మొహర్రం వేడుకల ఉత్సవం కాదు, విషాద జ్ఞాపకాల దొంతర అనవచ్చేమో. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభానికి గుర్తు. ఈ పండుగనే పీర్ల పండగ అనీ అంటారు మనదేశంలో. పీర్లు నిలబెట్టడం, నిప్పుల గుండాలు, మాతం ఏడ్పులు పీర్ల పండుగలో భాగంగా ఉంటాయి. షియాల సాంప్రదాయక సంతాప పద్ధతులతో వ్యక్తుల త్యాగానికి ప్రతీకగా ఈ మొహర్రం వేడుకలు నిర్వహిస్తారు. క్రీ.శ 622లో మహమ్మదు ప్రవక్త, ఆయన అనుచరులు మక్కా నుంచి మదీనా వరకు వలస వెళ్లారు. దీనిని హిజ్రత్ అంటారు. హిజ్రీ అనగా శకానికి మూలం. సెప్టెంబర్ 622లో మహమ్మదు ప్రవక్త తన అనుచరులతో కలిసి హిజ్రత్ యస్రిబ్ నగరాన్ని చేరుకున్నారు. నేడు యాస్రిబ్ నగరానికి మదీనతున్-నబీ లేదా నబీ (ప్రవక్త) నగరంగా పేరు స్థిరపడింది. ఉమర్ కాలంలో ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ప్రాచీన కాలంలో అరబ్బులు ఈ కేలండర్ను వాడేవారు. ఇస్లాంను కాపాడుకోవడం కోసం జరిగిన యుద్ధంలో ప్రవక్త మహమ్మద్ మనవడు ఇమాం హుస్సేన్ పాల్గొన్నాడు. మొహర్రం నెలలో జరిగిన ఈ యుద్ధ్దంలో ఇమాం మరణించాడు. ఆయనకు నివాళిగా, గుర్తుగా పది రోజుల పాటు సంతాప దినాలు నిర్వహిస్తారు.
ప్రతిమా మూర్తులుగా పీర్లు ఊరేగింపు, న్యాయపోరాటానికి శరీర కష్టాన్ని లెక్కజేయమన్న విషయాన్ని తెలిపేందుకు నిప్పుల గుండాలు తొక్కటం, రక్తాన్ని చిందించటం 'షహీద్' (అమరవీరుల) నెల సందర్భంగా షియాలు గుండెలు బాదుకుంటూ మాతం(శోక ప్రకటన) తెలపడం, నల్లటి వస్త్రాలను ధరించడం లాంటివి చేస్తారు. కాలక్రమంలో ఈ పండుగ భారతీయ సంస్కృతిలో భాగమైంది. తెలంగాణలో పీర్ల పండుగగా ప్రాచుర్యం పొందింది.
క్రీ.శ 632లో మహమ్మద్ ప్రవక్త మరణించారు. ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని (ఖలీఫాలను) ఎన్నుకోవాలి. హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్, హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీ ఈ విధంగా ఎన్నికైన ఖలీఫాలే. ఇమాం హసన్, ఇమాం హుస్సేన్ ఇరువురు దైవ వ్రక్త మహమ్మద్ (స) మనుమండ్లు, హజ్రత్ అలీ తనయులు. హజ్రత్ అలీ తరువాత ప్రజలు ఇమాం హసన్ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్గా మావియా ఉన్నారు. అతను అధికార దాహంతో కత్తితో రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నాడు. యుద్ధం ప్రకటించాడు. యుద్ధంలో పాల్గొంటే ప్రజలు ప్రాణాలు కోల్పోతారని ఆలోచించి, ఇమాం హసన్ ప్రజలు తనకు కట్టబెట్టిన పదవిని త్యజించారు. మావియా కుట్ర ఫలించింది. కొంతకాలం తరువాత హసన్ విషప్రయోగానికి గురై మరణించారు. మావియా రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. మావియా తన కుమారుడు యజీద్ను తన తదనంతర రాజ్యాధికారిగా నియమించాడు.
