పశ్చిమ బెంగాల్ లోని పురూలియా జిల్లా చాలా ప్రత్యేకమైనది. ఈ ప్రాంతం ప్రాచీన సాహిత్యంలో వజ్ర భూమి, షుంభో భూమి, , శిఖర్ భూమి, మన్భమ్.. ఇట్లా రకరకాల పేర్లు కలిగి ఉంది. ఇందులో బాగా ప్రసిద్ధి చెందిన పేరు మన్భమ్. ఇది సహజసౌందర్యంతో అలరారుతున్న ప్రాంతం. ఆదివాసీ సంస్కృతికి, చారిత్రక ప్రాముఖ్యానికి దీనికి పెట్టింది పేరు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ ప్రాంతంలో 29 లక్షలమంది జనాభా ఉన్నారు. ఇందులో మూడవ వంతు ఎస్సీ, ఎస్టీ ప్రజలే. ముఖ్యంగా భారత దేశంలోనే అతి పెద్ద తెగగా గుర్తింపు పొందిన సంతాల్ తెగకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. సంతాల్ తెగవారు వ్యవసాయం, ప్రకృతితో సంబంధం గల అనేక పండుగలను చేసుకుంటారు. పేదరికం, ఆకలి సంగతి ఎట్లా ఉన్నా వాటిని లెక్కచేయకుండా వీరు ఈ పండుగలు చేసుకుంటూ తమ మధ్య అనుబంధాన్ని పెంపొందించుకుంటారు.
సంతాలులు నిర్వహించే పండుగల్లో 'సహరే' అనే పండుగ అతి పెద్దదిగా భావిస్తారు. అడవిలోని ఏనుగంత పండుగగా వారు ఈ పండుగను వ్యవహరిస్తారు. కార్తీకమాసంలో అమావాస్య తరువాతి రోజున ప్రారంభించి ఐదు రోజులపాటు ఈ పండుగను జరుపు కుంటారు. సాధారణంగా శీతాకాలం పంట నూర్పిడుల ప్రారంభం లో ఆదివాసీ గ్రామాల్లో ఈ పండుగకు తెరలేస్తుంది. అయితే అన్ని గ్రామాల్లోనూ ఒకే రోజు జరుపుకోరు. ఆ ఊరు వ్యవసాయ పనులు, ఇతర పనులను బట్టి ఒక్కొక్క ఊరు ఒక్కో రోజున పండుగను ప్రారంభించుకుంటారు. ముందుగా గ్రామంలోని సంతాలు లందరూ ఊరు పెద్ద ఆధ్వర్యంలో సమావేశమై ఎప్పుడు పండుగ జరుపుకోవాలో నిర్ణయించుకుంటారు.
దీపావళి పండుగ జరుపుకోవడానికి నరకాసుర వధను ఎట్లా కారణంగా చెబుతారో సహరే పండుగ జరుపుకోవడానికి కూడా ఒక కథను చెబుతారు సంతాలులు. బయటి నుంచి వచ్చిన శత్రువులతో చాలా రోజులపాటు సంతాలులు యుద్ధం చేశారని, చివరికి ఆ శత్రువులు సంతాలులకు లొంగిపోయారని, ఆ లొంగుబాటుకు గుర్తుగానే ఈ పండుగను జరుపుకుంటారని అంటారు. సంతాలులకు కాళీబొంగా సహాయం చేయడం వల్లే ఈ విజయం లభించిందని వారు నమ్ముతారు. ఈ విజయం అమావాస్య రోజు లభించినందువల్ల ఆ రోజు మట్టి దీపాలను వెలిగించి పండుగ చేసుకుంటారని సంతాలులు అంటారు. మరో కథనం ప్రకారం తాము అభివృద్ధి చెందడానికి కారణమైన ఆవులు, ఎద్దులను, భూమిని పూజించడం, గౌరవించడం కోసం ఈ పండుగ చేసుకుంటారు. ఈ పండుగ రోజు తండ్రి కాని, సోదరుడు కాని ఇంటి ఆడపడుచును, ఆమె భర్తను తమ పూర్వీకుల ఇంటి దగ్గరికి ఆహ్వానించి మర్యాద చేస్తారు. ఇట్లా ఆహ్వానించడం చాలా ముఖ్యమైన తంతు. ఇట్లా చేస్తే తమ జాతి సుభిక్షంగా ఉంటుందని సంతాలులు భావిస్తారు. ఐదు రోజులు జరిపే ఈ పండుగను ఒక్కో రోజు ఒక్కో పేరుతో పిలుస్తారు. ప్రతి రోజు ప్రత్యేకించిన పూజ ఉంటుంది.
