దళిత పీడిత వర్గానికి చెందినవారు ఆసాదివారు. వీరు చేసే నృత్యాన్ని ఆసాది నృత్యం అంటారు. వర్షాలు కురవడం కోసం, అమ్మవారు సోకినప్పుడు గ్రామీణులు ఈ నృత్యం ఏర్పాటు చేస్తారు. దేవతైన 'పెద్దమ్మ సామి' కథ చెప్పిస్తారు. ఈ దేవత 'కాపు'లున్నారు. వీరు ఏడాదికొకసారి నృత్యం తప్పక చేస్తారు. ఈ నృత్యంలో త్రిమూర్తుల వలె ముగ్గురుంటారు. వీరందరి దగ్గర వాయిద్యాలుంటాయి. ప్రధాన గాయకుడు పాట పాడితే తక్కిన ఇద్దరు వంత పాడతారు. వీరి వాయిద్యాన్ని 'జవికెన' అంటారు. ఇది కంచుతో నిర్మితమయింది. జవికెల్ని వాయించుకుంటూ నృత్యం చేస్తారు.
ప్రధాన గాయకుడు పాట పాడేటప్పుడు వలయాకారంగా తిరుగుతూ వెనక్కు, ముందుకు అడుగులు వేస్తూ వంగుతూ లేస్తూ చేతులనాడిస్తూ కాళ్ల గజ్జెల నాదంతో నృత్యం చేస్తారు. ఇంత చేస్తున్నా వాయిద్యం మోగుతూనే ఉంటుంది. వంతపాట పాడేవారు అతణ్ణి అనుసరిస్తూ ఉంటారు. ప్రధాన గాయకుడు చేతిని గాలిలో ఊపుతూ, ఇంకొకసారి వేలిని చెవిలో పెట్టుకుంటూ లయాన్వితంగా రాగం తీస్తుంటారు. ఇంకా పాదాలు పైకెత్తి ముని వేళ్ల మీద పెనవేసుకొని నిలబడి తిరుగుతూ, మోకాళ్లపై కూర్చొని నేలమీద అరచేత్తో కొడుతూ పెద్దమ్మ సామికి మొక్కుతారు. ఈ విధంగా పండుగ మరుసటి రోజు మాత్రమే చేస్తారు.
వీరు నృత్యం చేస్తూ కొన్ని మేలుకొలుపు పాటలు పాడిన తర్వాత కొన్ని కథాగేయాలు పాడుతారు. కథాగేయాల్లో పెద్దమ్మసామి కథ, చల్లాపురమ్మ కథ, యల్లమ్మ కథ ముఖ్యమైనవి. వీళ్లకు గ్రామాల్లో 'దేవర' (జాతర) జరిపినప్పుడు ఎక్కువ పని ఉంటుంది. పెద్దమ్మ దేవతకు ప్రీతిపాత్రులమని వీరు చెప్పుకుంటారు. ఒకసారి ఆ స్వామి ప్రత్యక్షమై 'నా శరీరంలోని అవయవాల్ని గూర్చి పాడి, ఆడి గంతులు వేయండి' అని చెప్పిందంట. అందుకు ఆ దేవతను నకశిఖ పర్యంతం వర్ణిస్తూ గేయాలు పాడుతారు. వాటిని 'పొలిపదాలు' అని అంటున్నారు. ఈ పదాలు చాలా శృంగారయుతంగా ఉంటాయి. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రబంధయుగంలో స్త్రీని అంగాంగ వర్ణన చేయడం లక్షణం. అది నిజానికి జానపదులు ఎప్పుడో చేశారనవచ్చు.
-సిహెచ్కె రెడ్డి
Authorization