అవసరం మనిషిని ఎంతటి కార్యానికైనా ఉసిగొల్పుతుంది. తన కన్న తల్లి నేతపనిలో పడుతున్న కష్టాన్ని చూడలేకపోయాడు ఓ కొడుకు. ఆమె కష్టాన్ని తీర్చాలంటే తాను ఏదో ఒకటి చేయాలి అని తపన పడ్డాడు. ఆతపనే ఓ యంత్రాన్ని సృష్టించింది. ఫలితంగా తన తల్లి కష్టాన్నే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది నేతకార్మికుల కష్టాలను గట్టెక్కించాడు. వేలాది ఏండ్లుగా నేత విజ్ఞానంలో జరిగిన అభివృద్ధిలో అతడూ ఒక భాగమయ్యాడు.
అతడే మన చింతకింది మల్లేశం.
అతడి ఆవిష్కరణ ఎంత విలువైనదో తెలుసుకోవాలంటే నేతపనిలో వేల ఏండ్ల నుంచి జరుగుతున్న కృషినీ ఒకసారి
గుర్తుచేసుకోవాలి.
జంతువు నుండి మనిషిని వేరుచేసింది నాగరికత. నాగరికత లక్షణాల్లో ఒకటి వస్త్రధారణ. రాతియుగమానవుడు ప్రకృతి శక్తుల నుండి తన శరీరాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. మొదట్లో ఆకులు, చెట్ల బెరడులను చుట్టుకునేవాడు. కొన్ని వేల సంవత్సరాల కాల క్రమంలో వస్త్రాలను తయారుచేసి ధరించడం ప్రారంభించాడు. భారతదేశాన్ని నూలుకు పుట్టిల్లుగా చెబుతారు. దాదాపు ఆరువేల ఏండ్ల క్రితంనాటివిగా భావిస్తున్న కాలిన పత్తి గింజలు మెహర్ఘర్(నేటి పాకిస్తాన్) తవ్వకాల్లో లభించాయి. అంతేకాదు, అద్దకపు ఉన్ని వస్త్రాల తాలూకు అవశేషాలను సింధు నాగరికతా పట్టణం అయిన మొహంజొదా రోలో గుర్తించారు. ఐదువేల క్రితం నాటి జోర్డాన్ వస్త్రం తరువాత అత్యంత పురాతనమైన వస్త్రం ఇదే. పూర్వం వ్యవసాయం తర్వాత విలువపరంగా, కార్మిక శక్తి పరంగా అతి పెద్ద పరిశ్రమ చేనేతే. ఇప్పటికీ భారత దేశంలో ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్న పరిశ్రమల్లో చేనేత పరిశ్రమ ఒకటి. అటువంటి చేనేత పరిశ్రమ అభివృద్ధికి ఎన్నో మానవ సమాజాలు వేలాది ఏండ్లుగా తాము కనుగొన్న కొత్త టెక్నాలజీలను జతపరుస్తూ వస్తున్నాయి. దాని ఫలితమే నేటి స్థితి అని మరువరాదు.
ఎన్నో దశలు
పత్తికాయలనుంచి పత్తిని తీసి వస్త్రం నేసే లోపు అనేక ప్రక్రియలు బోల్డంత మానవ శ్రమ ఈ పరిశ్రమలో ఇమిడి ఉంటాయి. మొదటగా పత్తి కాయల నుంచి పింజను తీయాలి. దీనికోసం రెండు పొత్తరాలు (డబుల్ రోలర్స్) ఉండే కొయ్యసాధనం భారత దేశంలో విస్తారంగా వాడుకలో ఉండేది. దీన్ని హిందుస్థానీలో చరిఖీ అంటారు. దీని ద్వారా పత్తి నుండి విత్తనాలను వేరుచేసేవారు. ఇది భారతీయుల ప్రత్యేక ఆవిష్కరణ. క్రీస్తుశకం ఆరవ శతాబ్దం నాటికే ఇట్లాంటి జిన్ ఒకటి వాడుకలో ఉండేదని అజంతా పెయింటింగ్స్ చెబుతున్నాయి. పత్తి నుంచి గింజలను తొలగించాక దూదిగా ఏకాలి. ఏకుబద్ద ప్రస్తావన బౌద్ధ జాతక కథల్లో ఉంది. అట్లాగే 1469లో రాసిన మిఫ్తాహుల్ ఫజలాలో కూడా ఏకు ప్రస్తావన ఉంది. ఏకిన దూదిని దారంగా వడకాలి. మొదట్లో చేతి కదురు ద్వారా నూలు వడికేవారు. తర్వాత రాట్నం ఆవిష్కృతమయింది. చేతి కదురుతో పోల్చితే, రాట్నం ఉత్పత్తిని ఆరు రెట్లు పెంచింది. పైగా నూలు వడకడం చాలా సులభంగా మారింది. ఎందుకంటే చేతితో కుదురును తిప్పేటప్పుడు బొటనవేలిపై, ఇతర వేళ్లపై పడే బాధాకరమైన ఒత్తిడి నుంచి ఇది విముక్తం చేసింది. దీంతో నూలు ఉత్పత్తి శరవేగంగా పెరిగింది. ఇదిగో ఇటువంటి అద్భుతమైన ఆవిష్కరణతోటే ఆమధ్య మల్లేశం అనే చేనేత కార్మికుడు వార్తల్లోకి ఎక్కాడు. అతడు కనిపెట్టిన యంత్రం కూడా చేనేత వస్త్ర ఉత్పత్తిని వేగవంతం చేయడమే కాక మానవ శ్రమను వందల రెట్లు తగ్గించిందని చెప్పవచ్చు.