ఇస్లామియా ధర్మశాస్త్రాన్ననుసరించి సంప్రదింపులే సమస్యల విమోచనకు మార్గాలు. చర్చల కోసం మహ్మద్ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్ రాజధాని కుఫాకు బయల్దేరారు. యజీద్కు విషయం తెలిసింది. యజీద్ ఇమాం హుస్సేన్ను లొంగదీసు కోవడానికి సైన్యాన్ని పంపాడు. ఇమాం పరివారాన్ని కర్బలా అనే చోట అడ్డగించి, యజీద్ను రాజుగా అంగీకరించమని 4000 సైన్యంతో వచ్చిన సైన్యాధిపతి అడిగాడు. అట్లా కాకపోతే యుద్ధానికి సిద్ధపడమన్నాడు. హుస్సేన్ యుద్ధానికి అంగీకరించాడు. మిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు, పిల్లలు కలిసి మొత్తం 108 మంది ఇమాం హుస్సేన్ వెంటఉన్నారు. పది రోజులు యుద్ధం జరిగింది. యూప్రటీస్ నదీ తీరాన కర్బలా మైదానంలో జరిగిన ఈ యుద్ధాన్ని కర్బలా యుద్ధం అని అంటారు. ఈ యుద్ధంలో మగవారంతా మరణించారు. ఒక్క జైనుల్ అబెదీన్ తప్ప. మిగిలిన కుటుంబ సభ్యులనంతా, యుద్ద ఖైదీలుగా 'షామ్' (సిరియా)కు, యజీద్ వద్దకు తీసుకెళ్లారు. పదోరోజు హుస్సెేన్ ఒక్కరే మిగిలారు. యజీద్ సైన్యం దాడి చేసి ఈయనను కూడా పట్టుకుంది. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ కోసం శత్రువునడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొందారు. ప్రార్థనలో నిమగమై ఉండగా శత్రువులు ఇమాం హుస్సేన్ను వెన్నుపోటు పొడిచి సంహరించారు. అప్పటి నుంచి ఇమాం హుస్సేన్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మొహర్రం చేసుకుంటారు. ఆయనను గుర్తు చేసుకుంటారు. నమాజ్ చేప్తారు, ఫాతెహా ఇస్తారు. షియా ముస్లింలైతే నల్ల దుస్తులు ధరిస్తారు. ఇమాం హుస్సేన్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ రక్తం చింది స్తారు. దీన్నే మాతం అంటారు.
పండుగ రోజు...
మొహర్రం నెలలో చంద్రుడు స్పష్టం గా కనిపించిన ఐదో రోజు రాత్రి పంజోకా పిఠారా లేదా తాబూత్ అనే పంజాల నుంచిన పెట్టెను, ముజావిరు అనే అర్చకుని ఇంటి నుంచి పీర్ల మసీదుకు ఊరేగింపుగా తెస్తారు. ఆ పంజాలకు విగ్రహాలకు పది రోజుల ఫాతిహాలు జరుగుతాయి. పీరులు వీరుల హస్తాకృతిలో పంజాల రూపంలో ఉంటాయి. ఊరేగింపు అయిన తరువాత రాత్రికి ఊరు మధ్యలోనున్న నిప్పుల గుండం దగ్గరకు వస్తారు. ఆఖరు రోజున బహిరంగ ప్రదేశంలో ఒక గుంట తీసి అందులో పెద్ద పెద్ద కట్టెలు పేర్చి నిప్పు ముట్టిస్తారు. అది బాగా మండి కణకణ మండే బొగ్గులుగా మారుతాయి. ఈ సమయానికి ఊరేగింపు ముగుస్తుంది.
