బైండ్లవారు మాదిగ ఉపకులంవారు అయినప్పటికీ మాదిగవారితో పాటు వేరే కులాలవారి పండుగలు, జాతర్ల సందర్భంగానూ కథలు చెబుతారు. అవన్నీ చాలా వరకు మౌఖికంగా నేర్చుకుని చెప్పేవే కాని గ్రంథాలను చదివి చెప్పేవి కావు. తమ పెద్దలతో పాటు తిరుగుతూ వారి ప్రదర్శనలను గమనిస్తూ నేర్చుకున్నవారే ఈ కళాకారులంతా. అయితే ప్రస్తుతం ఉన్న తరంవారు తమ పెద్దలు చెప్పిన కథలకు తమ పాండిత్యాన్ని, చతురతను జోడించి ప్రేక్షకులను ఆకర్షించడానికి కొత్త విషయాలను, వేషాలనూ జోడిస్తున్నారు. అటువంటి కళాకారుల్లో జనగాం జిల్లా ఖిలాషాపూర్కి చెందిన మారపాక రమేష్ ఒకరు. తమ పెద్దలు ఎవరూ వేషాలు వేసేవారు కాదనీ, తానే వేషాలు కట్టడం ప్రారంభించానని చెప్తాడు ఆయన. స్వయంగా తాను అమ్మవారి వేషం వేస్తాడు. ఏ కథ చెబితే ఆ కథలోని అమ్మవారి వేషం అతడే వేస్తాడు. తనకు తోడు తన సహ కథకునికి కూడా వేషం వేయిస్తాడు. దీంతో తమ కథలకు ఆదరణ పెరిగిందని ఆయనంటున్నారు. రమేష్ చెప్పే కథల్లో పోశమ్మ కథ ఒకటి. ఆ కథ సంక్షిప్త రూపం ఇది...
త్రిమూర్తులు రాజ్య పరిపాలన చేస్తూ కచ్చేరీ మీద కూర్చున్నారట. త్రిమూర్తుల భార్యల్లో ఎవరు పతివ్రత ధర్మరాలు అనే చర్చ వచ్చింది. ఈ విషయంలో వారిని పరీక్షించాలని త్రిమూర్తులు అనుకున్నారు. శివుడు జంగమ వేషం వేసుకొని పార్వతి దగ్గరకు వెళ్ళాడు. గణ గణ గంట గొట్టి, శంఖువు వూది భిక్షాం దేహి అన్నాడు. పార్వతి లోగిళ్లలో ఉండి ఎవరో భిక్షం కోసం వచ్చినట్లున్నారే అని గమనించింది. బంగారు తపుకులో ముత్యాలు, రతనాలు పోసుకొని ఆ ఏడేడు దర్వాజలను ఎల్లదాటుకుంటూ జంగమయ్యను చూసుకుంటూ వస్తున్నది. దగ్గరికి వచ్చి జోలెలో పోస్తుండగా ముఖం చూసింది. ఫ్రాణేశ్వరా నన్ను పరీక్షించదలచావా ఏంటి? నిన్ను గుర్తుబట్టానులే అన్నది. శివుడు తనను గుర్తుపట్టినందుకు సంతోషించి ఆ సందర్భంగా ఒక వరం కోరుకోమన్నాడు. ''నాకు సంతానం ఉంది, భర్త ఉన్నాడు, ఐశ్వర్యం ఉంది అన్నీ ఉన్నాయి. అయినా నువ్వు కోరుకోమన్నావు కాబట్టి కోరుకుంటున్నాను. నాకు సంతాన ఫలం కావాలి అన్నది.'' ఆ కోరిక శివుణ్ణి ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే పిల్లలు పుట్టారు, వాళ్లకు పెండిండ్లు కూడా చేశాం కదా అనుకొని ఆమె మనసును మార్చడం కోసం ఇట్లా అన్నాడు...''పురుగు ముట్టని పుష్పం, కప్ప ముట్టని ఉదకం, చీడబట్టని పత్రి... ఈ మూడు తీసుకువచ్చి నా పాదపూజ చేయాలి. అప్పుడు నీకు సంతాన ఫలం ఇస్తా అన్నాడు. కప్ప ముట్టని ఉదకం ఒక కడవెడు తీసుకురా. అంటే ఒక కడివెడు ఏంటి పది కడవలు తీసుకువస్తా అన్నది పార్వతి పందెం వేస్తున్నట్టు. నీవు చెప్పిన పుష్పాలను కూడా రాశులకొద్దీ నీ పాదాల దగ్గర పోస్తా అన్నది.
