తెలుగు నాటకం పరిపోషణకు, పరివ్యాప్తికి దాదాపు 70 ఏండ్ల క్రితం 'ఆంధ్ర నాటక కళాపరిషత్' ఆవిర్భవించింది. పోటీ నాటకాలను నిర్వహించి ప్రజలే న్యాయ నిర్ణేతలుగా విజేతలను నిర్ణయించే సంప్రదాయం నాడు ఉండేది. కాల క్రమేణా ఆంధ్రనాటక కళాపరిషత్ కియాశీలంగా వెనుకబడిపోతున్న తరుణంలో 'అక్కినేని నాటక కళాపరిషత్' ఏర్పడింది. ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు ముందు నాటకాల ద్వారానే నటనలో అనుభవం గడించారు. తాను నటనకు దూరమైనా, 'రంగస్థలం' ద్వారా జీవించే ఉండాలని అక్కినేని కోరుకున్నారు. ఆయన కోరికను సాకారం చేస్తూ ఆయన పేరుమీదుగా ఒక నాటక కళాపరిషత్ని ఏర్పాటుచేశారు 1994లో. కళాప్రియుడు, పారిశ్రామికవేత్త సారిపల్లి కొండలరావు నిర్వహణలో 'యువకళావాహిని' సారధ్యంలో అక్కినేని స్వహస్తాలమీదుగా పరిషత్ ప్రారంభమయింది. గత 24 ఏండ్లుగా పరిషత్ నిరాఘాటంగా నాటక పోటీలు నిర్వహిస్తూ కళారంగానికి ఎంతో సేవచేస్తున్నది. ఈ ఏడాది సెప్టెంబరు 10, 11, 12 తేదీల్లో విజయవాడలోని ఘంటసాల సంగీత, నృత్య కళాశాలలో నాటిక పోటీలు నిర్వహించారు ఈ పరిషత్వారు.
మూడు రోజుల్లో ఏడు నాటికల ప్రదర్శన జరిగింది. వీటిలో మూడు నాటికలు రైతు సమస్యలు, గ్రామీణ నేపథ్యంలో ఉన్న కథలను ప్రతిబింబించగా, మిగిలినవి వృద్ధతల్లిదండ్రుల ఆలన పాలన, ఇతర మానవ సంబంధాలను ప్రస్ఫుటింపచేశాయి.
'మధుపర్కాలు' అనే నాటిక ప్రథమ బహుమతి గెలుచుకుంది. దీని కథేంటంటే... నూతన వధూవరులకు చేనేతకుటుంబీకులు 'మధుపర్కాలు' (తొలిరోజు కట్టుకొనే చీర, ధోవతి) ఇవ్వటం ఆచారం. ఆచారానికి కట్టుబడి నేతకార్మికుడు తన పాడి ఆవును కూడా అమ్మి నూతన వధూవరులకు నూతన వస్త్రాలు అందిస్తాడు. ఈ సంగతి తెలిసిన వరుడు తనకున్న రెండు ఎకరాలను చేనేత కార్మికునికి ఇచ్చి ఆ పొలంపై వచ్చే ఆదాయంతో మధుపర్కాలను ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగించమంటాడు. నేతకార్మికుని జీవితాన్ని ప్రతిబింబించే పాటను నేపథ్యంలో వినిపించడం ఎంతో సముచితంగా ఉంది. ఈ నాటిక రచయిత వల్లూరి శివప్రసాద్కు ఉత్తమ రచయితగా, దర్శకత్వం వహించిన గంగోత్రి సాయికి ఉత్తమ దర్శకునిగా బహుమతులు లభించాయి. అట్లాగే ఇదే నాటికకు ఉత్తమ సాంకేతిక నిర్వహణకూ ప్రైజ్ వచ్చింది. తాడేపల్లికి చెందిన 'అరవింద ఆర్ట్స్'వారు ప్రదర్శించారు.
ఎండా వానా తేడా లేకుండా ఆరుగాలాలు పనిచేసే రైతు పొలాన్ని పచ్చగా మార్చి మనకి చల్లదనాన్ని ఇస్తాడు. పచ్చని చందురుడైన రైతు, తన కుమారుడే భూమిని అమ్మడానికి ప్రయత్నిస్తే... ఎటువంటి వ్యధపడతాడో చూపించింది 'పచ్చ చందురుడు'. దీనికి ద్వితీయ బహుమతి వచ్చింది. భూమిని నమ్ముకోవాలే కాని అమ్ముకోకూడదని చెప్పిన ఈ నాటిక రచయిత డా||బి.శ్రీనివాస రావు. దర్శకుడు నాయుడు గోపి.పెదకాకానికి చెందిన 'గంగోత్రి'వారు ప్రదర్శించారు.
ఇక ప్రత్యేక ప్రశంసా పురస్కారాన్ని 'గుర్తుతెలియని శవం' దక్కించుకుంది. ఆచారాలు, సంప్రదాయాలను ఇతరులకు చెబుతూ తాను మాత్రం తల్లి శవాన్ని అనాథగా వదిలేసిన ఓ కొడుకు కథ ఇది. పేదరికం, ఇతర కారణాలు కారణంగా తల్లి అంతిమ సంస్కారాలు నిర్వహించకుండా స్నేహితుడి సహాయం తో అనాథగా వదిలేస్తాడు ఆ కొడుకు. ఇతరులకు మాత్రం చాలా నీతులు చెబుతాడు. తన పాత్రలో జీవించిన కృష్ణేశ్వరరావుకు ఉత్తమ నటుని పురస్కారం లభించింది. అట్లాగే మరో నటుడు గిరిబాబుకి విలక్షణ నటుడికి ఇచ్చే బహుమతి దక్కింది.
ప్రదర్శితమైన అన్ని నాటికలూ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ నాటిక పోటీలను నిర్వహించిన పరిషత్వారు అభినందనీయులు.
- ఆర్.వి.రమణ
Authorization