భారతీయ సంగీతంలో 'సితార'కు ప్రముఖ స్థానం ఉంది. ఈ వాయిద్యం తయారు చేయడం చాలా శ్రమ, నైపుణ్యంతో కూడుకున్న కళ. ఉత్తర భారత దేశంలో లక్నో, జైపూర్, గ్వాలియర్, వారణాసి వంటి నగరాల్లోనే ఇటువంటి వాయిద్య పరికరాల తయారి, బాగుచేయడం కనిపిస్తుంది. కానీ నూట యాభై ఏండ్ల క్రితం సంగీతంపై ఇష్టం ఉన్న ఓ వడ్రంగి పనిచేసే కుర్రాడు పరిస్థితులు ఇచ్చిన అవకాశం వల్ల ప్రయోగాలు చేస్తూ సితార వంటి వాయిద్య పరికరాలను తయారుచేయడం ప్రారంభించాడు. ఫలితంగా అతడు నివసించే మిరజ్ పట్టణం కూడా ఈ నగరాల సరసన చేరింది. ఆ కుర్రవాడు వేసిన పునాదులు మహా కట్టడంగా ఎలామారాయో చెప్పడంతో పాటు, కాలం తెచ్చిన మార్పులు... కొత్త వృత్తులు, వ్యాపకాలు, సంస్కృతులు తలెత్తడానికి ఎట్లా కారణమవుతాయో కూడా ఈ వ్యాసం వివరిస్తుంది.
దక్షిణ మహారాష్ట్రలో ఉన్న మిరజ్ పట్టణం (సాంగ్లి జిలా)్ల సితార, తంబుర, వీణ వంటి వాయిద్య పరికరాల తయారీలో ప్రసిద్ధి చెందింది. మిరజ్ పట్టణంలో సితార తయారుచేసేవారి గల్లీకి ఎక్కడిక్కెడి నుంచో ఆర్డర్లు వస్తూ ఉంటాయి. పట్టణ మున్సిపాలిటీవారు ఈ గల్లీకి 'ఫరీద్సాహెబ్ సితార్ మేకర్ మార్గ్' అని అధికారికంగా పేరు పెట్టారు. ఫరీద్సాహెబ్ అనే ఆయన స్థానికంగా ఈ సంగీత సాధనం తయారీ ప్రారంభించిన మొదటి వ్యక్తి.
కాలంతో పాటు మారుతూ...
ఫరీద్సాహెబ్ షికల్గార్ కుటుంబానికి చెందినవాడు. బీజపూర్ను 17వ శతాబ్దంలో ఆదిల్షా పాలిస్తున్న కాలంలో షికల్గార్లు మిరజ్ వచ్చారు. వీరు కమ్మరి పనిచేస్తారు. ముఖ్యంగా వీరు సైన్యం ఉపయోగించే ఆయుధాలు, కవచాలు, ఇతర సైనిక పనిముట్ల రిపేరింగ్ పనులకు ప్రసిద్ధి. 18వ శతాబ్దంలో మిరజ్ మరాఠా పాలకుల కిందికి వచ్చింది. చివరికి 1820 నాటికి రెండు జాగీర్లు (చిన్నది, పెద్దది)గా మిరజ్ విభజితమయింది. ఆంగ్ల-మైసూర్ యుద్ధాలు ముగియడంతో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కాలంలోనే సాంఘికంగాను, సాంకేతిక పరంగాను రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. మరాఠా సైన్యం పాత తరహా ఆయుధాలను వదిలి కొత్త టెక్నాలజీని ఉపయోగించి తయారైన ఆయుధాలను వాడటం ఎక్కువ చేసింది. అంటే సైన్యంలో యాంత్రికీకరణ పెరిగిందన్నమాట. తమకు మార్కెట్ తగ్గిపోవడంతో యుద్ధ సామగ్రికి బదులు వడ్రంగం, ఇండ్లలో వాడుకునే చిన్న చిన్న కత్తులు, కత్తెర్లవంటి వాటివైపు మరలారు షికాల్గర్లు. పాలక పట్వర్ధన్ వంశస్థులు గాయకులు, ఇతర సంగీత విద్వాంసులకు ఆదరణ ఇవ్వడంతో మిరజ్ సామాజిక వ్యవస్థలో మార్పు చోటుచేసుకుంది. భారత ఉపఖండంలోని పెద్ద పెద్ద సంగీత కారులను ఆహ్వానించి మిరజ్లో ప్రదర్శనలు ఇప్పించేవారు. దీంతో మిరజ్ త్వరలోనే ఓ గొప్ప శాస్త్రీయ హిందుస్తానీ సంగీతానికి కేంద్రంగా మారిపోయింది. అట్లాగే 'కిరణ ఘరానా' అభివృద్ధి చెందడంలోనూ దీని ప్రభావం ఉంది. ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ వంటి కిరణ ఘరానా సంగీత పండితులు మిరజ్లోనే స్థిరపడి శిష్యులకు సంగీతం బోధించడం ప్రారంభించారు. మిరత్తో పండిట్ విష్ణు దిగంబర్ పలుస్కర్, పండిట్ బాలకృష్ణ బువా, ఇచల్ కరంజీకర్, సవాయి గంధర్వ, పండిట్ విష్ణు నారాయణ్ భట్కండే, హీరాబాయి బరోడ్కర్, సరస్వతీ రాణే వంటి ప్రసిద్ధ గాయకులు, గాయకురాండ్రు, సంగీత గురువుల జీవితంతో ముడివడిపోయింది.