బంగారు కడవ పట్టుకొని వెళ్తూ ఉన్నది. ఈమె అన్నంత పనీ చేస్తుందేమో అనుకున్నాడు శివుడు. అందుకే గంగ దగ్గరకు వెళ్లి ఎక్కడా చుక్క నీరు లేకుండా చేయమని కోరాడు. ఒక వేళ ఎక్కడన్నా కొద్దిగా నీరు ఉన్నా అందులో కప్పలు, పురుగులు ఉండేలా చేస్తున్నాడు. తిరిగి తిరిగి అలసట చెంది భర్తతో పందెం కట్టి వచ్చినా కదా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్లాలి? శిలానదికి వెళ్లి శిలనైపోతా అనుకుంటూ అటువైపు బయలుదేరింది. ఎండకన్నె రగని పార్వతి అడవిమార్గంలో నానా తిప్పలు పడుతూ శిలానదివైపు వెళ్తున్నది. ఆమెపై నిఘా ఉంచిన శివుడు ఇది గమనించి ముందుగానే శిలానది ఒడ్డున ఒక శివనాగగుండం కావించుకొని, అక్కడ పూల తోటలు కావించుకొని తోటమాలిలాగా వేషం మార్చుకొని కూర్చున్నాడు. అక్కడికి చేరిన పార్వతి నీరు, పుష్పాలు, పత్రి.. ఇట్లా తనకు కావలసినవన్నీ ఒకే చోట కనిపించేటప్పటికి సంతోషపడిపోయింది. కాపలాగా ఉన్న శివుణ్ణి గుర్తించకుండా అతడితో తన భర్తతో జరిగిన సంభాషణంతా చెప్పుకొచ్చింది. సంతాన ఫలం కోసం ఇన్ని తిప్పలెందుకమ్మా... నేను జంగమ రూపంలో ఉన్న భగవంతుణ్ణే. ఆ ఫలమేదో నేనే ఇస్తా. నాకు పూజలు కట్టు సంతానమిస్తా అన్నాడు. ముందు ఎనక ఆలోచించకుండా ఆమె గుండం నుంచి జలం తీసుకొని తోటమాలి రూపంలో ఉన్న శివుని కాళ్లు కడిగింది. అతడు తన జోలెలో నుంచి అంగూర పండు తీసి ఆమె నోట్లో వేశాడు. మరి నా ప్రాణేశ్వరుని దగ్గరకు ఆయన చెప్పినవి తీసుకెళ్లాలి కదా అన్నది. అప్పుడు ఆ మాయాశివుడు కప్ప ముట్టని ఉదకం అంటే కొబ్బరికాయలోని నీరు. కొబ్బరికాయను తీసుకుపోయి శివుని పాదాల దగ్గర కొట్టి ఆ నీటితో పాదాలను కడుగు అన్నాడు. చీడపట్టని పత్రి అంటే గుగ్గిలమే. కాస్త గుగ్గిలం తీసుకెళ్లి నిప్పుల్లో వెయ్యి. పురుగు ముట్టని పుష్పం అంటే కొబ్బరికాయలో ఉండే మొగ్గ. దాన్ని తీసుకువెళ్లి నీ ప్రాణేశ్వరునికి సమర్పించు అన్నాడు. అట్లాగే అని ఆమె తిరిగి భర్త దగ్గరికి బయలుదేరింది. ఈ లోపు ఆమె గర్భం పెరిగిపోతూ ఉన్నది.
ఇంటికి వచ్చేటప్పటికి శివుడు ఆమెను చూసి అనుమానించాడు. మామ దక్షునిదగ్గరకు వెళ్లి నీ బిడ్డ పాపపు పనులు చేసిందని ఆరోపిస్తే అగ్నికి ఆహుతి చెయ్యమంటాడు దక్షుడు. బహ్మ్ర, విష్ణులు, లక్ష్మీసరస్వతులు చెప్పినా వినకుండా కాష్టం పేర్పిస్తాడు. పార్వతికి కొత్తబట్ట కట్టించి, ఒడిబాల బియ్యం పోసి కాష్టంలో కూర్చోబెట్టి నిప్పు అంటిస్తాడు. అయితే కాష్టం కాలి బూడిద అవుతుంది కాని అమ్మ వారు అట్లాగే ఉంటుంది. అందులోనే నల్లపోశమ్మ పుడుతుంది. అమ్మవారిలో ఏతప్పూలేదని, ఇది నువ్విచ్చిన వరమే అని చెబుతారు. అప్పుడు తోటమాలి వేషంలో తానిచ్చిన వరం గుర్తుకు తెచుకుం టాడు శివుడు. ఐనా పోశమ్మను ఇష్టం లేకుండా పెంచుతుంటాడు. కింద పడేస్తూ ఉంటాడు. దీంతో అమ్మవారు శివునికి కాళ్ల మంటలు, బొబ్బలు పుట్టిస్తుంది. శివుడు అప్పటి నుంచి సొంత కూతురులాగా చూజుకుంటాడు. ''నాన్నా నన్ను పుట్టించావు సరే... మరి ఆహారం సంగతో'' అంటుంది. అప్పుడు ఊరూరా శ్రావణ మాసంలో నీ గుళ్లను శుద్ధి చేసి బోనాలు, మేకపిల్లలు, కల్లు కావళ్లు సమర్పిస్తారని చెబుతాడు శివుడు. కాటిలో పుట్టింది కాబట్టి పోశమ్మను కాటి నల్లపోశమ్మ అని కూడా అంటారు.
బైండ్లవారు ఈ పోశమ్మ కథ సందర్భంగా పోశమ్మకు పుట్టగమ్మి, పట్నం వేస్తారు.తర్వాత ఆమెకు, కత్తికి కళ్యాణం చేస్తారు. కుంభం పోయడం, రతిపోయడం, రతిమీదనే వేటను కోయడం చేస్తారు. జనాలు బోనాలు తీసుకువచ్చి పెడతారు. కథ అయిపోగానే ఈ బోనాల చుట్టూ బలి తిరుగుతారు.
Authorization