మగ్గం మీద ఒక చీర నేయడానికి కనీసం పన్నెండున్నర కిలోమీటర్ల పొడవున్న దారం పడుతుంది. ఈ దారాన్ని 'ఆసుపీట' మీద వెనుక కొయ్య నుంచి ముం దున్న నలభై కొయ్యలకు కనీసం 9 వేల సార్లు, ఐదు గంటల పాటు చుడితే ఒక చీరకు సరిపడా 'కండెదారం' సిద్ధమవుతుంది. నలభై ఏండ్ల పాటు ఆసు చుట్టి చుట్టి మా అమ్మ చేతులు పూర్తిగా పడిపోయే స్థితి వచ్చింది''. నల్లగొండ జిల్లా, సారాజ్పేట గ్రామ నివాసియైన నేత కార్మికుడు చింతకింది మల్లేశం మాటలివి.
ప్రపంచీకరణ మోసుకొచ్చిన ఆధునికత సుడిగాలికి కొట్టుకుపోయిన సంప్రదాయక కుల వృత్తుల్లో చేనేత ఒకటి. ప్రపంచీకరణ ధాటికి తొంభయ్యవ దశకంలో రైతులతో పాటు నేతన్నల ఆత్మహత్యల పరంపర రోజువారీ వార్తలాగా మారిపోవడం తెలిసిందే అందర్నీ కలవరపాటుకు గురిచేసిన కల్లోల కాలం. కార్పొరేటీకరణ, మార్కెట్ మాయాజాలంలో బడుగుజీవులు సమిధలై పోతుంటే పట్టించుకునేవాడే లేడా అని బాధపడుతున్న సందర్భం. కులవృత్తులపై, చేతి వృత్తులపై ఆధారపడి జీవనం సాగించే జనాలు, తమ వృత్తులు కాక వేరే ఏమీ చేతకాక పూట గడవని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడటం ఈ శతాపబ్దపు విషాదాల్లోకెల్లా విషాదం. ప్రభుత్వాల కంటితుడుపు చర్యలు తప్ప శాశ్వత పరిష్కారం ఊసేలేని నిర్లక్ష్యపు రోజులు. విస్తృత పరిధిలో చేతివృత్తులవారి జీవన దృశ్యం ఇట్లా ఉంటే... మల్లేశం మాత్రం తన తల్లి పడుతున్న యాతనను చూస్తూ బాధపడుతూ కూర్చోకుండా, ఎట్లాగైనా దూరంచెయ్యగలనా అన్న ఆలోచనలో పడిపోయాడు.
తల్లి బాధ చూడలేక...
