బతుకమ్మ పండుగ... తెలంగాణ ప్రజల బతుకు పండుగ. కాబట్టే ప్రజల జీవన విధానమంతా ఈ బతుకమ్మ పాటల్లో కనిపిస్తుంది. చిత్తూ చిత్తూల బొమ్మ, శివుని ముద్దూల గుమ్మ, ఒక్కేసి పువ్వేసి చందమామ... వంటివి ప్రచారంలోకి వచ్చాయి. కానీ శ్రమ తెలంగాణ ప్రజల అసలైన జీవనాడి ఉన్న పాటలు వెలుగులోకి రానేలేదు. భారతదేశమంటేనే కులాల ద్వారా మనుషుల విభజన. ఆయా వృత్తులను, వాళ్ల శ్రమను వర్ణించిన పాటలేవీ అందుబాటులో లేకుండా పోయాయి.
గ్రామాల్లో 70, 80 ఏండ్ల కిందటి వరకు ఏ వృత్తివారు లేకపోయినా ప్రజలు జీవించడం కష్టం. ప్రతివృత్తివారు ఇంకో వృత్తివారిపై ఆధారపడి జీవించేవారు. అందుకు సంబంధించిన కమ్మరి, సాలె, సాగు జాలరి.. తదితర ఎన్నో సామాజిక వర్గాలకు సంబంధించిన పాటలు ప్రజలు పాడుకుంటున్నారు. ఆ రోజుల్లో అన్ని వృత్తులవారికి అంతో ఇంతో భూమి ఉన్నా, వారి ప్రధాన ఆర్థిక వనరు కులవృత్తినే. అందువల్లనే అన్ని చేతివృత్తుల వారికి చాలినంత పని ఉండేది. ఆ విషయం ఈ పాటల్లోనూ కనిపిస్తుంది. అంతేకాక ఏ వృత్తివారికి కడుపుకు సరిపడా తిండి దొరికేదీ కాదని కూడా ఈ పాటల ద్వారా అర్థమవుతున్నది. ఎప్పుడైనా డబ్బున్నవాడే బాగున్నాడు అని వాచ్యంగా తెలుస్తున్నది.
కమ్మరి కొలిమిని వర్ణిస్తూ...
ఆయా వృత్తుల శ్రమైక సౌందర్యం.. ఎవరి పనిని వారు చేసుకుంటున్నామన్న స్పృహ... ఒకరికొకరు గౌరవించుకుంటూ బతికిన విధానమూ ఈ పాటలో కనిపిస్తుంది.
''ఊరికీ ఉత్తరాన వలలో/ ఊడాలామర్రి వలలో ; ఊడల మర్రి కింద వలలో/ ఉత్తముడి చవిక వలలో; ఉత్తముని చవికల వలలో. రత్నా పందిరి వలలో; రత్నాల పందిట్లొ వలలో/ముత్యాల కొలిమి వలలో; గిద్దెడు ముత్యాలూ వలలో/ గిలికినా కొలిమి వలలో'' అంటూ అరసోల, తవ్వెడు, మానెడు, అడ్డెడు, తూమెడు ముత్యాలు అంటే వడ్లు ఇచ్చినా వస్తువులు తయారు చేసి ఇస్తాడంటూ పాట సాగుతుంది. ఇంత ఇస్తేనే చేస్తా అనే డిమాండ్ను కమ్మరి చేయకపోవడం కూడా గమనార్హం. లేనివాడు ఎక్కడి నుంచి తెస్తాడనే సానుభూతి, అవగాహన కమ్మరిలో ఉన్నది.
''ఊదేటి తిత్తూలు వలలో/ ఉరుములా బోలూ వలలో; వేసేటీ సమ్మెట్లు వలలో/ పిడుగులా బోలూ వలలో'' అంటూ కమ్మరి పనితనం గురించి పాడుకుంటారు. ''చుట్టున్న కాపూలూ వలలో/ చుక్కల్లా బోలూ వలలో; నడుమ కమ్మరి బిడ్డా వలలో/ చంద్రుణ్ణి బోలూ వలలో'' అంటూ కాపులు పనికోసం కమ్మరి వారి ఇంటి వద్ద పడిగాపులు కాయడాన్ని గురించి వర్ణించారు. ప్రకృతితో వారికున్న అనుబంధం, సంబంధాన్ని కవిత్వీకరించారు.
రైతు ఆవేదనకు ఆవిష్కరణ...
పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు రైతు కష్టపడతాడు. అయినా తిండికెళ్లదు. చివరికి కలో, అంబలో తాగి పడుకోవాల్సిన పరిస్థితి. ఆ ఆవేదనను ఆర్ద్రంగా చెప్పిన పాటిది. ''పుట్టిననాడే రైతు ఉయ్యాలో/ భూమినుద్ధరించ ఉయ్యాలో''తో పాట మొదలై ''పొద్దు పొద్దున లేచి ఉయ్యాలో/ పొరపాటు పడకుండ ఉయ్యాలో; తన కర్రునాగలిని ఉయ్యాలో/ కర్రు ఎత్తాకుండ ఉయ్యాలో; ఎద్దులను తోలుకొని ఉయ్యాలో/ ఎగుసమునకు పోవు ఉయ్యాలో.... కారుచెమ్మలు కారిన ఉయ్యాలో/ రాళ్లు రప్పలనక ఉయ్యాలో; పెకిలించు భూమిని ఉయ్యాలో/ కాయకష్టమనక ఉయ్యాలో; అంతలో ఆ యిల్లాలు ఉయ్యాలో/ అంబలి గంజిని ఉయ్యాలో; అంబలీ గంజినీ ఉయ్యాలో/ అతనికి అందించు ఉయ్యాలో; చాలిచాలక తాగి ఉయ్యాలో/ చకచకా లేచును ఉయ్యాలో; కడుపులో పేగులు ఉయ్యాలో/ కారుమంటలుమండ ఉయ్యాలో; ఎండ వేడిమి చేత ఉయ్యాలో/ ఈపు మాడుతుంటె ఉయ్యాలో; దున్నునే ఆ రైతు ఉయ్యాలో/పొద్దుగూకెదాక ఉయ్యాలో'' అంటూ సాగుతది.
అగ్రవర్ణ అహంకారానికి బదులుగా...
ఇక భక్తి పాటలనగానే.. దేవుళ్లు, దేవతలను పొగుడుతూ ఉండేవే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ వాటికి భిన్నమైనదీ పాట ఇది.
గంగా, పార్వతులు శివుడి భార్యలు. అయితే ఈ పాటలో గంగ జాలరి సామాజిక వర్గానికి చెందిన దానిగా, గౌరీ అగ్రవర్ణానికి చెందినదిగా పాడుకున్నారు.
''ఆనాటి రోజునా ఉయ్యాలో/ శివపార్వతులు చేరి ఉయ్యాలో; పాచికాలాడగా ఉయ్యాలో/ అందగత్తెలను గూర్చి ఉయ్యాలో; అందకత్తెలను గూర్చి ఉయ్యాలో/ వాదంబు ఆయెనే ఉయ్యాలో; అతి సౌందర్యవతిని ఉయ్యాలో/ నేను మాత్రమేనంటు ఉయ్యాలో; గౌరమ్మ సెలవిచ్చె ఉయ్యాలో/ డాంబికంబుగాను ఉయ్యాలో; నిన్ను మించిన యట్టి ఉయ్యాలో/ సౌందర్యవతిని ఉయ్యాలో; నీకుసరిరాలిని ఉయ్యాలో/ తెద్దును సవితిగా ఉయ్యాలో'' ఇట్లా సాగే ఈ పాటలో తానే అందగత్తెనని పార్వతి అంటే శివునికి కోపమెందుకు వచ్చింది. ( 1.ఆటలో ఓడటం వల్ల అహంకారంతో పురుష అహంకారంతో సవతిని తెస్తానని ఉండాలి. 2. ఇక్కడ అందం అని వాడినప్పటికీ అది వర్ణానికి సంబంధించిన అంశమై ఉండాలి. ఏ అగ్రవర్ణ అమ్మాయినో చేసుకోకుండా జాలరి వాడకు పోవడం వల్ల రెండవదే సరైనది అనుకోవడానికి అవకాశం ఉన్నది. అంతేగాక ఈ అంశాన్ని బలపర్చే మరో పాట కూడా ఉన్నది.)
శివుడు నల్లగా ఉంటాడు. పులితోలు కట్టుకుంటాడు. మొత్తానికి శివుడి ఆహార్యం శ్రామికవర్గానికి ప్రతీక. అలాంటి శివుడు పార్వతిని పెండ్లి చేసుకుంటాడు. పాటను బట్టి పార్వతి అగ్రవర్ణం అని తెలుస్తుంది. కాబట్టే శివునికి కోపం వచ్చిందేమో! దాంతో ''అప్పుడా శివుడు ఉయ్యాలో/ జాలారివాడకేగి ఉయ్యాలో... జంగమయ్య వేషంలో ఉయ్యాలో/ గంగనే మాయచేసె ఉయ్యాలో''... గంగది కూడా జాలరి సామాజిక వర్గం. కాబట్టే శివుడు అగ్రవర్ణ పార్వతి అహం అణచడానికి గంగను చేసుకున్నాడా? దీంతో మొదటి భార్య పార్వతీ... గంగను అవమానిస్తుంది. ''సరికొల్లలాడను ఉయ్యాలో/ సరిదానివటవే ఉయ్యాలో'' అని పార్వతి అంటే ''సరిదాన్ని కాకుంటె ఉయ్యాలో; శివుడేల దెచ్చునే ఉయ్యాలో; జగమేల మెచ్చునే ఉయ్యాలో; శివునికి చిన్న భార్యను ఉయ్యాలో/ నీకు చెల్లెల్ని ఉయ్యాలో'' అని గంగాదేవి బదులిస్తది. తరువాత పార్వతి తన్నినా గంగాదేవి అవమానాన్ని భరిస్తుంది - బహుశా అణగారిన కులం కాబట్టి కావచ్చు.