సంగీతం ఆస్వాదిస్తూ...
ఫరీద్సాహెబ్ మిరజ్లో 1827లో జన్మించాడు. దినదినాభివృద్ధి చెందుతున్న సంగీతంతో పాటు ఫరీద్సాహెబ్ కూడా పెరిగాడు. పట్టణంలో జరిగే 'జల్సా'లు, 'ముషాయిరా'లకు క్రమం తప్పకుండా హాజరయ్యేవాడు. పట్వర్ధన్ ఆస్థానంలో గాయకులకు దక్కుతున్న గౌరవం గురించి విని ఉత్తర భారతదేశం నుంచి అనేకమంది కళాకారులు మిరజ్ చేరేవారు. అయితే స్థానికంగా వారి సంగీత సాధనాలను బాగుచేసేవారు ఎవరూ లేక ఇబ్బందిపడుతూ ఉండేవారు. వారు ఫరీద్సాహెబ్ దగ్గరికి వచ్చి చెడిపోయిన తమ సాధనాలను బాగుచెయ్యమని అడిగేవారు. అతడు తనకి సంగీతం మీద ఉన్న గాఢమైన ప్రేమ, ఇష్టాల వల్ల రిపేర్ చేసే బాధ్యతను భక్తిభావంతో తీసుకున్నాడు. తనకేమీ తెలియకపోయినా రిపేర్ చేయడం కోసం సంగీత సాధనాలను విప్పేవాడు. వాటి నిర్మాణాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసేవాడు.తన పరిశీలనల వల్ల తెలుసుకున్న విషయాలను రికార్డుచేసేవాడు. ఏ సంగీత సాధనం ఎట్లా తయారు చేస్తారు, శబ్దం నాణ్యత, ఎటువంటి ముడిపదార్థాన్ని వాటి తయారీకి ఉపయోగించారు వంటి విషయాలను రాసుకున్నాడు. హిందు సాధువులు గుమ్మడి (బూడిద గుమ్మడి) టెంకెతో తయారు చేసుకునే కమండలాలను అతడు చూశాడు. జానపద కళాకారులు తమ సంగీత సాధనాల తయారీకి గుమ్మడినే వాడటం చూశాడు. దీంతో తీగలు ఉండే సంగీత సాధనాలైన వీణ, సితార, తంబుర వంటి వాయిద్య సాధనాలకు గుమ్మడి టెంకెలను ఉపయోగిస్తే మంచి సంగీత శబ్దం ఉత్పత్తవుతుందని గ్రహించాడు. మహాగని కుటుంబానికి చెందిన టూన్ కలపను కూడా వీటి తయారీకి వాడటం మంచిదని గ్రహించాడు. తన సోదరుడైన మొయినుద్దీన్తో కలిసి కొన్ని ఏండ్లపాటు ప్రయోగాలు చేస్తూ విజయాన్ని సాధించాడు.
ఫరీద్సాహెబ్ తన 71వ యేట 1898లో మరణించాడు. తన జీవిత కాలంలో రాజుల నుంచి, బ్రిటీష్ వారి నుంచి, సంగీత పండితుల దగ్గరి నుంచి అనేక ప్రశంసలు, సత్కారాలు పొందాడు. నూట యాభై ఏండ్ల క్రితం అతడు ప్రారంభించిన సంగీత సాధనాల తయారీ ఇప్పటికీ కొనసాగుతున్నది. ప్రస్తుతం ఫరీద్సాహెబ్ కుటుంబానికి చెందిన ఏడో తరం వారు ఎటువంటి ఆధునిక పరికరాలను ఉపయోగించకుండా కేవలం పాత పద్ధతుల్లోనే సంగీత సాధనాలను తయారుచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వారి ఉత్పత్తులకు మంచి గిరాకి ఉంది. పండిట్ రవిశంకర్, ఉస్తాద్ విలాయత్ ఖాన్ వంటి ఉద్దండ సంగీత పండితులు తమ వాయిద్యపరికరాలను మిరజ్ నుండే కొంటారు. ఉత్తర భారత దేశంలో ఇప్పుడు మిరజ్ సంగీత సాధనాలకు పెట్టింది పేరుగా కొనసాగుతున్నది.
-దీపక్
Authorization