పాటలు, డ్యాన్సులు, దరువులతో కూడిన ప్రదర్శనలు ఇచ్చే ప్రత్యేక నాట్యకారిణిలు వారు. పశ్చిమ బెంగాల్ పురూలియా ప్రాంతంలో ఉండే వీరిని 'నచినియర్' లేదా 'బాయి' అని పిలుస్తారు. వీరు పురూలియా జిల్లాలోనే కాక పక్కనే ఉన్న ఝార్ఖండ్ సరిహద్దు గ్రామాల్లో కూడా ప్రదర్శనలిస్తారు. ఈ నృత్యాలకు ఝుమర్ గీతాలు తోడై ప్రదర్శనను మరింత రక్తికట్టిస్తాయి.ఝుమర్ పాటలు ఛోటానాగపూర్ పీఠభూమిలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కనిపించే పాతకాలపు కళారూపం. పల్లెటూరి యాసలో గొంతెత్తి బిగ్గరగా పాడే ఈ పాటలకు అనుగుణంగా నచినీలు డ్యాన్స్ చేస్తారు. నృత్యం చేసేటప్పుడు కాళ్లకు గజ్జెలు కట్టుకొని ఎంతో లయబద్ధంగా అడుగులు వేస్తారు. ఆర్థికంగాను, సామాజికంగాను దీన స్థితిలో ఉన్న 'నచినీ' కళాకారిణుల జీవన చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నది ఈ వ్యాసం.
నచినీ నృత్యం చేసే అమ్మాయిలు మధ్యయుగాల నాటి 'తవాయిఫ్' సంస్కృతి శిథిల రూపాలుగా చెప్పవచ్చు. తవాయిఫ్ అంటే నచినీ బాలిక అని అర్థం. ఈ తవాయిఫ్ అమ్మాయిలు 18వ శతాబ్దం చివరి నాటికి మొగలాయీ ఉన్నత వర్గాల్లో మంచి గౌరవ స్థానం పొందారు. తవాయిఫ్ అవధ్, వారణాసి, మరింత తూర్పుగా కలకత్తా వైపునా పరిఢవిల్లింది. ఆ ప్రాంతాల్లో తవాయిఫ్ని 'బాయిజీ' అని పిలిచేవారు. ఈ కాలంలో ఈస్టిండియా కంపెనీ తన పాలనను భారత దేశంలో విస్తరించింది. చాలామంది యూరప్ జాతీయులు తవాయిఫ్లను పెండ్లాడారు లేదా తమ అంత:పురాల్లో ఆస్థాన నాట్యగత్తెలుగా ఉద్యోగాలి చ్చారు. అయితే 1857 తిరుగుబాటు తరువాత అవధ్ రాజ్యం, ఢిల్లీ మొగల్ సామ్రాజ్యం రద్దయ్యాయి. అదే సమయంలో సాంఘిక సంస్కరణోద్యమకారులు చేసిన ఉద్యమాల ఫలితంగా చాలామంది తవాయిఫ్లు తమ వృత్తిని మానుకున్నారు. అయినా కొందరు తవాయిఫ్లుగా తమ జీవనాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇరవయ్యవ శతాబ్దం వరకు చాలామంది తవాయిఫ్లు, బాయిజీలు పట్టణ జీవన సంస్కృతిని ప్రభావం చూపుతూనే ఉన్నారు. అయితే కొత్త వినోద కార్యక్రమాలు సాధనాలు రావడంతో ప్రజల వినోద జీవితంలో వీరి పాత్ర క్రమంగా తగ్గుతూ వచ్చింది. సమాజ పరిణామాలను అర్థం చేసుకున్న కొందరు గాయనిలుగాను, నటీమణులుగాను మారి పోయారు. మిగిలినవారు ఇంకా టెక్నాలజీ అంతగా వ్యాపించని పల్లె ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఆ విధంగా ప్రస్తుతం ఉన్న నచినీలు పరిణామం చెందుతూ వచ్చారు. అయితే వందల ఏండ్ల క్రితం తవాయిఫ్లకు ఉన్న సామాజిక స్థాయి ఇప్పుడు దిగజారిపోవడమే బాధాకరం. పూర్వం వారి తలీమ్ (శిక్షణ), తెహజీబ్ (మర్యాద), తమీజ్ (సభ్యత)లు ఎంతో గౌరవాన్ని పొందేవి. కానీ ప్రస్తుత నచినీలు అందుకు విరుద్ధంగా సాంఘిక బహిష్కృతుల స్థాయికి వచ్చారు.
నచినీలుగా ఎట్లా మారతారు?