ఉమ్ మహా
మొదటి రోజుని ఉమ్ మహా అని పిలుస్తారు. ఈ రోజు గ్రామస్థులందరూ పొద్దుగాలే స్నానం చేసి సామూహికంగా పూజలు చేసే ఒక బహిరంగ ప్రదేశానికి చేరుకుంటారు. ఈ ప్రదేశాన్ని 'ఘ్నోర్' లేదా 'ఘ్నోడ్' అని పిలుస్తారు. పూజ పూర్తయ్యేవరకు అందరూ ఉపవాసం ఉంటారు.
పూజారిని నెయిక్ అని, అతడి సహాయకుణ్ణి గాడెట్ అని అంటారు. గాడెట్ ఊళ్లోని ప్రతి ఇంటి నుంచి ఒక కోడి, కొన్ని బియ్యాన్ని సేకరిస్తాడు. కోళ్లలో మూడింటిని దేవతకు సమర్పించడానికి ఎంపిక చేస్తారు. ఇట్లా ప్రతి ఇంటి నుంచి సేకరించిన వాటినన్నింటినీ కలిపి 'చురుచ్ చవావ్లే' అంటారు. పూజారి పొద్దున్నే స్నానం చేసి పూజా ప్రదేశంలో ముగ్గులు పెడతాడు. వాటిమీదే బియ్యం పోసి కుంకుమ కూడా వేస్తారు. ఆ తరువాత మూడు కోళ్లను వారి దేవతలకు బలిచ్చి గ్రామాన్ని ఏ ప్రమాదం బారిన పడకుండా రక్షించమని వేడుకుంటారు. ఆ తరువాత, కిచిడి, కోడి మాంసాన్ని వండి గ్రామం లోని మగవారంతా కలిసి తింటారు. ఈ మొదటి రోజు పండుగలో ఏ స్థాయిలోనూ స్త్రీలు పాల్గొనకపోవడం గమనించాల్సిన సంగతి. తమ సంప్రదాయ దేవతలతో పాటు 'సిమా సరే బొంగా'ని పూజిస్తారు. అతడ్ని శాంతిపరచడానికి ఎర్రటి కోడిపుంజుని బలిస్తారు.
మొదటి రోజున చేసే మరో తంతు ఒక గుడ్డుని కాని, అన్నం ముద్దను కానీ పూజాస్థలంలో ఉంచి గ్రామస్థులు తమ ఆవులను దాని మీదుగా దాటించడం. ఏ ఆవు గుడ్డును పగలదొక్కుతుందో లేక అన్నం ముద్దను చిదిమివేస్తూ దాటుతుందో ఆ ఆవు ద్వారా దేవతలు తమ ఆశీస్సులు అందజేసినట్లుగా భావిస్తారు. ఆ ఆవుని పవిత్రమైనదిగా భావిస్తారు. అట్లాగే ఆ ఆవు యజమానిని కూడా ప్రత్యేకంగా చూస్తారు. అతడు 'హాండియా' అనే స్థానిక మత్తు పానీయాన్ని గ్రామస్థులకు పోయిస్తాడు. పూజాప్రదేశం నుంచి వచ్చిన తరువాత గ్రామస్థులు తమ జంతువులను నిద్రించనీయకుండా తెల్లవార్లూ జగరాణి పాటలు పాడుతూ గడుపుతారు. ఇట్లా చేస్తే తమ పశువులను దేవతలు చక్కగా కాపాడుతాయని వారు నమ్ముతారు.
సార్దీ మహా
రెండో రోజు పండుగను సార్దీ మహా అంటారు. ఈ రోజున ప్రతి సంతాలీ మరంగ్బురు అనే గృహదేవత లేక కుల దేవతను, ఇంటిలోని పూర్వీకులను కొలుస్తాడు.ఈ రోజునే ఎక్కడెక్కడో ఉన్న బంధువులు కలుస్తారు. పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. తాగి తూలుతూ ఆనందిస్తారు. పురుషుడు తన ఇంటి ఆడపడుచును భర్త, పిల్లలతో సహా ఆహ్వానిస్తాడు. ఆరోజు రాత్రి మాంసంతో కూడిన కేక్ తయారు చేసి హాండియాని సేవిస్తూ తింటారు. పూర్వం తెల్లవారిందాకా తినితాగుతూ, ఆడుతూ పాడుతూ గడిపేవారు. ప్రస్తుతం అర్థరాత్రివరకు మాత్రమే ఈ తంతు కనిపిస్తున్నది. ఎక్కడో ఒకటి అరా చోట్ల తెల్లవార్లూ ఉత్సవం చేసుకునేవారు కనిపిస్తారు. ఈ రెండవరోజు నాడే సంతాలులు తమ వ్యవసాయ పనిముట్లను, పశువులను శుభ్రంచేస్తారు. పశువుల కొమ్ములను కడిగి నూనెరాసి కుంకుమతో అలంకరిస్తారు. తమ పూర్వీకులను, 'బొంగా బురు'ను పూజిస్తారు. ఆవు పేడ నీళ్లతో పూజాస్థలాన్ని తడుపుతారు. కోడిమాంసం, అన్నం, హాండియా వంటివాటిని దేవతలకు సమర్పిస్తారు. మూడు చిన్న చిన్న అన్నపు రాశులను పోసి వాటిమీద కుంకుమ చల్లుతారు. ఆ తరువాత బియ్యపు పిండితో చేసిన కేకులను వాటిపై ఉంచి బలిచ్చిన కోడి రక్తాన్ని చల్లుతారు. ఇట్లా చేస్తే తమ పూర్వీకులు, ఆత్మలు సంతృప్తి చెందుతారని సంతాలులు నమ్ముతారు. తరువాత ప్రత్యేకించి 'సోరే' అనే వంటకాన్ని చేసితమ దేవతలకు సమర్పిస్తారు. బియ్యం, కోడి తలలతో తయారుచేసే ప్రత్యేక వంటకాన్నే సోరే అంటారు. మిగిలిన కోడి మాంసంతో ప్రత్యేక భోజనాన్ని వండుకుని ఎవరింటిలో వారు తింటారు.