హసన్, హస్సేన్ పేరులతో పాటు, వారితో పాటుగా ప్రాణాలర్పించిన వీరుల పీర్లను కూడా పట్టుకుని హసన్, హుస్సేన్...హైసాయి, జులోరు అంటూ కేకలేస్తూ పీర్లను చేత బట్టి సన్నాయి, డప్పు వాయిద్యాల మధ్య పరుగు పరుగున ఆవేశంతో పరుగెత్తుతూ, నిప్పుల గుండం మధ్య నుంచి నడిచి పోతారు. మృత వీరులైన హసన్, హుస్సేన్, ఇతర అమర వీరులకూ జోహార్లు అర్పిస్తారు.
ఇలా పీర్ల పండుగ ముగుస్తుంది. ఆ రోజున అందరూ కొత్త బట్టలు ధరిస్తారు. పలావు మొదలైన మాంసాన్ని భుజిస్తారు. అలా ఆ ఆనందంలో పాలు పంచు కోవడానికి ఆత్మీయలైన హిందువులను కూడా విందుకు ఆహ్వానిస్తారు. అలా హిందూ ముస్లీం సామరస్యానికి ప్రతీకగా మొహరం గీతాలను ఆలపిస్తారు.
పీర్ మొహర్రం నెలలో పదో రోజు షహాదత్ను సంతాప దినంగా పాటించ వలసిందిగా హుసేన్ అనుచర వర్గం కోరింది. ఆ రోజున పీర్లు అనే హస్తాకృతులను ఊరేగించి ఊరిలో బావి దగ్గరో, నదుల దగ్గరో వాటిని శుభ్రపరిచి నిర్ణీత పేటికలో వుంచి మరుసటి మొహర్రం నెల వరకు హజావర్ వద్ద భద్ర పరుస్తారు. ఒక రాతిపై ఉన్న పంజా గుర్తు మేరకే హైదరాబాదులోని ఒక ప్రాంతానికి పంజాగుట్ట అనే పేరు వచ్చింది.
నిప్పుల గుండాలు
మొహర్రం పండుగలో ముఖ్యంగా మసీదుల ఎదుట అలాయి తవ్వుతారు. దానిలో అగ్నిగుండాన్ని రాజేసి దాని చుట్టూ ప్రజలు, పీర్లు ఎత్తుతారు. యువకులు అసోయి-దూలా-ఆరతి-కాళ్ల గజ్జెల గమ్మతి, దూలదూలరే ఖాసీమా, దుమ్ము లేపరా ఖాసీమా అంటూ వివిధ పాటలతో నృత్యాలు చేస్తారు.
ఉపవాసాలు
ప్రాణ త్యాగం చేసిన ఇమామ్, హుస్సేన్ త్యాగాన్ని స్మరిస్తారు. మొహర్రం 6, 7, 8, 9న, 10న షహాదత్ రోజు ఉపవాస దీక్షలు నిర్వహిస్తారు.
మేడ్చల్లో...
మేడ్చల్లో గత 68 ఏండ్లుగా ధాత్రిక వంశీయులు పీర్లు నిలబెడుతున్నారు. మేడ్చల్ పట్టణంలో ధాత్రిక కుటుంబానికి చెందిన విఠల్ 1950 సంవత్సరంలో హోటల్ నిర్వహిస్తూ ఉండేవాడు. వ్యవసాయం చేయడానికి పొలాన్ని దున్నుతున్న సమయంలో నాగలి కదలక పోవడంతో, అక్కడ పరీక్షగా చూడగా పీర్ల పంజా లభించింది. ఈ విషయమై పలువురు గ్రామస్తులతో చర్చించి పీర్లను ఆ నాటి నుంచి నేటి వరకు నిలబెడుతున్నారు. మామూలుగా పీర్లను నిలబెట్టడానికి వక్ఫ్బోర్డు కొంత స్థలాన్ని, ప్రతి సంవత్సరం కొంత సొమ్మును కేటాయిస్తుంది. కానీ ఇవేవి లేకుండానే ధాత్రిక వంశీయులు విఠల్ మరణాంతరం సైతం పీర్లను తమ స్వంత స్థలంలో నిలబెడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
- ధాత్రిక గిరిబాబు, నవతెలంగాణ- మేడ్చల్
Authorization