ప్రజలకు తాము అందించిన రక్షణకు ప్రతిఫలంగా అన్ని కాలాలలోను రాజులకు ప్రజల నుండి పన్నులు వసూలు చేసుకొనే అధికారం ఉంటుంది. భూములు, పశుసంపద, వృత్తి, పరిశ్రమ, వాణిజ్యం వంటి అన్ని సంపాదనా వనరుల మీద పన్నులు విధించేవారు. అర్థశాస్త్రం, మహాభారతం, స్మృతులు పన్నుల విధింపు రేట్లకు సంబంధించి కొన్ని నియమాలు విధించాయి. ఉదాహరణకు పండిన పంటలో 8వ భాగం కాని, 12వ భాగం కాని,16వ భాగం కాని భూమి పన్నుగా వసూలు చేయాలని మనువు పేర్కొన్నాడు. పన్ను రేటులో ఈ తేడా బహుశ నేల రకాన్ని బట్టి, వ్యవసాయ పెట్టుబడిని బట్టి ఉండవచ్చు. అయితే ఈ గ్రంథాలు, నియమాలు మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయి కాని ఆచరణలో మాత్రం రాజులు పరిస్థితులను బట్టి పన్నులు విధించేవారు. పైగా భూముల మీద, వాణిజ్యం మీదపన్ను విధించడం అన్నది ఒకే దశలో జరిగేది కాదు. ఉదాహరణకు భూమి పన్ను... భాగం, భోగం, అరి, సిద్దాయం అని అనేక రకాలుగా ఉండేది. ఉత్పత్తిలో ఎనిమిదవ వంతు పన్ను విధించాలన్న శాస్త్ర నియమం అన్ని రకాల వస్తువులకు వర్తించదు. 'స్కృతిరత్నాకర' రచయిత వంటి తరువాతి కాలపు వ్యాఖ్యాతలు ఉత్పత్తిలో ఆరవ వంతు పన్ను అన్నదికేవలం ఒక విధమైన పన్ను విధింపే అనీ, మరి ఇతర కారణాల మీద ఆధారపడి మరికొన్ని రకాల పన్నులు కూడా ఉండేవనీ సూచిస్తారు. భూమి పన్నులను సాధారణంగా 'కరములు' అనేవారు.
అప్పటి పన్నుల్లో ఒకటైన 'భాగం' అనే పన్ను గురించిన విశేషాలు చూద్దాం. భూమి మీద ప్రాథమిక పన్నును భాగం అనేవాళ్లు. ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్న ప్రాంతానికి సంబంధించి లిఖిత ఆధారాలలో ఇది కనిపించదు. కాని దీనికి సమానమైన పదాలు 'మేయ', 'కొలుచు', 'పంగ' అన్నవి కనిపిస్తాయి. రాజ్యంలోని మొత్తం భూమికి ప్రాథమిక యజమాని కావడం చేత రాజుకు పంటలో భాగం పొందే హక్కు ఉంది. సాగుదారు కేవలం కౌలుదారు మాత్రమే. సాధారణంగా ధాన్య రూపంలో పన్ను వసూలు చేసేవారు. భూమి దేవాదాయమా, భిక్షుదేయమా, బ్రహ్మదేయమా, ఉమ్మడి భూములా, రాచభూములా అన్నదాన్ని బట్టి పన్ను విధించేవాళ్లు. తర్వాతి కాలపు శాసనాల్లో భాగాన్ని 'ప్రతిసాదం' అనేవాళ్లు. కొన్ని శాసనాల్లో వస్తురూపమైన పన్నును 'కొలుచు' లేదా 'కొలుగు' (కొలవదగిన ధాన్యం) అనేవాళ్లు. కళింగ, పల్లవ శాసనాల్లో ఈ పదానికి బదులుగా 'మేయ' అన్న పదం వాడారు. కొలుచు అన్న తెలుగు పదానికి సంస్కృతంలో సమాన పదం ఇది. దానభూములు, అగ్రహారాల విషయంలో దాతలు తమ ఈ ధాన్యం వాటాను దాన గ్రహీతలకు బదిలీ చేసేవారు.
-శాస్త్రి
Authorization