ఖుంటావో మహా
మూడవ రోజు పండుగను ఖుంటావో మహా లేదా గోరు ఖుంటా అని కానీ అంటారు. ఈ రోజు జరిగే తతంగానికి గ్రామ పెద్ద నుండి ఉదయాన్నే అనుమతి తీసుకుంటారు గ్రామస్థులు. గోరు ఖుంటా అంటే ఆవును రెచ్చగొట్టడం. కార ఖుంటా అంటే పొలం పనుల్లో ఉపయోగించే ఎద్దును రెచ్చగొట్టడం. ఈ తతంగం ద్వారా అప్పటి వరకు పనుల్లేకుండా బద్దకంగా ఉన్న ఆవులు, ఎద్దులను శీతాకాలపు వ్యవసాయానికి సిద్ధం చేయడంగా భావిస్తారు. పశువుల కొమ్ములు కడిగి కుంకుమ, నూనెలతో అలంకరించి అన్నపు ముద్దలు, మెత్తటి గడ్డివంటి వాటిని వాటిపైన, పశువుల కొట్టం పైనా ఉంచుతారు. ఆ తరువాత ఖాళీ ప్రదేశానికి ఈ పశువులను తీసుకుపోయి గోరుఖుంటాని జరుపుకుంటారు. అల్లుడు లేక బావమరిదికి కొత్త బట్టలు పెట్టి పశువును కట్టివేయడానికి అవసరమైన కట్టెను గొయ్యి తీసి నిలపమని కోరతారు. ఆ కొయ్యకు ఆవు లేక ఎద్దును కట్టేసి ఏదైనా కర్ర లేదా తాడు వంటి దానితో వాటిని మూడు సార్లు భయపెడతారు. తరువాత ఆడ, మగ కలిసి పాడుతూ నృత్యం చేస్తారు. ఇది రాత్రంతా కొనసాగుతుంది. కొన్ని గ్రామాల్లో ఆ ఊళ్లోవారు కాని, బయటి నుంచి వచ్చిన బంధువులు కాని తమకు వచ్చిన విద్యలను ప్రదర్శిస్తారు.
నాల్గవ రోజు
'జాలె మహా' అనే పేరుతో నాల్గవ రోజు పండుగను పిలుస్తారు. ఈ రోజు కుర్రకారు ఆడుతూ, పాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి హాండియా, ఉప్పు, బియ్యం వంటి వాటిని సేకరిస్తారు. వాటిని గ్రామ పెద్ద ఇంటి దగ్గర ఇచ్చి ప్రత్యేకించిన విందు భోజనం చేసుకునేవారు. ఇప్పుడు అంతగా ఈ విందు కనిపించడంలేదు.
ఐదవ రోజు
'గాడోయి మహా'గా వ్యవహరించే ఐదో రోజు పండుగనాడు పెండ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు ఒక చోట చేరి ఆడి పాడుతారు. అయితే గ్రామ పెద్ద ఎటువంటి అవాంఛనీయమైన సంఘటన జరుగకుండా ఎప్పటికప్పుడు ఒక కన్నేసి ఉంచుతాడు. అతడి మీద నమ్మకంతోటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఈ ఉత్సవంలో పాల్గొనడానికి పంపుతారు. ఉత్సవం తరువాత పెద్దమనిషి ఆడపిల్లల్ని వారి వారి ఇంటికి వెళ్లి తల్లి దండ్రులకు అప్పగించడం కనిపిస్తుంది. దీంతో ఐదు రోజుల పండుగ ముగిసినట్లుగా భావిస్తారు.
-ఎస్.చక్రవర్తి
Authorization