దిగువ తరగతిగా భావిస్తున్నవారి కుటుంబాల నుండి వచ్చిన ఆడపిల్లలతో రూపుదిద్దుకున్నది ఈ నచినీ వ్యవస్థ. చిన్నతనం లోనే ఆడపిల్లలు తమ కుటుంబాలను వదిలి 'రసిక్' అని పిలిచే కళాకారుని దగ్గరకు వెళతారు. ఈ రసికుడే వారికి ఆట, పాటలో తగిన శిక్షణ ఇస్తాడు. ఇతడు ప్రదర్శనలో పాల్గొంటూ పాటలు పాడే ఝుమర్గా ఉంటాడు. ఇతడి కనుసన్నల్లోనే ప్రదర్శన జరుగుతుంది. ఆ ప్రదర్శనలో అతడూ భాగమవు తాడు. ఈ భాగస్వామ్యం ప్రదర్శన వరకే పరిమితం కాదు. నిజ జీవితంలో కూడా అతడే ఆమెతో సహజీవన భాగస్వామి అవుతాడు. ఒకే ఇంట్లో అతడితో తప్పనిసరిగా కలిసి బతకాల్సిన పరిస్థితికి నచినీల వస్తుంది. ఇక్కడ మరొక ముఖ్య విషయం గుర్తుంంచుకోవాలి. ఈ రసికునికి చట్టబద్ధమైన భార్య, పిల్లలు ఉంటారు. వారిని ఒక ఇంటిలో, ఈ నచినీని మరో ఇంట్లో ఉంచుతాడు. రసికుని రక్షణలో తమకు కొంత భద్రత, రిలీఫ్ ఉంటుందని నచినీలు బావిస్తారు. నిజానికి రంగస్థలం మీద తన హావ భావాలు, డ్యాన్సు ద్వారా ప్రేక్షకులను ఆకర్షించడంలో నచినీ కీలక పాత్ర పోషిస్తే, ఆమె రసికుడు మాత్రం ఆమె ద్వారా వచ్చే ఆదాయాన్ని దండుకోవడంలో ప్రధానపాత్ర పోషిస్తాడు. నచినీ వయసు పెరిగిన పక్షంలో రసికుడు ఆమెను వదిలించుకొని కుర్ర నచినీని చేరదీస్తాడు. ఈ విధంగా నచినీ ఒక వయసు వచ్చేటప్పటికి అభద్రతకు, దోపిడీకి గురవుతుంది.
తమ ప్రదర్శనకు ఇప్పటికీ ఒక కళారూపంగా గుర్తింపు రాలేదని ఈ కళాకారిణులు బాధపడుతున్నారు. ప్రదర్శనలో నచినీ రాధ పాత్ర పోషిస్తే, ఆమె రసికుడు క'ష్ణుని పాత్ర ధరిస్తాడు. ఈ రాధ పాత్రధారిణికి నిజ జీవితంలో సామాజిక మర్యాద ఉండదు. ఆమెకు తగినంత పారితోషికం కూడా లభించదు. రసికుల దగ్గర పొందే శిక్షణ తప్ప వారికి ప్రత్యేకించి ఏ సంస్థా శిక్షణ ఇవ్వడంలేదు. ఈ సాంస్కృతిక అస్పృశ్యులు ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వారికి ప్రత్యేకించి ఒక కుటుంబ జీవనం కాని, ఆర్టిస్టులుగా సామాజిక గౌరవంగాని లభించడంలేదు.
ప్రదర్శనలు
ఒక గ్రామంలో ప్రదర్శన ఇవ్వబోయే ముందు ఆ గ్రామస్థులందరికీ తెలిసేలా ప్రకటిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఖాళీ ప్రదేశంలో వారి ప్రదర్శన దగ్గరికి వచ్చి తిలకిస్తారు. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఉన్న కాలాన్ని జాతర్లు, పండుగల సీజన్గా గ్రామీణ బెంగాల్లో భావిస్తారు. ఝుమర్ పాటలు, ఆటలు అంటే మారుమూల బెంగాల్ గ్రామాల్లోను, సరిహద్దు ఝార్ఖండ్ పల్లెల్లోను బాగా ఇష్టపడతారు. నచినీల ప్రదర్శన లో వాయిద్య సహకారం అందించేవారిని 'సుర్' బృందం అంటారు. వీరి సంఖ్య ఏడు నుంచి పది వరకు ఉంటుంది. ప్రదర్శన రాత్రి, పగలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తారు. ఆకట్టుకునే బట్టలు, మేకప్తో ప్రేక్షకులను రక్తి కట్టిస్తారు. వాయిద్యకారులు వేషం లేకుండా కూడా ప్రదర్శనకి సహకారం అందిస్తారు.
ఇటీవలి కాలంలో బాగా పేరున్న ఒకరిద్దరు నచినీ ఆర్టిస్టులకు ప్రభుత్వం అవార్డులు, సత్కారాలతో గౌరవించడం, వారికి నెలవారీ పెన్షన్లు ఇవ్వడం కొత్తపరిణామంగా చెప్పుకోవాలి. 'దర్బార్' అనే స్వచ్ఛందసేవా సంస్థ నచినీలకు అనేక విధాల తోడ్పాటును అందిస్తూ సంఘంలో వారిపట్ల ఉన్న చిన్న చూపును తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నది. అట్లాగే రసికుల చేతుల్లో నుంచి బయటపడిన నచినీలు సొంతంగా ట్రూపులు కట్టుకొని ప్రదర్శన ఇస్తున్న మహిళలూ కనిపిస్తున్నారు. ఇది మంచి పరిణామంగా భావించాలి.నచినీలు మిగతా కళా కారుల్లాగే ఆత్మగౌరవంతో జీవించే రోజులు త్వరగా రావాలి.
-అభిజిత్
Authorization