటు చేసుకుంటారు. అంతకన్నా మరో ఆసక్తికరమైన ఆచారం వీరిలోనే కనిపిస్తుంది. అదేంటంటే... బగండా తెగ రాజు మరణిస్తే అతడ్ని పూడ్చిపెట్టకుండా దవడ ఎముకలు బయటపడేవరకు దాదాపు ఆరు నెలలు అట్లాగే ఉంచుతారు. ఈలోపు తరువాత రాజుగా అధికారాన్ని చేపట్టే వ్యక్తి (కబక) సింహాసనాన్ని అధిరోహిస్తాడు. ఇక చనిపోయిన రాజు దవడ ఎముకను తీసుకువచ్చి ఒక దేవాలయంలో ఉంచుతారు. మరణించిన రాజు ఆత్మ ఆ దవడ ఎముకలో ఉంటుందనేది బగండా ప్రజల నమ్మకం.
బనియోర్ ప్రజల్లో కూడా ఇటువంటి విచిత్రమైన ఆచారమే ఒకటుంది. వీరిలో మరణం సహజమైన విషయం కాదు. అందుకే భూత వైద్యుడు అంత్య్రక్రియల సమయంలో కీలక పాత్ర పోషిస్తాడు. అతడు ఆత్మలతో సంబంధం ఏర్పాటు చేసుకుని చనిపోయినవారు మరణించడానికి కారణమేమిటో కనుక్కుంటాడు!? ఇట్లా చేస్తే మిగతా వారికి భూతప్రేత పిశాచాల నుండి ఎటువంటి హాని కలుగదని నమ్ముతారు. మొత్తానికి ఏ భూతాలతో మాట్లాడతాడో కాని అతడు చెప్పిన మరణ కారణాన్ని మాత్రం జనం నమ్ముతారు.
ఉగాండాలోనే కరమంజోంగ్ అనే తెగవారు చనిపోయినవారిని పూడ్చి పెట్టడమో, కాల్చడమో చేయరు. శవాన్ని తీసుకుపోయి అడవిలో పడేసి వస్తారు. జపంధోలా అనే మరో తెగలో ఎవరైనా చనిపోయిన తరువాత కనీసం మూడు రోజుల వరకు స్నానం చేయకూడదు. హిందు సంప్రదాయంలో అంతిమ సంస్కారాలు అయిన తరువాత స్నానం చేయడం ప్రధానమైన కార్యంగా ఉంటుంది.
-మౌక్తిక్
Authorization