''మల్లేశా! ఇంగ ఈ పని నా వల్లకాదు. బిడ్డా చేతులు పడిపోతున్నరు, మగ్గం మానేసి ఇంకేమైనా పనిచూస్కోరా నాయనా'' అంటూ తల్లి పదే పదే అంటే మాత్రం ఆరో తరగతి చదువుతూ మానేసిన మల్లేశం ఏ పని/ఉద్యోగం వెలగబెట్టగలడు. కానీ మల్లేశం పూట గడవని ఈ పనికంటే చావే శరణ్యమని అనుకోలేదు. ఒక ఆశావహమైన ఆలోచన దిశగా అడుగులేశాడు. మగ్గం పనిమాత్రమే తెలిసి చదువు, ఇతరత్రా ఏ నేర్పు లేని మల్లేశం దానిమీదే బతుకు బండి నడుపుదా మని నిర్ణయించుకొని, ఆసుపోయడానికి తల్లి పడుతున్న యాతనకు పరిష్కారం కనుగొనే పనిలో పడిపోయాడు. ఏడేండ్లు ఒక యజ్ఞంలా భావించి, రకరకాల ఒడిదుడుకులకు గురయ్యాడు. ఆర్థిక ఇబ్బందులు; అయినవాళ్లు, పక్కవాళ్ల తిట్లు- విమర్శలు సహించి, రాత్రింబవళ్లు కష్టపడి మల్లేశం 'ఆసుయంత్రం' కనిపెట్టాడు. తన తల్లి బాధనే కాక చేనేత వృత్తిలో ఉన్న అందరి తల్లుల వెతల్ని దూరం చేయగలిగే ఒక అద్భుతమైన, సృజన చేయగలిగాడు. అదే 'ఆసు యంత్రం' ఆవిష్కరణ. దేశ విదేశాల్లో ప్రశంసలు, అభినందనలతో పాటు కేంద్ర ప్రభుత్వం మల్లేశాన్ని 'పద్మశ్రీ' అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి చేతుల మీదగా స్వీకరించిన పద్మశ్రీ అవార్డు తన ఏడేండ్ల కష్టానికి దక్కిన గౌరవంగా భావించాడు మల్లేశం. దీనితోపాటు నాబార్డు అవార్డు, అమేజింగ్ ఇండియన్ అవార్డు, లభించాయి. ఫోర్బ్స్ లిస్టులో మల్లేశం పేరు చేరింది. అట్లాగే నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) తన ఆవిష్కరణకు పేటెంట్ హక్కు కల్పించింది. ఇట్లా ఒకనాటి అత్యంత సామాన్యమైన చేనేత కుటుంబానికి చెందిన మల్లేశం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఆనాడు తెలంగాణలో 1500 మగ్గాలు కూడా నడవని పరిస్థితి నుంచి ఆసుయంత్రం ఆవిష్కరణ తరువాత ప్రస్తుతం ఆరు వేల మగ్గాలు నడుస్తున్నాయి. అవసాన దశలో ఉన్న చేనేత రంగానికి మల్లేశం ఆసుయంత్రం జవజీవాలు పోసి నిలబెట్టిందంటే అతిశయోక్తి కాదు.
ఒక అతి సామాన్యమైన వ్యక్తి, అంతగా చదువు లేని వృత్తి కార్మికుడు చేనేత వృత్తిలో అత్యంత కీలకమైన పనిముట్టయిన ఆసుయంత్రాన్ని కనిపెట్టడం కేవలం ఆ కులానికి సంబంధించిన ఆవిష్కరణ కాదు. ఇది ఒక యూనివర్సల్ ఇన్నోవేషన్. మరుగున పడిపోతున్న కులవృత్తుల పునరుజ్జీవనానికి, ఆత్మహత్యలకు పురికొల్పే పరిస్థితులను మార్చడానికి ఇది ఒక పాజిటివ్ సంకేతం. మల్లేశం ఆవిష్కరణ వేల సంవత్సరాలుగా జరుగుతున్న చేనేత విజ్ఞాన అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.
అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులను పరిచయం చేసి ుజుణ ్aశ్రీస పోర్టల్లో మల్లేశం గురించి తెలుసుకున్న రాజ్ అనే ఎన్ఆర్ఐ అతడి జీవితంపై సినిమా తీస్తున్నాడు. అతని గురించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, కచ్చితమైన స్క్రిప్టుతో, పారలల్ సినిమా కాన్సెప్టుతో షూటింగ్ షురూ చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన అన్ని నిజమైన లోకేషన్లలోను ముఖ్యంగా చేనేత మగ్గాలు అధికంగా ఉన్న పట్టు చేనేత వస్త్రాలకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హైదరాబాదు దగ్గర పోచంపల్లి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ మొదలుపెట్టాడు రాజ్. మల్లేశం సినిమా ఎందుకు తీయాలనిపించింది అని దర్శకుడు రాజ్ని అడిగితే... ''ఫార్మర్స్, వీవర్స్- మనకి రెండు వర్గాలకు సంబంధించిన ఆత్మహత్యల వార్తలు రోజూ పేపర్లలో రావడం తెలుసు... అంటే తొంభైల్లో. బాధ అనిపిస్తుండేది. వీటికి పరిష్కారం లేదా అనే ఆవేదన ఉండేది. ఎప్పుడైతే ుజుణ ్aశ్రీస లో మల్లేశం సార్ వీడియోను చూశానో అప్పుడనిపించింది. ఇంత విషాదకరమైన సందర్భంలో ఒక వెలుగు లాగా, ఒక పాజిటివ్ థాట్గా ఆత్మహత్యలకు అప్పోజిట్గా ఒక అద్భుతమైన విషయంగా అనిపించింది. అందుకే ఈ సినిమా తీస్తున్నానని చెప్పాడు రాజ్. ఈ సినిమా ద్వారా మల్లేశం కోట్లాదిమందికి చేరి నిరాశలో మునిగినవారికి స్ఫూరినిస్తాడని ఆశిద్దా.
-నర్సిం, 9490819259
Authorization