యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండల కేంద్రంలో ఆలేటివాగు ఒడ్డున వుండే ముడిగెలలో కళ్యాణీ చాళుక్యుల కాలం నాటి కొత్త విగ్రహం బయటపడింది. ఈ విగ్రహం గురించి పత్తి సిద్ధులు అనే రైతు ఇచ్చిన సమాచారంతో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్ నాయకత్వంలో అక్కడికి వెళ్లి విగ్రహాన్ని పరిశీలించారు. ప్రతిమాలక్షణాలను బట్టి ఆ శిల్పం కేశవమూర్తిదిగా పేర్కొన్నారు. చతుర్భుజాలున్న ఈ విగ్రహం ముందరి చేతులు విరిగిపోయాయి. వెనుక కుడిచేతిలో శంఖం, ఎడమచేతిలో చక్రం ఉన్నాయి. కుడివైపు పాదాల వద్ద గరుడుడు, ఎడమవైపు లక్ష్మీదేవి ఉన్నారు. తలకిరువైపుల దశావతారాలు చెక్కి ఉన్నాయి. ముడిగెలలో గతంలో కూడా కొన్ని శిల్పాలు బయటపడ్డాయి. రాష్ట్రకూటుల నాటి మహిషాసుర మర్దిని, వినాయకుని శిల్పాలు ఇందులో కొన్ని. బెల్లంబొంద అని పిలిచే బావిలో ఆంజనేయుని విగ్రహాలు దొరికాయి. కొలనుపాక జైన దేవాలయంలో లభించిన ఒక శాసనంలో ముడుగునూరు జైన బసతి గురించిన ప్రస్తావన ఉన్నది. ఆ ముడుగునూరే నేటి ముడిగెల కావచ్చు.