పలుమార్లు అవమానాన్ని భరించిన గంగాదేవి కోపమొచ్చి నీటిని వదలదు. బావులు, చెరువులు, కుంటలు, ఆఖరికి సముద్రం కూడా ఎండిపోతుంది. దీంతో సల్లతో, నెయ్యితో, పెరుగుతో స్నానం చేసినా స్నానం చేసినట్టు ఉండదు పార్వతికి. అదీగాక పార్వతికి నెలసరి వస్తుంది. చివరికి గంగదేవి దగ్గరికి తన కొడుకును పంపుతది పార్వతి. 'మీ అమ్మను రమ్మను' అని చెప్పుద్ది గంగ. ఆఖరికి పార్వతికి జాలరి కులానికి చెందిన గంగాదేవి ఇంటికి రాక తప్పదు. ''గౌరమ్మ రాకడ ఉయ్యలో/ గంగమ్మ చూసి ఉయ్యాలో; పచ్చి చేపలు దెచ్చి ఉయ్యాలో/ పందిళ్లు కట్టె ఉయ్యాలో; ఎండు చేపలు దెచ్చి ఉయ్యాలో/ తోరణాలు కట్టె ఉయ్యాలో; ఎన్నడూ నా మేడ ఉయ్యాలో/ ఎరగవూ గౌరక్క ఉయ్యాలో; కూర్చుండు గౌరక్క ఉయ్యాలో/ కూర్చుండ వమ్మా ఉయ్యాలో; కప్ప జచ్చిన నీళ్లు ఉయ్యాలో/ కాళ్లు తా కడిగె ఉయ్యాలో; చేప జచ్చిన నీళ్లు ఉయ్యాలో/ చేయి తా కడిగె ఉయ్యాలో'' అట్లా తన సామాజిక వర్గపు జీవన విధానాన్ని పార్వతికి నచ్చకపోయినా పరిచయం చేస్తుంది. కప్పలు, చేపలు చచ్చిన నీళ్లతో కాళ్లు కడిగి కొంత తన కసిని కూడా తీర్చుకుంటుంది గంగాదేవి.
జాలరి కులానికి చెందిన గంగ... తన సామాజిక వర్గం లేకపోతే అగ్రవర్ణ బతుకులు వెల్లమారవు అని నీటిని బంద్ చేసి నిరూపిస్తది ఈ పాటలో. ఇట్లా ప్రజలు ఆనాటి పరిస్థితులను పాటల్లో ఇముడ్చుకున్నారు. ఈనాటి సమాజానికి ఆనాటి చరిత్రను ఈ పాటల ద్వారా అందించారు. తమ కష్టసుఖాలను పాటల్లోనే వెల్లబోసుకున్నారు. ఆటైనా, పాటైనా వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందించాలి. సమాజ వికాసానికి పాటుపడాలి.
కళను కైగట్టి...
నేసెనో శాలోడు ఉయ్యాలో నెలకొక్కపోగు ఉయ్యాలో
మొదట నేసిండు ఉయ్యాలో మొగ్గలాతోని ఉయ్యాలో
అంచునా నేసిండు ఉయ్యాలో ఆకులు కొమ్మలూ ఉయ్యాలో
నడుమనా నేసిండు ఉయ్యాలో నాగాభరణము ఉయ్యాలో
చింగునా నేసిండు ఉయ్యాలో చామంతి వనము ఉయ్యాలో
చల్లదనమిచ్చే ఉయ్యాలో చంద్రునీ నేసెను ఉయ్యాలో
ఆటపాటల రెండు ఉయ్యాలో హంసలా నేసెను ఉయ్యాలో
కొంగునా నేసిండు ఉయ్యాలో గోరెంటా వనము ఉయ్యాలో
సాలెవాళ్ల చేతుల్లోని అద్భుతమైన కళను కళ్లకు కట్టిన పాట ఇది. ఇన్ని రంగులతో నూలు అద్దకం, వాటిని అటిటుగాకుండా చీర నేయడం చాలా కష్టంతో కూడుకున్నది. ఒక శ్రమను మరిచిపోవడానికి, ఇంకో శ్రమకు పట్టం గట్టిన పాట ఇది. ఒక్క సాలెలే కాదు... ఇలా అన్ని చేతివృత్తుల్లోని వైవిధ్యాన్ని వర్ణిస్తూ పాటలున్నాయి. అవన్నీ మరుగున పడిపోయాయి.
- తాయమ్మ కరుణ
Authorization